విహారాలు

India

Gamyam

Monday, May 30, 2011

మేమూ... గోదావరీ... కిన్నెరసానీ...

‘‘ఏ పని చేసినా ధ్యానంలా చెయ్యి. ధ్యానాన్ని మట్టుకి పనిలా చెయ్యకు’’ కిటికీ దగ్గర సీట్లో కూర్చున్న తనికెళ్ల భరణి తను చదువుతున్న ఆ పుస్తకంలో ఆ వాక్యం చదువుతుంటే విన్న మేం బావుందంటుండగా పాలకొల్లు స్టేషనొచ్చేసింది.

పాలకొల్లు నుంచి నరసాపురం రూట్లో ఉన్న చించినాడ ఊరివేపు డైవర్టయ్యింది కానుమిల్లి అమ్మిరాజు పంపిన ఇన్నోవా. వశిష్ట గోదావరికి ఎడాపెడా ఉన్న గట్లమీద చిక్కటి కొబ్బరి తోటలు ఆ చెంచినాడ బ్రిడ్జి దాటుకుంటూ డాక్టర్ ఆర్వీరాజు గారి బ్లాకండ్ వైట్ గెస్ట్‌హౌస్‌కి వందల మీటర్ల దూరంలో కట్టిన ఏపీ టూరిజమ్ వాళ్ల రిసార్ట్స్ కళకళ్లాడిపోతున్నాయి.


భరణి అతని అసిస్టెంటు యోగా వెంకటేషూ, నేనూ కారు దిగి లోపలికి వెళ్తుంటే మాకెదురొచ్చాడు ముదునూరి అక్కిరాజుగారు. రిసెప్షన్ దగ్గర దిండి రిసార్ట్స్ మేనేజర్ కమల్ వెల్‌కమ్ అంటా వచ్చి ‘‘మీరు పైన స్నానాలు చేసి రండి. మీ రూమ్స్ హౌస్‌బోట్లో ఉన్నాయి. మీ సామాన్లక్కడ సర్దిస్తాం’’ అన్నాడు.


ముప్ఫై రెండు గదులున్న ఆ బిల్డింగ్ వెనక్కెళ్లాం. కొబ్బరి చెట్ల నీడల్లో కుడిపక్క బారు, రెస్టారెంటు, చిల్డ్రన్ పార్కు ఉన్నాయి. ఎడం పక్క స్విమ్మింగ్ పూలు, నిండా కాయల్తో పనసచెట్టూ, వాటిని దాటుకుంటూ ముందుకెళ్తే నలభై అడుగులు లోతు ఉన్న వశిష్ట గోదావరి పాయ. దాని ఒడ్డున... జలజాక్షి, నీలవేణి, కిన్నెరసాని, వశిష్ట సంపంగి అనే పేర్లు గల హౌస్ బోట్లున్నాయి. బోటుకు రెండేసి ఏసీ గదులు అటాచ్డ్ బాత్రూములు ఉన్నాయి. మెట్లెక్కి పైకొస్తే అందమైన బాల్కనీ.

http://www.sasitourism.com/tourism/manage_files/Image/eco%20tourism/andhra%20pradesh%20eco/House-boat.jpg
మాకిచ్చిన కిన్నెరసాని బాల్కనీలో కొచ్చాను. కాస్సేపటికి అక్కిరాజుతో పాటొచ్చిన భరణి, ‘‘మీరు, వంశీ ఆ మూలకి, నేనూ, వెంకటేషూ ఈ పక్కకి’’ అంటూ మూలకెళ్లిపోయాడు. ‘‘పోనీండ్రా నర్సాపురం సైడూ’’ అంటూ అక్కిరాజరవక ముందే డుబ్ డుబ్ చప్పుళ్లతో బయల్దేరింది కిన్నెరసాని.

ఆ మూలున్న భరణి కాసేపు ఏదో పుస్తకం చదువుకుని తర్వాత రాతలో పడిపోయాడు. ముందుకెళ్తున్న మాకు పన్నెండుమంది కూర్చున్న పెద్ద పడవ ఎదురైంది. వాళ్లంతా చేపలు పట్టేవాళ్లు. వాళ్లలో ముగ్గురు కుర్రోళ్లు సెల్‌ఫోన్లలో తెగ మాటాడేసుకుంటున్నారు. ‘‘ఎవరాళ్లు? ఏంటా గొడవ’’ అంటే మొదలెట్టాడు రాజుగారు. ‘‘వాళ్ల పడవలో అయిలు ఉంది. దాన్ని గోదాట్లో వెయ్యడానికి బయల్దేరారాళ్లు.


అయిలు అంటే అదో చేపలు పట్టే వల. కిలోమీటరు పొడుగుంటుంది. సందలాడే టైములో చేపల వేటలో దిగే యీళ్లు చాలా సంపాదిస్తారు. కానీ మొత్తం తాగుడికి తగలేస్తారండీ. ఈళ్లే నిలబెట్టుకోడం జరిగితే కుబేరులైపోతారు తెల్సా!’’ అన్నాడు. ముందుకెళ్తుంది కిన్నెరసాని.


కాసేపట్లో సముద్రంలో కల్సిపోతున్న ఈ వశిష్ట గోదారి నీళ్లు ఉప్పగా ఉన్నాయి. అందుకే దీనికెడాపెడా రొయ్యల చెరువులు. గోదారి మధ్యలో చెట్టుకీ చెట్టుకీ మధ్య పదడుగుల గ్యాప్‌లో దిగేసిన కొబ్బరిచెట్ల వరస. దాన్ని కట్టు అంటారంట. ఆ ప్రాంతంలో చేపలు పట్టేవాళ్లకి అదో స్థిరాస్తంట. రాయాలంటే ఇదో పెద్ద కథవుద్దంట.


లాంచీ ముందుకెళ్తోంది. కట్టు ముందుండే ఆ కొబ్బరిచెట్టు దుంగల మీద నిలబడ్డ నల్లటి నీటి కాకులు చాలా పొడవాటి ముక్కులతో మెడిటేషన్ చేస్తున్నట్టు నిలబడున్నాయి. వాటన్నింటినీ చూసిన అక్కిరాజు, ‘‘వీటిలో ఒక కాకి చెరువులోకి వాలితే ఇరవై రొయ్యలకి తక్కువ తినదు. దాన్ని చంపడానికొచ్చే లెసైన్సున్న నాటు తుపాకోడు, ఒక కాకిని చంపడానికి రెండొందలడుగుతాడు.


అయితేనండీ ఎర్రటి దాని మాంసం భలే రుచి. అసలా రుచెలా గొచ్చిందనుకుంటున్నారు? అదెప్పుడూ రొయ్యల్ని, చేపల్ని గదండీ తినేదీ’’ అన్నాడు. రాజమండ్రి నించి ఎగువ గోదారి అందం చుట్టూ కొండలతో అచ్చమైన గోదారందం. ఈ దిగువ గోదారిది ఇంకో రకమైన అందం.


అచ్చం కేరళాలోలాగా గోదావరికి ఎడాపెడా చిక్కాచిక్కటి కొబ్బరి తోటల మధ్య మొలచిన బోలెడన్ని సెల్‌ఫోన్ టవర్లు. ఆ నావ అడ్డచెక్క మీద కూర్చున్నోడు గెడేస్తుంటే చుక్కాని దగ్గర కూర్చున్న ఇంకోడు సెల్‌ఫోన్లో మాట్లాడ్తున్నాడు. ఖాళీగా ఉన్న ఆ రేవు పక్కన ఒంటరిగా కూర్చున్న ఆ కన్నెపిల్ల ఏదో ఆలోచిస్తోంది. కాస్త దూరంలో మూడు గేదె పెయ్యలు మేస్తుంటే ఒక గేదెని ఆన్చి నిలబడ్డ కుర్రోడు సెల్‌ఫోన్ మాట్లాడుతున్నాడు.


గోదారికి ఎనిమిది గంటలు పాటు ఎనిమిది గంటలు పోటు ఉంటుందంట. రాజుగారు చెప్తున్నదింటా దూరంగా చూస్తున్నాను. మూడు కాశీ ఆవులు కిందకి దిగిన తుమ్మ కొమ్మల్ని మేస్తుంటే ముగ్గురు చిన్న కుర్రోళ్లు బోసి మొలల్తో స్నానాలు చేస్తున్నారు. ఈలోగా టమోటా రంగు చీర కట్టుకొచ్చిన ఆడ మనిషి పామంచాల్లో కాళ్లు కడుక్కెళ్లి పోతుంటే, సిమ్మెంటు దిమ్మ మీద వాలిన కింగ్ ఫిషర్ పక్షి చాలా దీర్ఘంగా ఆలోచిస్తోంది.


ఎడం పక్క సఖినేటిపల్లి రేవు, కుడిపక్కన నరసాపురం రేవు. సఖినేటిపల్లి రేవులో వరుసగా ఆగున్న పడవల వెనకాల నలుపు, పచ్చ, నీలం రంగు జెండాలు కట్టిన పొడుగాటి కర్రలు కనిపించాయి. అవేంటని అడిగితే వేటకెళ్లినప్పుడు సముద్రంలో వలేశాకా గుర్తు కోసం ఈ జెండాలని పాతుతాం అన్నారు.


పడవలన్నీ ఇక్కడే ఉన్నాయేంటి వేటకెళ్లలేదా అంటే తిథులను బట్టి వెళ్తాం. ఎందుకంటే కొన్ని తిథుల్లోనే చేప సముద్రంలో పైకితేల్తా తిరుగుద్ది అన్నారు.

‘‘ఇప్పుడీళ్ల పడవలు సముద్రంలో కెళ్లకూడదండీ, గవర్నమెంటు నిషేధం ఉంది. ఎందుకంటే చేపలు గుడ్లు పెట్టే సీజనిది. ఏరా కరెక్టేనా నే సెప్పేది?’’ అన్నాడు రాజుగారు.
‘‘అయ్యబాబోయ్ చాలా కరెస్టండి’’ అన్నాడా పడవలో కుర్రాడు.

కొంచెం ముందుకెళ్లిన కిన్నెరసాని వెనక్కి తిప్పేస్తుంటే, ‘‘ఇదేంటి, అంతర్వేది అన్నాచెల్లెళ్ల గట్టు వెళ్లదా?’’ అన్నాను. ‘‘కెరటాలు తగుల్తాయండి’’ అన్నాడు అసిస్టెంటు డ్రైవరు శ్రీను. కిన్నెరసాని వెనక్కి తిరుగుతున్నప్పుడు వరసగా కట్టేస్తున్న వేట పడవల పేర్లు చాలా తమాషాగా ఉన్నాయి. మల్లే బాగిర్తి, దోనే నాగన్న, రాచపల్లి అయిలయ్య, నక్కా రాములు తాత, మేరుగు పెద్ద కోదండం. వాటిని చదివిన భరణి ‘‘పేర్లలో ఎంత నేటివిటి’’ అనేసి మళ్లీ పన్లోకెళ్లిపోయాడు.


గాలి తిరిగింది. దగ్గర్లో సముద్రం ఉండటం వల్ల ఈదురు గాలి మా ముఖాలక్కొడుతోంది. స్పీడుగా ముందుకెళ్తున్న కిన్నెరసాని మధ్యాహ్నానికి దిండి రిసార్ట్స్ రేవులో ఆగింది. ఒడ్డున బోటుకి లంగరేసి కట్టేశాక పవర్ కనెక్షనిచ్చేసరికి రూముల్లో ఏసీ మిషన్లు పన్జెయ్యటం మొదలెట్టినియ్యి.


రెస్టారెంట్లో వంటల్తో పాటు భరణి కోసం రాజోలు లాయరు బబ్బీస్ (అసలు పేరు పొన్నాడ సూరిబాబు) గారింట్లోంచి అక్కిరాజు తెప్పించిన వెజిటేరియన్ కూరలు, ఆవపెట్టిన అరటిపువ్వు కూర, ఆవపెట్టిన పనసపొట్టు కూర, చల్ల మిరపకాయలు, వేగీవేగని గుమ్మడి వడియాలు, కచ్చాపచ్చాగా దంచిన కొబ్బరి మామిడి పచ్చడి... ఇలా ఒకటి కాదు చాలా.


వీటన్నిట్లోకి మహాద్భుతమైంది, ఒక్క గోదావరి జిల్లాలవాళ్లు మట్టుకే కాచే లక్ష్మిచారు. ‘‘చాలా బాగుంది. దీని రెసిపీ ఎలాగ సార్?’’ అన్నాడు గుంటూరువాడైన యోగా వెంకటేషు. ‘‘ఇది ఆడోళ్లు కాస్తారు. మాకేం తెల్సు’’ అన్నాడు అక్కిరాజుగారు. ‘‘నైటుకి కూడా దాచుకుంటాను’’ అంటూ నా పక్కకొంగి, ‘‘ఓ గంటసేపు రిలాక్సవుతాను’’ అంటా కిందున్న తన రూములోకెళ్లిపోయాడు భరణిగారు.


ఈలోగా అక్కిరాజు కాకినాడ ఫ్రెండయిన ప్రభు సాల్మన్ వచ్చాడు. పరిచయాలు, కాసేపు మాటలు అయ్యేటప్పటికి గంట గడిచిపోయింది. నిద్రలేచి ముఖం కడుక్కొచ్చిన భరణిక్కూడా ప్రభుని పరిచయం చేశాక బయల్దేరింది బోటు. చించినాడ రేవు పక్కన పిల్లలు క్రికెట్ ఆడ్డం చూసిన అక్కిరాజు, ‘‘ఎక్కడ జూసినా క్రికెట్టే. ఇదంతా ఈ మధ్య ఇండియా నెగ్గడం వల్లొచ్చింది’’ అంటా విసుక్కున్నాడు.


మర్రిచెట్టు మధ్యలోంచి మొలిచిన ఈతచెట్టు నిండా గెలలు. కింద నీడలో పొద్దుటే కప్పేసిన సమాధికి వెదురుకర్రతో చేసిన క్రాస్ గుచ్చి, దాని మొదట్లో బంతిపూలు పెట్టారు. ఇంకొంచెం ముందుకెళ్లాక అయిదు తలల తాటిచెట్టుని చిత్రంగా చూశాం. విచిత్రం, చెట్టున్న పొలం యజమానికి అయిదుగురు కొడుకులంట.


ఇంకొంచెం ముందుకెళ్తే కిక్కిస్ పొదల్లో ఒక లంక కనిపించింది. అది ప్రతి యేడూ పెరుగుతా వస్తుంది కాబట్టి దాన్ని పెరుగులంక అని పిలుస్తారంట. అక్కడ్నించి ముందుకెళ్లడానికి ఆ లంకకి కుడి పక్కనుంచో దారి, ఎడం పక్కనుంచో దారి ఉన్నాయంట. ‘‘ఇప్పుడు ఎడం పక్కనుంచి పోనియ్యండి. వచ్చేటప్పుడు కుడి పక్కనుంచొద్దాం’’ అన్నాడు ప్రభు.


ఆ రేవులో ఆడపిల్లలు బట్టలుతుకుతుంటే, కొందరు ఉతికేసి పిండిన బట్టలని తీగలకారేస్తున్నారు. దాని పేరు గంగడిపాలెం రేవంట. ఊరు లోపలుందంట. బోటు ఇంకా ముందుకెళ్తుంటే మాకెదురైన ఆ చిన్న నావలో అందరూ ఆడోళ్లే. ఒడ్డున సీమచింత చెట్టు కొమ్మల్నిండా పండిన ఎర్రటి సీమచింత కాయలు. తట్టుకాలువ అనే ఆ చిన్న ఊరి రేవులో రంగురంగుల పడవలు, ఒడ్డుమీద చిన్న చిన్న ఇళ్లు, ఒడ్డున నిలబడ్డ చిన్న పిల్లలు మాకు టాటా చెప్తున్నారు.


చెట్టు కొమ్మలూగుతున్నాయి. చల్లగాలి తిరిగింది. మఠం రేవు దాకా వెళ్లాక వెనక్కి తిరిగింది. రెండు పెద్ద చేపలు నీళ్లలోంచి పైకి లేచి మళ్లీ లోపలికెళ్లిపోయాయి. వాటిని చూసిన నేను, ‘‘గోదాట్లో ఎలాంటి చేపలు పడతాయి’’ అన్నాను. ‘‘కొయ్యంగ, మేన, పండుగొప్ప, మాగ, వర్షాకాలంలో పొలస’’ అన్నాడు అక్కిరాజుగారు.


‘‘మరి సముద్రంలో?’’

‘‘నెమలికోను, నామాలసొర, నల్లసందువా, అగలిస్, మెంజీరంతో పాటు మనిషంత ఎత్తుండే గొడుం అన్న చేప కూడా పడద్ది’’ అన్నాడు. వెళ్తున్న హౌస్ బోటు నెమ్మదిగా స్లో అయ్యింది. రెండు ఎకరాల్లో కిక్కిస్ దుబ్బుల అంచునాగింది. ‘‘దిగండి’’ అన్నాడు ప్రభు సాల్మన్. దిగి కొంతదూరం లోపలికి నడిచాక, తెల్లటి మొండి గోడలు... ఒక పక్క కౌంటర్ లాంటిది, ఇంకోపక్క రెస్టారెంట్, కిచెనూ ఉన్న ఆనవాళ్లు..

‘‘ఏంటియ్యి?’’ అన్నాను. ‘‘ఒకనాటి ఏపీ టూరిజం వాళ్లు మేనేజ్ చేసిన ఈవెనింగ్ రిసార్ట్స్ తాలూకూ జ్ఞాపకాలు. నేనూ మా వెరోనికా చాలాసార్లు వచ్చిన ఏకైక ప్లేసిది’’ అన్నాడు. కాస్త వివరంగా చెప్పమన్నాను. సూర్యుడు ఇంకాస్సేపటికి కిందకి దిగిపోతున్న టైములో మొదలెట్టాడు ప్రభు సాల్మన్.

‘‘అప్పట్లో దిండి రిసార్ట్స్ కట్టలేదు. చుట్టూ నీళ్ల మధ్యున్న ఈ తిప్పమీద కట్టిన ఈవెనింగ్ రిసార్ట్స్‌లో ఒకటే జనం. ఎక్కడెక్కడి జనమో సాయంత్రమైతే ఇక్కడుండేవారు. నేనూ, మా వెరూ ఈ రిసార్ట్స్ పర్మినెంట్ కస్టమర్లం. అహ్మద్ టమోటా రైసు, బిర్యానీ, రమణ చేసే గుత్తొంకాయ కూరకి ఫ్యాన్సుం’’ అన్నాడు ప్రభు.

‘‘అసలేం జరిగింది? ఈ రిసార్ట్స్ ఎందుకలా పాడయ్యాయి?’’ అన్నాను.

‘‘ఆ వేళ ఆగస్టు ఇరవై మూడు. వారం రోజుల్నుంచున్న తుపాను గాలులు బాగా పెరిగిపోయాయా వేళ. ఆ రాత్రి గోదారి పోటు బాగా పెరిగింది. ఇక గాలి గురించి చెప్పడానికి భయమేస్తుంది. ఒకటే వర్షం. పెద్ద పెద్ద వృక్షాలూ, జంతువుల కళేబరాలూ నీళ్లలో కొట్టుకొస్తున్నాయి. లంకలో కాపురాలుండే జనాలు ఒడ్డెక్కేస్తున్నారు. ఏకంగా కొన్ని గుడిసెలు ఉన్న పళంగానే కొట్టుకొచ్చేస్తున్నాయి. ఆ తుపాను రాత్రి నీళ్లలో కొట్టుకుపోయినియ్యి కాటేజెస్’’ అన్నాడు ప్రభు.


‘‘మళ్లీ కట్టొచ్చుగా?’’ అన్నాడు యోగా వెంకటేషు.

‘‘కట్టకపోవచ్చు. ఎందుకంటే వరదల రోజుల్లో కొంచెం కొంచెం చొప్పున ఈ నేలని మింగేస్తుంది గోదావరి.’’
‘‘ఐతే మీరూ మీ వెరోనికా మళ్లీ రాలేదా ఈ పక్కకి?’’ అన్నాను.
ఆ ప్రశ్నకదోలాగయిపోయిన ప్రభు, ‘‘రీసెంటుగా తనకి చేసిన సర్జరీ ఫెయిలవడంతో హాస్పిటల్లోనే చనిపోయింది మా వెరోనికా’’ అంటున్నప్పుడు చీకటి పడ్తున్న నల్లటి ఆకాశంలాగే మారిపోయిందతని ముఖం.

No comments:

Post a Comment