విహారాలు

India

Gamyam

Tuesday, July 19, 2011

ఎగ్లాస్‌పూర్ చరిత్ర వెంట ఒక రోజు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 22 వన్యమృగ సంరక్షణా కేంద్రాలలో శివారం వన్యమృగ సంరక్షణా కేంద్రం ఒకటి. ఇది గోదావరి నదికి రెండు వైపులా ఉన్న కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో 37 చ.కి.మీ. వైశాల్యంలో విస్తరించి ఉంది. ఇక్కడ ఒక ప్రత్యేక రకం నీటి మొసళ్ళను సంరక్షిస్తున్నారు. పర్యావరణ చరిత్రపై పిహెచ్.డి. చేసిన నాకు ఎప్పటికైనా ఈ పర్యావరణ పరిరక్షక కేంద్రాన్ని చూడాలని కోరిక ఉండేది. ఈ కేంద్రపు పడమటి సరిహద్దు గ్రామమైన ఎగ్లాస్‌పూర్ గురించి మా అమ్మ చెప్పిన వివరాలు నాలో మరింత కుతూహలాన్ని రేకెత్తించాయి.

నేను జూన్ 16వ తేదీ ఉదయం 5 గంటలకు హైదరాబాద్‌లో గోదావరిఖని బస్సు ఎక్కి 11 గంటలకు రామగుండం దాటిన (220 కి.మీ) తరువాత 'బి పవర్‌హౌస్‌గడ్డ చౌరస్తా' దగ్గర దిగాను. అక్కడి నుండి ఆటోలో 10 కి.మీ. ప్రయాణించి ఎగ్లాస్‌పూర్ చేరుకున్నాను. ఎగ్లాస్‌పూర్ ఒక చారిత్రక గ్రామం. ఇక్కడ కనిపిస్తున్న రాతియుగం, బౌద్ధయుగం, శైవయుగం నాటి చారిత్రక ఆనవాళ్ళు ఈ ఊరి మొదటి పేరు 'ఎహువలసపురం' అయ్యుంటుంది అనడానికి ఆధారమిస్తున్నాయి. ఎహువల ఛాంతమూలుడు అనే ఇక్ష్వాకురాజు నాగార్జునసాగర్ ప్రాంతంలోని విజయపురి రాజధానిగా తెలుగుదేశాన్ని కీ.శ. 300ల ప్రాంతంలో పరిపాలించాడు.

ఇక్ష్వాకు పాలక ప్రాంతం ఖమ్మం జిల్లా వరకు ఉండేదని ఇటీవల ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో తవ్వకాలు జరిపే వరకు తెలియదు. ఖమ్మం జిల్లా కరీంనగర్ జిల్లాకు తూర్పు సరిహద్దు. ఎగ్లాస్‌పూర్ కరీంనగర్ జిల్లా తూర్పు ప్రాంతంలోనే ఉంది. అయితే కుతుబ్‌షాహీ సుల్తానులు తెలుగు దేశాన్ని (గోల్కొండ రాజ్యాన్ని) పరిపాలించిన కాలంలో ఎక్లాస్‌ఖాన్ అని ఒక అధికారి ఉండేవాడు. ఎగ్లాస్‌పూర్‌లో ఆ కాలపు కచేరీ కూడా ఉంది కాబట్టి అతడు ఈ ఊరిని తన పేర పొంది ఉండవచ్చు. ఇదే ఊరిలో నిజాం కాలం నాటి ఫారెస్ట్ గెస్ట్‌హౌస్ కూడా ఉండేది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ అటవీ, పర్యాటక శాఖల వారు తమ మ్యాపులు, ఇన్ఫర్మేషన్ బ్రోచర్లలో ఎగ్లాస్‌పూర్‌లో ఫారెస్ట్ గెస్ట్‌హౌస్ ఉందనే చూపుతున్నారు. కాని నిజానికి అది ఇప్పుడు లేదు.

ఏనుగుకండి

ఎగ్లాస్‌పూర్‌కు మూడు పక్కలా గుట్టలు, అడవులు ఉండగా, ఉత్తరాన నాలుగు కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ప్రవహిస్తున్నది. ఊరికి దక్షిణం వైపు నడుస్తుండగా మనకు ఎన్నో ఎత్తయిన పచ్చని గుట్టల వరుసలు కన్పిస్తాయి. ఆ గుట్టల్లో ప్రధానమైనవి నల్లగట్టు, పొల్లగట్టు, కొసగట్టు, బొల్లిగుండ్లు, చాపరేళ్ళ గండి. నల్లగట్టు ఎగ్లాస్‌పూర్‌కు, పుట్నూరుకు మధ్య సరిహద్దు. ఈ నల్లగట్టు, బొలిగుండ్లు కలిసే ప్రదేశం ఇరుకుగా ఉంటుంది.

ఆ రెండు ఊర్ల మధ్య రాకపోకలు, రవాణా జరగడానికి సుమారు వేయేండ్ల కింద ఒక రాజు ఆ ఇరుకు ప్రదేశాన్ని సుమారు ఫర్లాంగు పొడవున రెండు గజాల వెడల్పుతో తొలిపించాడు. దాంతో గోదావరి నదిపై వారు జరిపే వస్తు వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు సులభతరమయ్యాయి. ఆ కండి దాటిన ఫర్లాంగు దూరంలోనే పాలవాగు, పెద్దవాగు ప్రవహిస్తున్నాయి. అవి మరో వాగులో 'సంగమించి' చివరగా గోదావరిలో కలుస్తుండడం చూస్తే ఆ ప్రాంతంలో పూర్వం వ్యాపార సౌలభ్యం కొరకే ఆ కండి తొలిపించబడింది అనిపిస్తుంది.
కండి అంటే కనుమ. ఇది ఉత్తర దక్షిణంగా సాగుతుంది. కండి మార్గంలో ఉన్న ఒక పెద్ద బండ అంచున నాలుగు అడుగుల పొడవు, మూడు అడుగుల ఎత్తు కొలతలతో దంతాలు గల ఒక ఏనుగు కుడి కాలు ఎత్తి దక్షిణం వైపు నడుస్తున్నట్లుగా తొలచబడింది. ఆ ఏనుగుపైన ఒకరు కూర్చున్నట్లుగా ఉంది. ఆ చిత్రం రాజుదో, రాణిదో, మరెవరిదో తెలియదు. శాసనాలుండకపోతాయా అని చుట్టుప్రక్కల ఒకటికి నాలుగుసార్లు వెదికాను. నా ప్రయత్నం ఫలించింది. ఒక శాసనం కనిపించింది.

శాసనం ఏనుగుకు వెనుకవైపున మూడు అడుగుల దూరంలో బాగా పాకురుపట్టి కనిపించకుండా ఉంది. కొద్దిగా శుద్ధి చేశాక అర్థమైంది. అది ఒక తెలుగు శాసనం. మూడు గజాల పొడవు, అడుగు వెడల్పుతో మూడు వరుసల్లో రాయబడి ఉంది. పాలియోగ్రఫీ (ప్రాచీన వ్రాతలకు సంబంధించిన శాస్త్రం) ప్రకారం ఆ శాసనం సుమారు పదవ శతాబ్దానికి చెందినదై ఉండవచ్చు. ఆ శాసనాన్ని గురించి ఆర్కియాలజీ డిపార్టుమెంటు వారికి తెలియజేస్తే దాని ఉద్దేశం మనకు స్పష్టంగా తెలియొచ్చు. అలాంటి శాసనాన్ని కనిపెట్టడం నా అదృష్టం. ఏనుగుకండి గుండా ప్రయాణించేవారు తమకు సంతానం కలగాలని, ఆరోగ్యంగా ఉండాలని ఏనుగు తొండం మీద నూనె పోసేవారట. ఆ నూనె మరకలు కన్పిస్తున్నాయి.

బోగందాని గుడి!

ఏనుగుకండికి తూర్పున కొద్దిదూరంలో నల్లగట్టు మీద బోగందాని గుడిగా చెప్పబడుతున్న గుహ ఉంది. ఆ గుహను ఒకప్పుడు ఆవాసంగా వాడారు అనడానికి నిదర్శనంగా అందులో గోడ కట్టడాలు కన్పిస్తున్నాయి. ఆ గుహలో సుమారు ముప్పై నలభై మంది కూర్చొని విశ్రాంతి తీసుకోవచ్చు. గుహ దగ్గర ఒక రోలు కూడా కనిపించింది. ఆ గుహ ఒకప్పటి నివాస ప్రాంతం అనడానికి ఇది కూడా నిదర్శనంగా నిలుస్తుంది. క్రీస్తుకు పూర్వం రెండు, మూడు శతాబ్దాలు, క్రీస్తు తర్వాత రెండు, మూడు శతాబ్దాలు తెలుగు దేశంలో బౌద్ధమతం బాగా వ్యాప్తిలో ఉండేదనేది చారిత్రక సత్యం. బౌద్ధ సన్యాసులు ఎండాకాలం, చలి కాలాల్లో గ్రామాలు, పట్టణాల్లో మత ప్రచారం చేసి వర్షాకాలంలో గుహల్లో తలదాచుకునేవారు.

మొదట్లో బౌద్ధ ఆరామ విహారాల్లోకి స్త్రీలకు ప్రవేశం ఉండేది కాదు. క్రమంగా క్రీ.శ. 6,7 శతాబ్దాల నుండి బౌద్ధ మతంలో వజ్రయాన శాఖ బయలుదేరి అందులో మద్యమాంసాలతో పాటు మగువలకు కూడా ప్రవేశం కల్పించబడింది. తదనంతరం బౌద్ధ ఆరామాల్లో లైంగిక కార్యకలాపాలు ఎక్కువై అవి ప్రజాదరణను కోల్పోయాయి. అలాంటి ఆవాసాలు బొంకుల దిబ్బలుగా, లంజల దిబ్బలుగా పేరుబడసాయి. అలాంటి పరిణామానికి గురైనదే ఈ ఎగ్లాస్‌పూర్ బౌద్ధ స్థావరం (బోగందాని గుడి) కూడా. మొదట అది పవిత్రమైనదే (గుడి) అయినా కూడా కాలక్రమంలో అందులో బోగం (లైంగిక) కార్యక్రమాలు జరగడం వల్ల అది బోగందాని గుడి అనే వింత పేరును సంతరించుకుంది. ఎగ్లాస్‌పూర్‌కు దగ్గర్లోని 'లంజమడుగు' ప్రాంత చరిత్ర కూడా ఇలాంటిదే కావడం గమనార్హం.

నీటి బండలు

బోగందాని గుడికి వంద అడుగుల దూరంలో తూర్పున ఒక బోరు ఎక్కి సగం దిగినాక 'గద్దవాలు' అనే ప్రదేశంలో 'నీటిబండ' ఉంది. అది ఒక రాతి గుండంలా ఉంది. దానిలో ఎంతో లోతైన నీరు ఉంది. ఒక పొడవాటి కట్టెను దించినా దాని అడుగు అందలేదు. అక్కడి ప్రజలు అతిశయోక్తిగా అందులో ఏడు మంచాల నులకకు రాయి కట్టివేసినా అడుగు అందదని చెప్తారు. ఆ గుండంపైకి ఒక రాయి పైకప్పుగా ఉంది. ఆ గుండం పరిసరాల్లో సుమారు అరడజను ఆవాసయోగ్యమైన గుహలున్నాయి. నీటిబండకు ఎదురుగా పడమటి దిక్కున ఉన్న బొల్లిగుండ్ల గుట్టపై మరో అరడజను గుహలున్నాయి.

ఇంకొంచెం పడమటి దిక్కున చాపరేళ్ళ గండి దాటాక 'కుక్కమూతి రాళ్ళ' మధ్య మరో నీటి దొన ఉంది. ఆ రెండు నీటి దొనల్లో ఎండాకాలంలో కూడా నీళ్ళుంటాయి. కుక్కమూతి రాళ్ళ దగ్గర గల పెద్ద దొనలో 'అంబటి మల్లన్న' అనే దేవుడు (శివుడు) పూజలందుకుంటున్నాడు. అయితే మల్లన్న గుడి ముందున్న 'పెయ్యకండి'లోని పెయ్య (లేగదూడ) కాళ్ళ డెక్కల గుర్తులు, ఏనుగుకండిలోని ఏనుగు గుర్తులు ఇక్కడికి పడమరన 20 కి.మీల దూరంలో ఉన్న కోటిలింగాల రాజుల (గోబద, సమగోప, సాతవాహన) నాణేల మీద కూడా ఉన్నాయి. వాటి మధ్య ఉన్న పోలిక ఏనుగుకండి, పెయ్యకండిల చరిత్రను క్రీస్తు పూర్వపు కాలానికి తీసుకెళ్ళింది.

పీరీల దొనలో అడవి పందులు

ఏనుగుకండికి పడమరగా ఉన్న బొల్లిగుండ్ల గుట్టను ఎక్కిన తరువాత శిఖరాన్ని ఎక్కక ముందే పడమర వైపుకి తిరిగితే కనిపించేది పీరీల దొన. దాని ముందు కనిపించేది పీరీల గుండం. తెలుగు దేశాన్ని కుతుబ్‌షాహీలు, వారి తరువాత నిజాంలు పరిపాలించిన (15-20 శతాబ్దాల) కాలంలో పీరీల పండుగ సమయంలో ఇక్కడ ముస్లింలు, హిందువులు పీరీలను నిలిపేవారట. ఆ దొన లోతుగాను, పొడవుగాను, చీకటిగాను ఉంది. అందులోకి దేవుడు ఆవహించిన (శిగం తూలే) మనిషి వెళ్ళి పీరీలను బయటికి తీసుకువచ్చేవాడట. ఆ దొన పైన రాతిబండకు నాగులు, బైరాగులు వంటి అస్పష్టమైన విగ్రహాలున్నాయి. రాతియుగపు చిత్రాలు కూడా గోచరిస్తున్నాయి. స్పష్టంగా తెలుసుకుందామని ఆ దొన దగ్గరికి వెళ్ళేసరికి పొలోమని ఐదారు అడవి పందులు బయటికి వచ్చి పొదల్లోకి పారిపోయాయి.

ప్రకృతి రమణీయత

పీరీల దొన నుండి మేము బొల్లిగుండ్ల శిఖరమెక్కాం. అక్కడి నుంచి చూస్తే ప్రపంచమంతా మన ముందే ఉందనిపించింది. ఆ శిఖరం భూమికి సుమారు 300 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడి నుంచి ఉత్తరం వైపు చూస్తే గలగలా పారుతున్న గోదావరి, మిగతా మూడుపక్కలా ఎత్తయిన గుట్టల వరుసలతో కూడిన పచ్చని అడవులు, లోయలు, వాగులు, కొండల్లో ఏకాంతంగా కనిపించే తెల్లని గుడి (అంబటి మల్లన్న దేవాలయం) ఉన్నాయి. గురజాడ అప్పారావుగారి కన్యక వెళ్ళింది ఈ గుడికేనేమో అనిపిస్తుంది.
ప్రకృతి ప్రేమికులను, అడ్వెంచర్ పర్యాటకులను, పరిశోధకులను తప్పకుండా అలరించే ప్రదేశం ఎగ్లాస్‌పూర్ ఏనుగుకండి ప్రాంతం.


- డా. ద్యావనపల్లి సత్యనారాయణ
94406 87250

Monday, July 18, 2011

విశ్వ విజ్ఞాన ‘తొలి’ వేదిక.... దేశంలోనే అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయం .. నలంద విశ్వవిద్యాలయం.

ప్రపంచంలోనే అత్యంత పురాతన విశ్వవిద్యాలయాల్లో నలంద విశ్వవిద్యాలయం ఒకటి. నాగరికత పురుడుపోసుకుంటున్న ప్రాచీన కాలంలోనే ఈ విశ్వవిద్యాలయంలో.. గణిత, విజ్ఞాన, వైద్య, తర్క శాస్త్రాలు ఎనలేని ఆదరణ చూరగొన్నాయి. వివిధ దేశాల నుండి ఎందరో విద్యార్థులు 11వ శతాబ్దంలోనే ఇక్కడ విద్యనభ్యసించారు. నేడు ప్రపంచంలోనే పేరెన్నికగన్న.. ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయాలకంటే ముందే భారతదేశంలో.. ‘నలంద’ విజ్ఞాన ఖనిగా నిలిచింది. క్రీస్తుశకం 427 నుండే నలంద బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా వెలుగొందింది. బీహార్‌ రాష్ట్రంలో ఉన్న ఈ విశ్వవిద్యాలయ శిథిలాలు.. దే శంలోనే ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రంగా వెలుగొందుతున్నాయి.

nalanda-university-complex 
నేటి ఆధునిక గణిత, వైద్యశాస్త్ర పరిశోధనాలయాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆనాడే.. నలంద విశ్వవిద్యాలయం శస్త్ర విద్యలో ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ కంటి పొరలు, గర్భకోశం నుంచి మృతపిండాన్ని తీయడం వంటి శస్త్ర చికిత్సలు చేసేవారంటే అతిశయోక్తి కాదు. మానవులతోపాటు ఇక్కడ జంతువు లకు కూడా పరిపూర్ణమైన వైద్య సౌకర్యం ఉండేది. ఇక్కడ పొరుగు దేశాలైన చైనా, టిబెట్‌, జావా, సమత్రా, కొరియా, గ్రీసు, ఇరాన్‌, అరేబియాలనుంచి విద్య నేర్చుకోవడానికి విద్యార్ధులు నలందకు వచ్చేవారు. 10 సంవత్సరాలకు పైగా ఉండి తర్క, వైద్య, ఖగోళ శాస్త్ర సంబంధమైన విషయాలు నేర్చుకునేవారు. బిహార్‌ రాజధానికి పాట్నాకు ఆగ్నేయంగా 55 మైళ్ళ దూరం లో ఉన్న నలంద విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయం.

నలంద అంటే సంస్కృతంలో జ్ఞానాన్ని ఇచ్చేది అ ని అర్ధం. నలంద అనే సంస్కృత పదం ‘నలం’ అనగా కమలం అని అర్ధం (కమలం జ్ఞానికి చిహ్నం). ‘ద’ అంటే ఇవ్వడం అనే రెందు పదాల కలయుక ద్వారా పుట్టిం దే ‘నలంద’. అనగా జ్ఞానప్రదా యిని అని అర్థం. చైనా తీర్థయాత్రికుడు హ్యూయన్‌ త్సాంగ్‌ నలంద పదానికి వివిధ వివరణలు ఇచ్చాడు. ఒక వివరణ ప్రకారం నలందకు ఆ పేరు మామిడి తోపు మధ్యన ఉన్న చెరువులో నివసించే నాగుని వలన వచ్చింది. హ్యూయన్‌ త్సాంగ్‌ సమ్మతించిన రెండవ వివరణ ప్రకారం ఒకప్పుడు బోధిసత్వుని రాజధాని ఇక్కడ ఉండేదని, ఆయన నిరంతర దానాలు చేసేవాడని అందుకే ‘నలంద’ అన్న పేరు వచ్చిందని వివరించాడు.

గౌతమ బుద్ధుని కాలములో నలంద...
Nalanda-sariputta 
నలంద విశ్వవిద్యాలయం క్రీశ.427 నుంచి క్రీ.శ.1197 వరకూ బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా ఉండేది. పాక్షికంగా పాల వంశ పాలనలో ఉన్నది. ఇది లిఖిత చరిత్రలో ప్రపంచంలోని తొలి విశ్వ విద్యాలయాలలో ఒకటి. అలెగ్జాండర్‌ కన్నింగ్‌హాం నలందను బారాగావ్‌ గ్రామంగా గుర్తించాడు. బుద్ధుడు చాలాసార్లు నలంద చుట్టు పక్కల ప్రాంతంలో తిరిగాడని, అక్కడ కొన్ని రోజులు ఉన్నాడని అంటారు. బుద్ధుడు అనేక పర్యాయములు నలందలో ఉన్నాడని చరిత్ర చెబుతోంది. ఆయన నలందను సందర్శించినప్పుడు అక్కడ ఉన్న మామిడితోపులో బస చేసేవాడట.

అక్కడ ఉండగా ఉపాళీ-గహపతి, దీఘాతపస్సీలతో చర్చలు జరిపేవాడు. కేవత్త, అసిబంధకపుత్తతో కూడా అనేక చర్చలు జరిపినట్టు తెలుస్తున్నది. బుద్ధుడు మగధ గుండా తన చివరి యాత్రలో నలందను సందర్శించాడు. సారిపుత్త, తను చనిపోయే కొద్దికాలం ముందు ఇక్కడే బుద్ధుని యెడల తన విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ సింహగర్జన చేశాడు. రాజగృహ నుండి నలందకు వెళ్ళే మార్గం అంబలత్తికా గుండా వెలుతుంది. అక్కడి నుండి ఆ మార్గం పాతాలీగామా వరకు వెళ్ళేది. రాజగృహకు, నలందకు మధ్యన బహుపుత్త చేతియ ఉన్నది.

Nalanda_University 
కేవత్త సుత్త ప్రకారం... బుద్ధుని కాలానికే నలంద ప్రాముఖ్యత కలిగి నిండు జ నాభాతో వృద్ధి చెందుతున్న నగరం. అయితే ఆ తరువాత చాలాకాలానికి గానీ విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందలేదు. సమ్యుత్త నికాయలోని, ఒక రికార్డులో న లంద బుద్ధునికాలంలో తీవ్ర క్షామానికి గురైనదని నమోదు చేయబడినది. బు ద్ధుని కుడిభుజం వంటి ఆయన శిష్యుడైన సారిపుత్త నలందలోనే పుట్టి, ఇక్కడే మరణించాడు. నలంద, సొన్నదిన్న యొక్క నివాసస్థలం.

ఒకప్పుడు జైనమత కార్యకలాపాలకు కేంద్రమైన నలం ద లో మహావీరుడు అనేక పర్యాయములు బసచే సి నాడని పేర్కొనబడినది. మహావీరుడు నలం దలో ఉన్నపవపురిలో మోక్షాన్ని పొం దినట్టుగా భావిస్తారు. (అదేకాక జైనమ తంలోని ఒక తెగ ప్రకారం, మహా వీరుడు నలంద సమీపాన ఉన్న కుందల్‌పూర్‌లో జన్మించాడు). అ శోకుడు క్రీస్తుపూర్వం 250లో ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించా డని చెబుతారు. టిబెట్‌ మూలాల ప్రకారం, నాగార్జునుడు నలంద వి శ్వవిద్యాలయములో బో దించాడు. చరిత్రకారుల ప్రకారం ఈ విశ్వవిద్యా లయం క్రీశ 1193 వరకు ఉన్నతస్థా యిలో వర్థిల్లింది. దీనికి ప్రధాన కారణం బౌద్ధచక్రవర్తులైన హర్షవర్ధనుడు వంటివారు. పాలివంశానికి చెందిన రాజుల ఆదరణే కారణం.

విశ్వవిద్యాలయ చరిత్ర...
Nalanda_Universit 
చారిత్రక ఆధారాల ప్రకారం నలంద విశ్వ విద్యాలయము గుప్తరాజుల, ముఖ్యంగా కుమార గుప్త, సహాయంతో క్రీస్తుశకం 450లో నిర్మించబడినది. నలంద ప్రపంచంలోనే మొట్ట మొదటి ఆవాస విశ్వవిద్యాలయం. అంటే ఈ విద్యాలయంలో విద్యార్థుల కొరకు వసతి గృహాలు ఉండేవి. ఇందులో షుమారుగా పదివేల మంది విద్యర్థులు, రెండువేల మంది బోధకులు ఉండేవారు. పెను గోడ ద్వారాలతో ఈ విశ్వ విద్యాలయము ‘అతి ఘనమైన కట్టడం’ గా గుర్తించబడినది.

నలందలో ఎనిమిది ప్రత్యేక ఆవరణలు, పది గుళ్లు, లెక్కకు మించిన ధ్యాన మందిరాలు, తరగతి గదులు ఉండేవి. ఆవరణలో కొలనులు, ఉద్యానవనాలు ఉండేవి. గ్రంధాలయం ఒక తొమ్మిది అంతస్తుల భవనంలో ఉండేది. ఇందులో ఎన్నో గ్రంధాల ములాలు ఉన్నవి. నలంద విశ్వ విద్యాలయంలో బోధింపబడే విషయాలు ప్రతి విజ్ఞాన శాఖనూ స్పర్శించాయు. నలంద విద్యార్ధులను, బొధకులను కొరియా, జపాన్‌, చైనా, టిబెట్‌, ఇండోనేషియా, పర్షియా, టర్కి వంటి దేశాల నుండి ఆకర్షించింది. తాంగ్‌ వంశానికిచెందిన చైనా తీర్థ యత్రికుడు హ్యుయాన్‌ త్సాంగ్‌ 7వ శతాబ్ధపు నలంద విశ్వ విద్యాలయం గురించి వివరాలు సంగ్రహపరిచాడు.

బౌద్ధమతంపై నలంద ప్రభావం...
9 - 12 వ శతాబ్దం మధ్యకాలంలో ప్రజ్వరిల్లిన టిబెటన్‌ బౌద్ధత్వం (వజ్రాయన) నలంద బోధకుల నుండి, సంప్రదాయాల నుండే ఉద్భవించింది. వియత్నాం, చైనా, కొరియా, మరియు జపాన్‌లలో అనుసరించే మహాయాన బౌద్ధం పుట్టుక కూడా ఈ విశ్వ విద్యలయ ప్రాంగణంలోనే జరిగిందంటే అతిశయోక్తి కాదు. థెరవాడ బౌద్ధం కూడా నలందలో బోధించబడినది. కానీ థెరవాడ బౌద్ధానికి నలంద గట్టి కేంద్రం కాకపొవడం వల్ల, తరవాతి అభివృద్ధి ఇక్కడ జరగలేదు.

పతనావస్థ...
Nalanda_seal 
1193లో నలంద విశ్వవిద్యాలయ సముదాయాన్ని, భక్తియార్‌ ఖిల్జీ నాయకత్వంలో తురుష్క సేనలు దండెత్తి కొల్లగొట్టాయి. ఈ సంఘటన భారతదేశంలో బౌద్ధమత క్షీణతకు మైలురాయిగా భావిస్తారు. నలందను కొల్లగొట్టే ముందు ఖిల్జీ అక్కడ ఖురాన్‌ ప్రతి ఉందా అని వాకబు చేశాడని చెబుతారు. 1235లో టిబెట్‌ అనువాదకుడు ఛాగ్‌ లోట్స్‌వా నలందను సందర్శించినపుడు కొల్లగొట్టబడి జీర్ణవస్థలో ఉన్నప్పటికీ కొద్దిమంది బౌద్ధ భిక్షువులతో పనిచేస్తూ ఉన్నది. గణితం, ఖగోళశాస్త్రం, రసాయన శాస్త్రం, స్వరూపశాస్త్రం మొదలగు శాస్త్రాలలో ప్రాచీన భారతీయ విజ్ఞానం అకస్మాత్తుగా అంతరించిపోవడానికి నలంద విశ్వవిద్యాలయ నాశనం, ఉత్తర భారతదేశమంతటా ఇతర దేవాలయాలు, ఆశ్రమాల నాశనమే కారణమని అనేకమంది చరిత్రకారులు భావిస్తారు. దండయాత్రల ప్రధాన మార్గంలో ఉన్న ఇక్కడి సన్యాసాశ్రమాలన్నీ కూలగొట్టబడినవి. ప్రధాన మార్గంలో లేకపోవడం నలంద, బుద్ధగయ మిగిలాయని చెబుతారు. ప్రధాన మార్గంలో లేని, ఉత్తర బెంగాల్‌ లోని జగద్దలా ఆశ్రమం వంటి అనేక ఆశ్రమాలు ఏ మాత్రం హానిలేకుండా ఉండి వృద్ధి చెందినవి.

భారత విజ్ఞాన వినాశనం...
పర్షియన్‌ చరిత్రకారుడు మిన్నాజ్‌-ఈ-సిరాజ్‌ తన తబాకత్‌ - ఇ - నసిరీన్‌ అనే రచనలో నలంద విశ్వవిద్యాలయ నాశనాన్ని ఇలా వర్ణించాడు. ‘‘విశ్వవిద్యాలయంపై దాడి సందర్భంలో వేలాదిమంది బౌద్ధ సన్యాసులు, విద్యార్థులు సజీవదహనం చేయబడ్డారు. మరికొన్ని వేలమంది తలలు తెగ నరకబడ్డాయి. బ్రహ్మాండమైన గ్రంథాలయం తగలబెట్టబడింది. అది కొన్ని నెలలు పాటు తగలబడింది. తగలబడుతున్న పుస్తకాల నుండి చెలరేగిన పొగ ఆకాశంలో కొన్ని వారాల పాటు నల్లగా, చిక్కగా కమ్ముకుంది’’ అని వివరించాడు. సందంట్లో సడేమియా అన్నట్లుగా ఈ విశ్వవిద్యాలయం వినాశనంలో హిందూ మతోన్మాదులు కూడా ఒక చేయి వేశారు.

శర్మ స్వామి అనే టిబెట్‌ యాత్రికుడు భక్తియార్‌ ఖిల్‌జీ దాడి తర్వాత మూడు దశాబ్దాలకు నలంద విశ్వవిద్యాలయాన్ని సందర్శించి, అక్కడ జరిగిన దుర్మార్గాన్ని వర్ణించాడు. దీని ప్రకారం ఖిల్‌జీ దాడి అనంతరం నెలకొని ఉన్న అరాచక వాతావరణంలో కొందరు హిందూ సన్యాసులు ఒక యజ్ఞాన్ని ఆ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్వహించారు. తర్వాత యజ్ఞం తాలూకు నిప్పుల కట్టెలను వారు అన్నిచోట్లా విసిరేశారు. అవి మంటలను సృష్టించాయి. ఆ మంటల్లో అప్పటికీ మిగిలి ఉన్న రత్నబోధిలోని గ్రంథాలన్నీ తగలబడ్డాయి. ఆ తొమ్మిది అంతస్థుల భవనంలోని విజ్ఞాన భాండాగారం నాశనమైపోయింది. దీనితో నలంద విశ్వవిద్యాలయం, దానిలో విజ్ఞానశాస్త్ర భాండాగారం చరిత్రగర్భంలో కలిసిపోయాయి. ‘అహి’ అనే చరిత్రకారుని ప్రకారం, ‘‘నలంద విశ్వవిద్యాలయంలోని బోధనా ప్రదేశాలు, గ్రంథాలయాల వినాశనం, ఖగోళశాస్త్రం, లెక్కలు, రసాయనిక శాస్త్ర, వైద్యశాస్త్రంలో భారతీయ శాస్ర్తీయ ఆలోచనా విధానం యొక్క వినాశనానికి మూలమని అంగీకరించక తప్పదు.

అవశేషాలే.. నేటి పర్యాటక కేంద్రాలు...
జీర్ణావస్థలో ఉన్న కట్టడాలు.. ఆనాటి విజ్ఞానపు తాలూకు వాసనలు వెదజల్లుతూ.. ఇంకా మిగిలే ఉన్నాయి. దగ్గరలో ఒక హిందూ దేవాలయమైన సూర్య మందిరం ఉన్నది. పురాతత్వ శాఖ లెక్కల ప్రకారం.. అవశేషాలు 150,000 చదరపు మీటర్ల మేరకు విస్తరించి ఉన్నవి. హువాన్‌ త్సాంగ్‌ యొక్క వర్ణన ప్రకారం నలంద విస్తృతిని, ఇప్పటి వరకు త్రవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని పోల్చి అంచనా వేస్తే, ఇంకా 90% శాతం దాకా అవశేషాలు బయల్పడనట్టే. నలంద ఇప్పుడు నిర్వాసితము. ప్రస్తుతం ఇక్కడికి అతి చేరువలోని జనవాస ప్రదేశం బార్‌గాఁవ్‌ అనే గ్రామం. 1951లో నవ నలంద మహావిహార అనే ఒక ఆధునిక పాళీ, థెరవాడ బౌద్ధ అధ్యయన కేంద్రాన్ని ఇక్కడికి దగ్గరలో స్థాపించబడినది. ప్రస్తుతం, ఆ కేంద్రం ఈ పరిసర ప్రాంతాన్ని మొత్తం ఉపగ్రహం ద్వారా శాటిలైట్‌ ఇమేజింగ్‌ పద్ధతిలో అధ్యయనం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నది. నలంద మ్యూజియంలో అనేక వ్రాతపత్రులు, త్రవ్వకాలలో దొరికిన వస్తువులను ప్రదర్శనకు ఉంచారు.

పునరుద్ధరణ...
డిసెంబర్‌ 9, 2006న న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక 1 బిలయన్‌ డాలర్లు ఖర్చుచేసి ప్రాచీన విశ్వవిద్యాలయమున్న చోటను పునరుద్ధరించటానికి ఓ ప్రణాళికను వివరించింది. సింగపూర్‌ నేతృత్వంలో భారత్‌, జపాన్‌, ఇతర దేశాలతో కలసి ఒక కన్షార్షియంగా ఏర్పడి 500 మిలియన్‌ డాలర్లతో కొత్త విశ్వవిద్యాలయం నిర్మించటానికి, మరో 500 మిలియన్‌ డాలర్లు దానికి అవసరమయ్యే సదుపాలను అభివృద్ధి చేయటానికి నిధులు సేకరించడానికి ప్రయత్నిస్తున్నది.

Sunday, July 17, 2011

ఊరెళ్లే రైలు కాదు ... టూరెళ్లే రైలు!


ప్యాలెస్ ఆన్ వీల్స్
భారతదేశపు మొదటి లగ్జరీ రైలు ప్యాలెస్ ఆన్ వీల్స్. లగ్జరీ ట్రైన్లలో ప్రపంచంలోనే నాలుగో స్థానం ఆక్రమించిన ఈ రైలును 1982 జనవరి 26న ప్రారంభించారు. రాజస్థాన్ రాజ్‌పుత్‌లు, గుజరాత్ రాజులు, హైదరాబాద్ నిజాములు, బ్రిటిష్ ఇండియా వైస్రాయ్ వాడిన రైలు బోగీల థీమ్‌లతో చారిత్రక వైభవం ఉట్టిపడేలా ఇంటీరియర్‌ను తీర్చిదిద్దారు.

ఇది రాజస్థాన్ రాష్ట్ర పర్యాటక శాఖ- ఇండియన్ రైల్వే సంయుక్త ప్రాజెక్టు. ఈ రైల్లోని 14 బోగీలకు రాజస్థాన్‌లోని పద్నాలుగు సామ్రాజ్యాల పేర్లు పెట్టారు. ఆర్నెల్ల ముందుగా బుకింగ్‌‌స అయిపోయే ఈ రైలుకు విదేశీ పర్యాటకులెక్కువ. 1991లో ఏసీ ఏర్పాటుచేశారు. 2009లో మొత్తం రైలును సరికొత్తగా తీర్చిదిద్దారు.


చూపించే ప్రదేశాలు: ప్రతి బుధవారం ఢిల్లీ నుంచి ప్రయాణం మొదలవుతుంది. జైపూర్, జైసల్మేర్, జోధ్‌పూర్, ఉదయపూర్, చిత్తోర్‌ఘడ్, సవాయి మదోపూర్ (రణతంబోర్ కోట, నేషనల్‌పార్క్), భరత్‌పూర్, ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా.

ఖర్చు: ఎనిమిది రోజుల ఈ ప్యాకేజీ ధర రోజుకు, ఒకరికి 22,000. ఒక గదిని ఇద్దరు పంచుకుంటే 33 వేలు, ముగ్గురు గదిని పంచుకుంటే 45 వేలు ఛార్‌‌జ చేస్తారు. అక్టోబరు-మార్చి మధ్య ధరలు ఎక్కువ. మే, జూన్, జూలై నెలల్లో ఈ ట్రైన్ బంద్!

మహరాజా ఎక్స్‌ప్రెస్

2010లో ప్రయాణం ప్రారంభించిన ఈ రైలు లగ్జరీ ట్రైన్ సిరీస్‌లో తాజా ప్రాజెక్టు. ఇండియన్ రైల్వే, గ్లోబల్ ట్రావెల్ కంపెనీ కాక్స్ అండ్ కింగ్స్ సంయుక్తంగా నడుపుతున్నాయి. మూడు రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. మహారాజుల వైభవానికి ఆధునికతను మిక్స్ చేసి రూపకల్పన చేసిన రైలిది.

చూపించే ప్రదేశాలు:

ప్రిన్స్‌లీ ఇండియా: ప్రతి శనివారం ముంబయి నుంచి ప్రారంభం. వడోదర, ఉదయ్‌పూర్, జోధ్‌పూర్, బికనీర్, జైపూర్, రణతంబోర్, ఆగ్రా, ఢిల్లీ.

రాయల్ ఇండియా: పైనున్న ప్రాంతాలే. ఢిల్లీ నుంచి ప్రతి ఆదివారం టూరు ప్రారంభం.
క్లాసికల్ ఇండియా: ప్రతి ఆదివారం ఢిల్లీ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ఆగ్రా, గ్వాలియర్, ఖజురహో, బంద్‌వగ్రా, వారణాసి, లక్నో మీదుగా తిరిగి ఢిల్లీ చేరుకుంటుంది.

ఖర్చు: ప్రిన్స్‌లీ ఇండియా, క్లాసికల్ ఇండియా టూర్ ప్యాకేజీ మొత్తం రూ. 3 లక్షల 18 వేలు. రాయల్ ఇండియా ప్యాకేజీ 2 లక్షల 78 వేలు. ఇందులోని ప్రెసిడెన్షియల్ సూట్ ప్యాకేజీ 9 లక్షలు.


రాయల్ రాజస్థాన్
ప్యాలెస్ ఆన్ వీల్స్‌కు సమాంతర ప్రాజెక్టు. జనవరి 2009లో ప్రారంభం. రాజ్‌పుత్‌ల అంతఃపురంలో మాత్రమే కనిపించే ఇంటీరియర్‌ను ఏర్పాటుచేశారు.

చూపించే ప్రదేశాలు:
ప్రతి ఆదివారం ప్రయాణం మొదలై మరుసటి ఆదివారంతో ముగుస్తుంది. ఢిల్లీ-జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, చిత్తోర్‌ఘడ్, సవై మదోపూర్, జైపూర్, ఖజురహో, వారణాసి, ఆగ్రా-ఢిల్లీ.

ఖర్చు: ఇద్దరు కలిసి గది తీసుకుంటే ఒకరికి రోజుకు రూ.26,200. ఎక్స్‌ట్రార్డినరీ సూట్ రోజుకు రూ. 71,000.


డెక్కన్ ఒడిస్సీ
ఇది దక్షిణ భారతదేశంలో మొదటి లగ్జరీ రైలు. ప్రకృతి, చరిత్ర మేళవింపుతో మహారాష్ట్ర ప్రభుత్వం - రైల్వేశాఖ సంయుక్తంగా రూపకల్పన చేసిన ప్రాజెక్టు డెక్కన్ ఒడిస్సీ. దీనికి ఫైవ్ స్టార్ హోటల్ ఆన్ వీల్స్ అని కూడా పేరుంది.

చూపించే ప్రదేశాలు:
మే, జూన్, జూలై నెలల్లో నడవదు. మిగతా సమయాల్లో ఛత్రపతి శివాజీ టెర్మినస్ నుంచి ప్రతి బుధవారం ప్యాకేజీ ప్రారంభం. డిమాండ్‌ను బట్టి నడుస్తుంది. ముంబయి నుంచి బయలుదేరి.. సింధుదుర్గ్, గోవా, కొల్హాపూర్, దౌలతాబాద్, చంద్రపూర్, అజంతా గుహలు, నాసిక్‌లను చుట్టేసుకుని మళ్లీ బుధవారం ముంబయికి చేరుకుంటుంది.

ఖర్చు: ఇద్దరు ఒకే బోగీ తీసుకుంటే ఒకరికి రోజుకు రూ. 17,400. ఇది డీలక్స్ క్యాబిన్ ధర. ఇక ప్రెసిడెన్షియల్ సూట్ ఇద్దరు పంచుకుంటే ఒకరికి రోజుకు రూ. 29000. పీక్ సీజన్లో (అక్టోబరు- మార్చి) ధరలు మరింత ఎక్కువ.


ద గోల్డెన్ చారియట్
గోల్డెన్ చారియట్ కర్ణాటక, గోవాల్లో అందాలను తిలకించడానికి రూపొందించిన ప్యాకేజీ. పూర్తి అత్యాధునిక రైలు. 2008 మార్చిలో ఇది ప్రారంభమైంది. నిర్వహణ ఇండియన్ రైల్వే అండ్ కర్ణాటక టూరిజమ్. రెండురకాల ప్యాకేజీలను నిర్వహిస్తుంది.

చూపించే ప్రదేశాలు:
ప్రతి సోమవారం టూర్లు ప్రారంభం. ‘ప్రైడ్ ఆఫ్ సౌత్’ ప్యాకేజీలో బెంగలూరు నుంచి మొదలై కబిని, బందీపూర్, మైసూర్, హసన్, హోస్పేట్, బాదామి, గోవాల మీదుగా- మళ్లీ బెంగలూరు చేరుతుంది.
‘స్ల్పెండర్ ఆఫ్ సౌత్’ ప్యాకేజీలో తమిళనాడు, కేరళ స్పెషల్. బెంగలూరు నుంచి చెన్నై, మామళ్లపురం, పాండిచ్చేరి, తిరుచిరాపల్లి, తంజావూరు, మధురై, తిరువనంతపురం, పూవార్, కోచి (బ్యాక్‌వాటర్స్) చూపించి మళ్లీ బెంగలూరుకు తీసుకువస్తుంది.
ఖర్చు: ఒక గదిని ఇద్దరు పంచుకుంటే ఒకరికి రోజుకు రూ.18,000 పడుతుంది. ప్రస్తుతం ఇండియాలో నడుస్తున్న లగ్జరీ ట్రైన్లలో ఇదే కాస్త తక్కువ ఖరీదు.

ఇంకా ఇవి కూడా...

వీటికి భిన్నమైన కొన్ని ప్రత్యేక పర్యాటక రైళ్లను భారతీయ రైల్వే నిర్వహిస్తోంది. 


ఫెయిరీ క్వీన్: 1855లో ఇంగ్లండ్‌లో తయారుచేసిన ఈ రైలు ప్రపంచంలోనే వాడుకలో ఉన్న అత్యంత పురాతన స్టీమ్ లోకోమోటివ్. 1909లో రిటైరైన దీన్ని బాగు చేసి 1997 జూలైలో మళ్లీ పట్టాలపైకి తెచ్చారు. ఇది ఢిల్లీ-ఆల్వార్-సరిస్కా (పులుల కేంద్రం)- ఢిల్లీ ప్యాకేజీ నిర్వహిస్తుంది. రెండ్రోజుల ఈ మొత్తం ప్యాకేజీ ఒకరికి రూ. 10,500 .

బుద్ధిస్ట్ ట్రైన్:
ఇది ఎనిమిది రోజుల ప్యాకేజీ టూరు. గౌతమబుద్ధుడికి సంబంధించిన పవిత్ర స్థలాల్లో మాత్రమే పర్యటిస్తుంది. బుద్ధుడు పుట్టిన లుంబిని ప్రాంతం, ఆయన జ్ఞానోదయం పొందిన బుద్ధగయ, మొదట శిష్యులకు బోధించిన సార్‌నాథ్, నిర్యాణం పొందిన కుశినగర్‌తో పాటు ఇతర బౌద్ధస్థూపాలను సందర్శించాలనుకునే వారికి ఇంతకంటే మరో మంచి ఎంపిక లేదు. మొత్తం ఎనిమిది రోజులూ పర్యటించాల్సిన అవసరం లేదు. కావల్సినంత వరకే ప్రయాణించవచ్చు. మామూలు ఏసీ ట్రైన్ల ఖరీదులో ప్యాకేజీలు ఉంటాయి.

రైల్వే టూరిజం ప్యాకేజీలను భారతీయ రైల్వే నిర్వహించే www.irctc.co.in ద్వారా బుక్ చేసుకోవచ్చు. అన్ని లగ్జరీ ట్రైన్లకు వాటిపేరు మీదనే ఆన్‌లైన్ బుకింగ్ వెబ్‌సైట్స్ ఉన్నాయి. అన్ని ప్యాకేజీలు ఆన్‌లైన్ ద్వారా బుక్/క్యాన్సిల్ చేసుకోవచ్చు. ‘ఆలస్యం అమృతం విషం’ అని తెలియదా మీకు!


లగ్జరీ ట్రైన్ల సదుపాయాలు

దాదాపు అన్నింటిలో 14 బోగీలుంటాయి. ప్రతిగదికి ప్రత్యేక ఏసీతో ఫైవ్ స్టార్ సదుపాయాలతో బెడ్‌రూమ్ ఉంటుంది. ఇక ప్రతి ట్రైన్‌లో ఒక బార్, రెండు రెస్టారెంట్లు, లైబ్రరీ, షాపింగ్, విశ్రాంతి గది, ఆయుర్వేద స్పా, జిమ్, అవుట్‌గోయింగ్ పోస్ట్, ఫోను, ఇంటర్‌కమ్, ఎల్‌సీడీ టీవీలు, డీవీడీ, ఇంటర్నెట్, ల్యాప్‌టాప్ (అద్దెకు) ఉంటాయి. ప్రతి గదికి బాత్/టాయ్‌లెట్ రూమ్ ఉంటాయి. 24 గంటలూ వేడి/చల్లటి నీరు. హెయిర్ డ్రయ్యర్‌తో సహా ప్రతిదీ అందుబాటులో ఉంటుంది. ప్రతి గదికి అటెండర్‌‌స ఉంటారు. 

- ప్రకాష్ చిమ్మల

Wednesday, July 13, 2011

తనివితీరని అందాల గని... తవాంగ్‌

భారతదేశంలో సూర్యుడు మొదటసారిగా ఉదయించే ప్రాంతమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లో హిమాచల్‌ పర్వతాలపై ఉంది తవాంగ్‌. అరుణాచల్‌ ప్రదేశ్‌లో బౌద్ధులు అధికం. దీంతో ఈ ప్రాంతంలో అతి ప్రాచీన బౌద్ధ ఆశ్రమాలకు ఆలవాలంగా వెలుగొందుతోంది.

Tawang 

తవాంగ్‌ హిమాలయ పర్వతాలపై దాదాపు 12వేల ఆడుగుల ఎత్తున ఉంది. తవాంగ్‌ అంటే ఎంచుకున్న గుర్రం. తవాంగ్‌లో టిబెటన్ల సంఖ్య ఎక్కువ. టిబెటన్లు ఎప్పుడూ ఇక్కడ ప్రార్ధనలు చేస్తూ బౌద్ధమత ఆరాధనలో నిమగ్నులవుతారు.

తవాంగ్‌ యుద్ధ స్మారకం...
భారత-చైనాల మధ్య 1962లో జరిగిన యుద్ధంలో చైనా సైనికులను ఒంటరిగా పోరాడిన భారతీయ సైనికుడి వీరమరణం పొందిన చోట స్మారకాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ స్మారకం సీలా పాస్‌లోని జశ్వంత్‌ఘర్‌లో ఉంది.


photo

War Memorial; Tawang

Tawang is in the western part of Arunachal Pradesh, India. With an average altitude of 10,000 feet, this town is 340 km from Tezpur, a picturesque city of Assam, India. Famous for its Buddhist monastery & pristine beauty, Tawang is a tourist's paradise. With more than 100 lakes, almost all of which becomes frozen in winter, and beautiful peace-loving people (mostly of Monpa tribe) with their exotic costume & customs, Tawang is a life-time experience.
The war Memorial at Tawang was erected in the memory of more than 2000 Indian soldiers who laid their lives in defending Tawang in the Sino-Indian war of 1962.

తవాంగ్‌ ఆశ్రమం...
బౌద్ధమతంలో మహాయాన వర్గం వారు ఇక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటుచేసుకున్నారు. లాసా తర్వాత అతి ప్రాచీన ఆశ్రమం తవాంగ్‌లో మాత్రమే ఉంది. తవాంగ్‌ ఆశ్రమాన్ని మెరాగ్‌ లామా లోడ్రీ గిమాస్ట్సో నిర్మించారు. ఈ ఆశ్రమం 1681లో నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఆశ్రమం పక్కనే బౌద్ధ సన్యాసులు నివసించేందుకు వీలుగా వసతి గృహాలు ఏర్పాటుచేశారు. తవాంగ్‌ ఆశ్రమంలో ప్రాచీన గ్రంధాలయంతో పాటుగా వస్తు ప్రదర్శనశాల కూడా ఉంది. దాదాపు 500 మంది బౌద్ధ సన్యాసులకు వసతి కల్పించేది తవాంగ్‌ ఆశ్రమం. రాత్రిపూట తవాంగ్‌ ఆశ్రమాన్ని విద్యుదీప కాంతులతో చూస్తే చాలా అందంగా ఉంటుంది. ఆశ్రమంలో లోపల 8 మీటర్లు ఎత్తైన బౌద్ధ విగ్రహం ఉంది. లాసాలోని పోతలా ఆశ్రమం తర్వాత అతిపెద్దది తవాంగ్‌ ఆశ్రమం.
http://farm1.static.flickr.com/232/501887126_ba41fdb8b8.jpg
ఉర్గెలింగ్‌ ఆశ్రమం...
ఆరవ దలైలామా ఉర్గెలింగ్‌ ఆశ్రమంలో పుట్టాడని బౌద్ధులు భావిస్తారు. ఈ ఆశ్రమం 14వ శతాబ్దం నుంచి ఉందని బౌద్ధులు అంటుంటారు. తవాంగ్‌ పట్టణం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉర్గెలింగ్‌ ఆశ్రమం ఉంది.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjaSqHp6qj9xW4_aB_mokbk_-VfAu0VDKBLWD0MxY66N7h78kgkUpxXgOOjhtfZhgHy-4XJCLwqO-4GXPKbK2eMnqrFaySMkbZ42K-1BFZRcW-P_FEhNFEqbB_nHbMktfZRUKHnD_etlCIW/s1600/monastry.jpg
తవాంగ్‌ స్వర్ణ బౌద్ధ స్థూపం...
చైనా సరిహద్దు వద్ద ఉన్నది తవాంగ్‌ స్వర్ణ బౌద్ధ స్థూపం. దీనినే తవాంగ్‌ బౌద్ధ మఠం అని కూడా పిలుస్తారు. తవాంగ్‌ను అధికారికంగా భారత్‌ తమ భూభాగంలోకి గతంలో కలుపుకున్నప్పటికీ 2007లో అది తమదే నంటూ చైనా వివాదాన్ని లేవదీసింది. ఇక్కడే 6వ దలైలామా జన్మించాడన్న కారణంతో అది మాదే అని చైనా అంటోంది. ప్రస్తుత దలైలామా మనగడ్డపై ప్రవాస జీవితం గడుపుతున్నాడన్న విషయాన్ని చైనా మరుస్తోంది.
http://farm4.static.flickr.com/3425/3230411364_d069dd486b.jpg
బ్రిటీష్‌వారు పోతూపోతూ భారత్‌-చైనాలు విభజించటానికి మెక్‌మోహన్‌ రేఖను సరిహద్దుగా మార్చారు.దానితో తవాంగ్‌ మఠము మనకు దక్కింది. అయినప్పటికీ అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఎక్కువ ప్రాంతాలు తమదేనంటూ చైనా వాదిస్తోంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఈశాన్య సరిహద్దు ఏజెన్సీగా పిలిచేవారు.ఇప్పటిదాకా ఉన్న రికార్డు ప్రకారం తవాంగ్‌ 1951 వరకూ టిబెట్‌ ప్రభుత్వ హయాంలో ఉండేది.స్థానిక అరుణాచల వాసుల వాదన ఏమిటంటే భారత్‌తో ఉండాలన్నది తమ Brahmaputra from Tezpurనిర్ణయం అంటారు. వారు హిందీ పాటలు, వినడం, మాట్లాడటం లేదా అర్థం చేసుకోవడం తెలుసు. అసోం భాషను తాము కనుగొన్నామని అంటారు. బాహ్య ప్రపంచంతో ఈశాన్యంలోని అసోంతో సంబంధం పెట్టుకున్నప్పుడు ఈ భాష ఏర్పడిందంటారు.

తవాంగ్‌ మఠం సముద్రమట్టానికి 3500 మీటర్లు ఎగువన 400 సంవత్సరాలు క్రితం ఏర్పడింది. దలైలామాకు చెందిన మహాయాన బౌద్ధంలోని గాలుపా వర్గానికి చెందిన అనుబంధం తవాంగ్‌. ఇందులో 700 మంది సన్యాసులు నివశించవచ్చు. ఈ మఠంలో బుద్ధుని అవశేషాలు కూడా ఉన్నాయని ప్రతీతి.
మఠానికి అనుబంధంగా వస్తు ప్రదర్శనశాల కూడా ఉంది. ఇందులో ప్రాచీన తాళపత్ర గ్రంధాలు మరియు విలువైన పురాతన వస్తువులు వంటివి ఉన్నాయి. దలైలామా నేతృత్వంలో 1997లో పూర్తిగా దీనిని ఆధునీకరించారు. ఇక్కడి స్థానిక ప్రజలు మోన్పాస్‌ అంటారు. వీరు రాళ్లతో కట్టిన గృహాల్లో నివశిస్తూ వ్యవసాయం చేసుకుంటారు. టిబెట్‌ తరహా నేత పనులు వీరు చేస్తుంటారు.


తవాంగ్‌కు ప్రయాణించే మార్గంలో తేజ్‌పూర్‌ వస్తుంది. ఇది అసోంలో చాలా చిన్న పట్టణం. అరుణాచల్‌లోని మరో బౌద్ద మఠం బొమిడిలాకు వెళ్లే మార్గంలో ఉంది తేజ్‌పూర్‌. బహ్మపుత్రా నది ఎడమ గట్టున ఉంది తేజ్‌పూర్‌. తేజ్‌పూర్‌ గురించి చెప్పాలంటే 1962 నాటి చరిత్రలోకి వెళ్లాలి. చైనా పరిభాషలో దీనిని హిమాలయ తప్పు సంవత్సరం అంటారు. చైనా సైనికులు భారత సరిహద్దును దాటి కాల్పులు జరిపారు. ఈ సమయంలో తేజ్‌పూర్‌లో ఉన్న భారత ఆర్మీ తిప్పికొట్టింది.

ఎలా చేరుకోవాలి...
విమాన మార్గం: తేజ్‌పూర్‌ విమానాశ్రయం (320 కి.మీ)
రైలు మార్గం: రంగపార సమీపంలో రైల్వే స్టేషన్‌. ఈ మార్గంలో మీటర్‌ గేజి రైళ్లు రంగియా నుంచి నడుస్తాయి. రంగియా-గౌహతిల మధ్య దూరం 60 కిలోమీటర్లు.
రహదారి మార్గం: తేజ్‌పూర్‌ (320 కి.మీ.), బొమిడిలా (185 కి.మీ.), దిరాంగ్‌ (143 కి.మీ.). తేజ్‌పూర్‌ నుంచి తవాంగ్‌కు చేరుకోవటానికి 13 గంటల సమయం పడుతుంది. మార్గమధ్యంలో రాత్రిపూట బొమిడిలా లేదా దిరాంగ్‌లలో బస చేయాల్సి ఉంటుంది. తవాంగ్‌కు వెళ్లే మార్గంలో 14వేల అడుగుల ఎత్తున ఉన్న సీలా పాస్‌ అందాలను తనివితీరా చూడవచ్చు. 

జలపాతాల నిలయం... కుట్రాలం

ప్రకృతి సిద్ధంగా ఏర్పడి పైనుంచి జాలువారే జలపాతంలో తడుస్తూ స్నానం చేయడమంటే ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి లేదు. పైనుంచి పడే నీటిధారలో నిలబడి స్నానం చేస్తే ఆనందంతో పాటు మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుందనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే పర్యాటకులు జలపాతాలను సందర్శించడానికి ఎక్కువ మక్కువ చూపుతుంటారు. అయితే.. అలాంటివి ఓ ఏడు జలపాతాలు ఒకే చోట దర్శనమిస్తే.. ఇక పర్యాటకులకు పండగే మరి. అలాంటి ప్రదేశమే కుట్రాలం. తమిళనాడులో ఉన్న ఈ ప్రాంతంలో ఒకే చోట ఏకంగా ఏడు జలపాతాలు పర్యాటకులను మంత్రముగ్ధుతను చేస్తున్నాయి. మరి ఆ జలపాతాల్లో జలకాలాటకు సిద్ధమేనా? అయితే పదండి...


new_farms
వారాంతాల్లోనూ, సెలవురోజుల్లోనూ జలపాతాలున్న ప్రదేశాలను సందర్శించడానికి పర్యాటకులు ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. ఇంతగా పర్యాటకులకు ఇష్టమైన జలపాతాలతో పాటు ఆద్యాత్మికత కూడా కలగలిసిన ప్రదేశం ఉంటే అక్కడ పర్యాటకుల సందడి ఏ మేరకు ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలా ఆద్యాత్మికాన్ని, ప్రకృతిసిద్ధ జలపాతాలను తనలో ఇముడ్చుకున్న అద్భుతమైన ప్రదేశమే కుట్రాలం. తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ పట్టణమైన తిరునల్వేలికి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఈ కుట్రాలం ప్రాతం కొలువై ఉంది. ఏడాది పొడువునా ఈ కుట్రాలాన్ని పర్యాటకులు సందర్శిస్తూనే ఉండడం విశేషం.

కుట్రాలం ప్రత్యేకతలు...

కుట్రాలం పేరు చెప్పగానే జలపాతాల హోరుతో పాటు అక్కడ వెలసిన కుట్రాల నాదర్‌ స్వామి ఆలయం అందరికీ గుర్తుకు వస్తుంది. నటరాజు అవతారం కూడా అయిన ఆ పరమేశ్వరుడు కుర్తాల నాదర్‌గా ఇక్కడ వెలిశారని పురాణాలు పేర్కొంటున్నాయి. కుర్తాలంలోని శివలింగాన్ని పురాణకాలంలో అగస్త్య మహర్షి స్వయంగా ప్రతిష్టించారని పురాణాలు చెబుతున్నాయి. కుర్తాలంలోని ఆలయాన్ని తమిళ రాజ్యాధిపతులైన చోళ, పాండ్య రాజులు అభివృద్ధి చేసినట్టు ఇక్కడి శిలాశాసనాలు చెబుతున్నాయి. అత్యంత రమణీయంగా నిర్మించబడ్డ ఈ ఆలయంలోని శిల్పసంపద చూపరులను ఇట్టే కట్టిపడేస్తుంది. కుర్తాలంలోని కుర్తాల నాదర్‌గా వెలసిన పరమేశ్వరుడితో పాటు కొలువైన అమ్మవారిని వేణువాగ్వాదినీ దేవి అని పిలుస్తారు. ఈమెతో పాటు పరాశక్తి కూడా ఇక్కడ కొలువై ఉంది. ఇక్కడ కొలువైన పరాశక్తి అమ్మవారి పీఠం 51 ధరణీ పీఠాల్లో ఒకటిగా విలసిల్లుతోంది. ఈ ఆలయంలో శివుడు లింగాకారంలో వెలసినా ప్రధాన పూజలు మాత్రం నటరాజ స్వరూపానికే జరగడం ఓ విశేషం.

జలపాతాల నెలవు...

Tenkashi_Kutralam
కుట్రాలంలో కుట్రాల నాదర్‌ స్వామి తర్వాత మనల్ని మరింత పులకరింపజేసేది ఇక్కడ ఉన్న జలపాతాలు. పశ్చిమ కనుమల్లోని తిరుకూడమ్‌ ప్రాంతంలో పుట్టిన చిత్తరువి అనే నది కొండ కోనల్లో ప్రవహిస్తూ తన ప్రధాన నది అయిన శివలప్పెరి అనే నదిలో కలిసేముందు కుట్రాలంలోని వివిధ ప్రదేశాల్లో ఏడు జలపాతాలుగా ప్రవహిస్తుంది. అత్యంత అద్భుతంగా కానవచ్చే ఈ ఏడు జలపాతాల్లో కొన్ని అత్యంత ప్రమాద ప్రదేశాల్లో జాలువారే కారణంగా కొన్నిచోట్ల మాత్రమే పర్యాటకులు జలపాతాల్లో స్నానం చేయడానికి అనుమతిస్తారు. కుట్రాలంలోని జలపాతాల్లో తనివితీరా స్నానం చేసేందుకు ఏడాది పొడవునా పర్యాటకుల తాకిడి ఉంటూనే ఉంటుంది.
http://www.bloggersbase.com/images/uploaded/original/6941031133fcb0d04bd1bd891ba0a1e9294e193a.jpeg
కుట్రాలం ప్రాతంలో జాలువారే ఏడు జలపాతాల్లో ప్రధానమైంది కుట్రాల నాదన్‌ ఆలయానికి సమీపంలోనే ఉంది. దాదాపు 60 మీటర్ల ఎత్తు నుంచి జాలువారే ఈ జలపాతాన్ని పర్యాటకులు చూడడానికి మాత్రమే అనుమతి ఉంది. కుట్రాలంలోని జలపాతాల్లో సిత్తరవి అనే జలపాతం పర్యాటకులు స్నానం చేయడానికి అనువుగా ఉంటుంది. ఇక్కడ పర్యాటకులు నిరభ్యంతరంగా స్నానం చేయవచ్చు. కుట్రాలంలోని మరో జలపాతానికి ఓ ప్రత్యేకత ఉంది. పెద్దదైన ఈ జలపాతం ఐదు పాయలుగా క్రిందికి జాలువారుతుంటుంది. అందుకే దీనిని ఐదు జలపాతాలు అనే పేరుతో పిలుస్తుంటారు. ఈ జలపాతం వద్ద కూడా పర్యాటకులు స్నానం చేయడానికి అనుమతి ఉంది.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj36uvk32GDu6KIAEeb-YOfNXEuhyphenhyphenCS8ooMff-xkPwJ-pN0x7goVPJ6JHjbeXhnUHEh_Yyr678ewuWHsAaFZ-GaWUGVZdH8WLcYfzovuihUb7GvlO7U4zREBL0cD7qkMAyEWR35f8ZuyW_-/s320/kutrallam-falls.jpg
‘సౌత్‌ స్పా’ సౌందర్యం కుట్రాలం జలపాతం...
ఎన్నిసార్లు చూసినా తనివితీరని అందం కుట్రాలం జలపాతం సొంతం. కనువిందు చేసే ప్రృతి, ఎత్తయిన కొండల పైనుంచి దుమికే జలపాతాలు, సెలయేటి గలగలలు, ఆహ్లాదపరిచే పచ్చదనంతో ఈ ప్రాంతం ఓ అద్భుతమైన ప్రపంచంలా అనిపిస్తుంది. ఇక వర్షాకాలంలో అయితే కుట్రాలం భూలోక స్వర్గంగా మారుతుందనటంలో అతిశయోక్తి లేదు. సందర్శకుల తాకిడి, వారి హర్షాతిరేకాలతో కుట్రాలం మార్మోగుతూ ఉంటుంది. దక్షిణ స్పాగా వ్యవహరించే ఈ కుట్రాలంలోని జలపాతాలు చాలా ప్రఖ్యాతిగాంచాయి.


Nataraja
ఇక్కడ పలు జలపాతాలు ఉన్నా... వాటిలో మెయిన్‌ శ్హఫాల్స్‌ ప్రధానమైంది. దీనినే స్థానికులు పెరియ అరువి (అరువి అంటే తమిళంలో జలపాతం అని అర్థం) అని పిలుస్తుంటారు. ఈ పెరియ అరువియే కుట్రాలం జలపాతంగా పేరుగాంచింది. దీనికి సమీపంలో షన్బగదేవి, చిట్టరువి, తేనరువి, ఐందరువి, పులి అరువి, పళతోట్ట అరువి, పాత కుట్రాలం, బాలరువి... తదితర జలపాతాలున్నాయి. అయితే వీటన్నింటికంటే కుట్రాలం జలపాతంలో వర్షాకాలంలో సందర్శకుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది.

టైగర్‌ ఫాల్స్‌.. గాండ్రింపు..

కుట్రాలంలోని మరో జలపాతమైన టైగర్‌ ఫాల్స్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ జలపాతం పైనుంచి జాలువారుతుంటే దాని శబ్ధం పులి గాండ్రింపులా ఉంటుంది. అందుకే ఈ జలపాతానికి టైగర్‌ ఫాల్స్‌ అనే పేరువచ్చింది. ఈ జలపాతంలో సైతం పర్యాటకులు స్నానం చేయవచ్చు. ఇవేకాకుండా కుట్రాలంలో ఇతర జలపాతాలు కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.

నటరాజు నర్తించిన నేల...

నటరాజస్వామి నర్తించిన ఐదు సభల్లో ఒకటైన చిత్రసభ కూడా కుట్రాలం వద్దనే కలదు. అలాగే ఈ ప్రాంతంలోని షన్బగదేవి ఆలయంలో ప్రతి చైత్ర పౌర్ణమికి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. వీటిని చూసేందుకే పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. తేనరువి వద్ద తేనెపట్టులు అధికంగా ఉండటంతో దానికా పేరు వచ్చినట్లు చెబుతుంటారు. ఇది ప్రమాదకరమైనది కావటంతో ఆ ప్రాంతంలోకి సందర్శకులను అనుమతించరు.


Melaittirumanancheri
ఇక ప్రతి సంవత్సరం జూన్‌ నుంచి ఆగస్టు నెల వరకూ కుట్రాలం సీజన్‌ ఉంటుంది. ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే రావడంతో తొలి అర్ధభాగంలోనే కుట్రాలం సీజన్‌ ప్రారంభమయ్యింది. మహిళలు కుట్రాలంలో స్నానం చేసేందుకు వీలుగా ప్రత్యేక వసతులను కల్పించారు. జలపాతాల వద్ద తైల మర్దనం కూడా చేస్తారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు స్థానిక అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవటం వల్ల ప్రశాంతంగా ఇక్కడ సందర్శించవచ్చు. అయితే జలపాతం ఉధృతి పెరిగే సమయాల్లో మాత్రం కుట్రాలం జలపాతాల్లో స్నానాలకు సందర్శకులను అనుమతించరు.

దక్షిణ కాశీ.. తెన్‌కాశి...

కుట్రాలం ప్రాంతంలో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయాలు కూడా ఉన్నాయి. దక్షిణ కాశీగా పిలవబడే ఈ కుట్రాలంలో తెన్‌కాశి పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో కుట్రాలనాథుడుగా కొలువైన శివుడు... కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా భక్తులచే నిత్యపూజలు అందుకుంటున్నాడు.అలాగే కుట్రాలంలోని షన్బగదేవి ఆలయంలో ప్రతి చైత్ర పౌర్ణమికి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. వీటిని చూసేందుకే పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. ఈ ఆలయం సమీపంలోని సిద్ధుల గుహ కూడా ప్రసిద్ధి చెందినదే. నటరాజస్వామి నర్తించిన ఐదు సభల్లో ఒకటైన చిత్రసభ కూడా కుట్రాలం వద్దనే ఉంది. చిట్టూరు, మణి ముత్తారు, పచ్చయారు, తామపర్ణి నదుల జన్మస్థలం కూడా కుట్రాలమే..!


ఎలా వెళ్లాలంటే...
కుట్రాలం, తమిళనాడులోని చెన్నై నగరానికి 620 కిలోమీటర్ల దూరంలోనూ, కన్యాకుమారికి 137 కిలోమీటర్ల దూరంలోనూ, తిరునల్వేలికి 40 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. కుట్రాలానికి ఆరు కిలోమీటర్ల దూరంలో తెన్‌కాశి రైల్వే స్టేషన్‌ ఉంటుంది. అలాగే.. తిరుచ్చి, మధురై, రాజపాళయం, కోవిల్‌పట్టి తదితర ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం కూడా కలదు. కుట్రాలంలో సందర్శకుల సౌకర్యార్థం పలు విడిది గృహాలు కూడా అందుబాటులో ఉంటాయి.

Tuesday, July 5, 2011

భారతీయ శిల్పకళాకాణాచి ఖజురహో

అవి కొండలే కావచ్చు... కాని మనసుల్ని దోచే అరు దైన కళాఖండాలు ఆ కొండల మాటున దాగి ఉన్నాయి. అవి రాళ్లే కావచ్చు... కాని జవ్వనులైన జవరాళ్లలా నాట్యం చేస్తాయి. ప్రపంచానికి భారతదేశం అందించిన వరాలీ శిల్పాలు. నిజజీవితంలోని విభిన్న కోణాల్ని ఇక్కడి శిలలు అణువణువునా ఆవిష్కరిస్తున్నాయి. ఛందేలా రాజపుత్రుల కృషికి ఇవి దర్పణాలుగా నిలుస్తాయి.

Khajuraho-Templeఖజురహో దేవాలయాల నిర్మాణానికి దాదాపు వందేళ్లు పట్టింది. ్రశ 950-1050 మధ్య కాలంలో ఛందేలా రాజపుత్ర రాజులు ఈ గుహాలయాల నిర్మాణాన్ని చేపట్టారు. కళాత్మక నైపుణ్యానికి, వైభవానికి ఈ గుహాలయాలు దర్పణాలు. మొత్తం 85 దేవాలయాల్లో ఇప్పటికే నిలిచి ఉన్నవి కేవలం 22 మాత్రమే. ఖజురహో చుట్టూ 8 ద్వారాలతో కూడిన కుడ్యం ఉన్నది. ప్రతి ద్వారం రెండు బంగారు కొబ్బరి కాండముల మధ్య ఉన్నది. సుమారు 8 చదరపు మైళ్ళ అంటే 21 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం లో 80 కి పైగా హిందూ దేవాలయాలు పరుచుకొని ఉన్నాయి.

ఉత్తర భారతంలో ఇతర సాంస్కృతిక స్థానాల వలె ఖజురాహో దేవాలయాలు క్రీశ 1100-1400 ల మధ్య ముస్లిం చొరబాటు దారుల చేత నేలమట్టం కాలేదు. చాలా కాలం నిర్లక్ష్యం తరువాత 19 వ శతాబ్దం లో బ్రిటీష్‌ వారు వీటిలో కొన్నింటిని కనిపెట్టారు. తవ్వకాలు మొదలు పెట్టారు. జులై-మార్చి మధ్య కాలం ఖజురహో సందర్శించడానికి అనువైన సమయం. ఈ పురాతన ఖజురహో దేవాలయాలు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపబడినాయి. ఇక్కడ నిర్మించిన దేవాలయాలు, హిందూ మరియు జైన దేవాలయాల సమూహం. దీనికి ఆ పేరు హిందీ భాష నుండి మూలంగా వచ్చినది. హిందీలో ఖజూర్‌ అనగా ఖర్జూరము.

శృంగార జగత్తు ఖజురహో...
Khajurahoభారతీయ సంసృతిలోని శృంగార తత్వాన్ని చాటి చెప్పే ఖజురహో మధ్యప్రదేశ్‌లో ఉంది. శృంగార రసాధిదేవతల చిత్రాలున్న ఖజురహో శిల్పకళా సౌందర్యాన్ని చూడాలంటే రెండు కళ్ళూ చాలవు. సుమారు వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన ఈ విశిష్ట ఆలయాలు... ఎన్నో ప్రకృతి బీభత్సాలకు గురయ్యాయి. ఎందరో దురాశాపరుల దాడులతో పాడైపోగా మిగిలిన ఆలయాల్లో జీవం ఉట్టిపడే శిల్పకళా సంపద ఈనాటికీ సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. వెయ్యేళ్ల కిత్రం చందేలా రాజవంశీయుల పరిపాలనలో రాజధానిగా వెలుగొందిన ఖజురహో గ్రామం... ఆ రాజుల పరిపాలన అంతమవడంతో అక్కడి అద్భుత శిల్ప సంపద కూడా మరుగున పడిపోయింది.

కాలక్రమంలో ఈ గ్రామం చుట్టూ చెట్లు పెరిగిపోయి ఒక అడివిలా మారిపోయింది. 1839 లో మళ్లీ ఖజురహో వెలుగు చూసింది. ఆనాడు చందేలా రాజులు మొత్తం 80 దేవాలయాలు నిర్మించగా నేడు 22 దేవాలయాలు మాత్రమే కన్పిస్తున్నాయి. ఈ ఆయలయాల మీద ఉన్న శిల్పాలు అపురూపమైనవే కాదు శృంగారాన్ని ఉద్దీపింపజేసేవిగా ఉంటాయి. వెయ్యేళ్లపాటు ఇంతటి కళా ప్రాశస్త్యాన్ని తనలో దాచుకున్న ఖజురహోను మరింతగా ప్రాచుర్యంలోకి తేవడానికి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇందుకోసం ఈ చిన్నగ్రామంలో విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేయడం విశేషం.

ఆలయాలకు ఆలవాలం...
Khajuraho1ఆదినాధ దేవాలయం: జైన తీర్ధాందకరుడు. ఆది నాధుడికి అంకితమైన ఆలయం ఇది.
ఘంటాయ్‌ గుడి: ఇది కూడా జైన దేవాలయం. ఇందులో వర్ధమాన మహావీరుడి తల్లి యొక్క 16 స్వప్నాల్ని ఆవిష్కరించే చిహ్నాలు ఉన్నాయి. గరుడ పక్షిపై ఉన్న జైన దేవత చిహ్నం కూడా ఇక్కడ ఉంది.
పార్శ్వనాధ దేవాలయం: ఇక్కడ ఉన్న జైన దేవాలయాల్లో కెల్లా అతిపెద్ద దేవాలయం ఇది. ఉత్తరం దిక్కున ఉన్న కుడ్యాలపై చిత్రాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. నిజజీవితంలోని రోజువారీ కార్యక్రమాల్ని ఇవి ప్రతిబింబిస్తాయి. మొదటి తీర్ధాంకరుడైన ఆదినాధుడి వృషభానికి ఎదురుగా ఉన్న సింహాసనం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. 1860లో ఇక్కడ పార్శ్వనాధుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

చతుర్భుజ దేవాలయం: విష్ణుమూర్తిని గర్భగృహంలో కలిగిన దేవాలయమిది.
దూల్‌దాహ దేవాలయం: ఇది శివాలయం. అప్సర, కిన్నెర కింపురుషాదుల కూడ్య చిత్రాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

మాతానాగేశ్వర దేవాలయం: ఇది శివాలయం ఎనిమిది అడుగుల ఎత్తున్న లింగం ఇక్కడ ప్రసిద్ధి.
లక్ష్మణ దేవాలయం: ఇది వైష్ణవాలయం. ఇక్కడ త్రిమ్తూరులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాలు ఉన్నాయి. విష్ణుమూర్తి అర్ధాంగి లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉంది. విష్ణుమూర్తి అవతారాలైన నరసింహావతారం, వరాహావతరాలతో కూడిన విగ్రహం ప్రసిద్ధి చెందింది. ఇలాంటి వరాహావతారం - వరాహ దేవాలయంలో కూడా - తొమ్మిది అడుగుల ఎత్తుతో అలరారుతోంది.
విశ్వనాథ దేవాలయం: మూడు తలల బ్రహ్మ విగ్రహం ఇక్కడ ఉంది.
చిత్రగుప్త దేవాలయం: ఇది సూర్య దేవాలయం. ఉదయించే సూర్యుడిని దర్శిస్తూ తూర్పు ముఖాన ఈ దేవాలయం ఉంది.

చౌంసత్‌ యోగిని దేవాలయం: ఖజురహోలోని గ్రానైట్‌తో తయారైన ఏకైక దేవాలయం ఇది. అన్నింటిలోకెల్లా అత్యంత ప్రాచీనకాలానికి అంటే క్రీశ900 శతాబ్దానికి చెందింది. ఇది కాళిమాతకు చెందిన ఆలయం.

కాందారియ మహాదేవ్‌ దేవాలయం: ఖజురహోలోని అతిపెద్ద దేవాలయం ఇది. దీని ఎత్తు 31 మీటర్లు. ఇది శివాలయం.

నృత్యోత్సవాలు...
ఖజురహో లోని శిలలపై చెక్కిన శిల్పాలు ప్రదర్శించే నృత్యభంగిమలు అన్నీ ఇన్నీకావు. అలా నాట్యాలాడే శిల్పాలను తలదన్నే రీతిలో ఖజురహో నృత్యోత్సవాలు ఏటా కన్నుల పండువగా జరుగుతాయి. భారతీయ శాస్ర్తీయ నృత్య కళాకారులకు ఈ ఉత్సవాలు ప్రధాన వేదికగా నిలుస్తాయి. ఇవి ఏటా ఫిబ్రవరి / మార్చిలో జరుగుతాయి. వారం రోజుల పాటు జరుగే ఈ ఉత్సవాలకు దేశవిదేశాల నుండి పర్యాటకులు విశేషంగా తరలివస్తారు.

చూడాల్సినవివే...

mahesh-khajurahఖజురహో నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న పన్నా నేషనల్‌ పార్క్‌.. ఇక్క డ ముఖ్యమైన విహారకేంద్రం. ఖజురహో నుండి అరగంట ప్రయాణం. చిరుత పులి, పులి, చింకారా, తదితర వన్యమృగాలకు ఈ పార్క్‌ ఎంతో ప్రసిద్ధి. నేషన ల్‌ పార్క్‌కు వెళ్లే దారిలో ఉన్న పాండవ జలపాతాలు పర్యాటకుల మదిని ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇవే కాకుండా చుట్టుప్రక్కల వేణీసాగర్‌ డ్యాం, రాణె జలపా తాలు, రాంగ్వన్‌ సరస్సు, దూబెల మ్యూజియం ఇక్కడ ప్రసిద్ధిగాంచిన పర్యా టక ప్రదేశాలు. అంతేకాకుండా ఇక్కడి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న అజ య్‌గఢ్‌ కోట కూడా ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఈ ప్రాంతంలో కొండపైనున్న అ తిపెద్ద కోట ఇది. మరో అత్యంత పురాతన కోట కలింజర్‌. ఇది ఖజు రహో నుండి ఉత్తరదిశగా 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఎలా చేరుకోవాలి?
రోడ్డు మార్గం: సాత్నా, హర్పలూర్‌, ఝాన్సీ, మహోబా నుంచి ఖజురహోకు బస్సులు ఉన్నాయి.
రైలు మార్గం: ఖజురహో నుంచి 94 కిలోమీటర్ల దూరంలో హర్పలూర్‌, 61 కిలోమీటర్ల దూరంలో మహోబా నుంచి రైళ్లు ఉన్నాయి. ఢిల్లీ, చెన్నై నుంచి వచ్చే యాత్రీకులకు ఝ్సానీ నుంచి రైలు సదుపాయాలు ఉన్నాయి. ముంబై, కోల్‌కతా, వారణాసిల నుంచి వచ్చే వారిి ముంబై అలహాబాద్‌ మార్గం ద్వారా సాత్నా నుంచి ఉన్నాయి.

స్థానిక రవాణా మార్గాలు: ఖజురహోలోని దేవాలయాన్ని సందర్శించాలంటే స్థానికంగా ఉండే రవాణా మార్గాలపై ఆధారపడక తప్పదు. ఇక్కడ ప్రధా నంగా సైకిళ్లపై స్థానిక ప్రాంతాల్ని సందర్శించే పర్యాటకులు ఎక్కువ. కాబట్టి సైకిల్‌ రిక్షాలు, సైకిళ్లు అద్దెకు దొరకుతాయి.

కోటప్పకొండ... ‘ప్రభలు’...

కోటప్పకొండ.. దాదాపు ఈ పేరు చాలామందికి సుపరిచితం. ఇక్కడ త్రికూటేశ్వరుడు.. యల్లమంద కోటయ్యగా పూజలందుకుంటున్నాడు. ఆధ్యాత్మిక ప్రదేశంగానే కాకుండా.. పర్యాటకకేంద్రంగా కూడా ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయం.. శివరాత్రి పర్వదినం నాడు మాత్రం.. భక్తులతో కిటకిటలాడుతూంటుంది. 
ఈ కోటప్పకొండ విశేషాల గురించి తెలుసుకుందాం...

templesగుంటూరు జిల్లా.. నరసారావుపేట, చిలకలూరిపేట పట్టణాలకు అతి సమీపంలో ఉన్న త్రికూటేశ్వర స్వామి దేవాలయంలో.. శివరాత్రి సందర్భంగా.. జరిగే ప్రభల సంబరం అత్యంత పేరు విశిష్టమైన జాతర. ఈ ఉత్సవాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుండే కాక.. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారు. చిన్న చిన్న ప్రభల నుండి.. దాదాపు డెబ్బై, ఎనభై అడుగుల ఎతైన ప్రభలు.. శివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు తీసు కొస్తారు. వీటిని ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల లో.. డప్పులు, బ్యాండు, రికార్డింగ్‌ డ్యాన్సులతో.. ఇక్కడి తీసుకొస్తా రు. ఈ సందర్భంగా.. కొంత మంది పగటి వేషాలలో భక్తు లను అలరిస్తారు. ఒక్కొక్క ప్రభను ఒక్కో రకంగా అలంకరించి కొండ క్రింద పొలాల్లో ఉం చుతారు. ఇవి పెద్దవే వందల సంఖ్యలో ఉంటాయి. చిన్నవయితే లక్షల సంఖ్యలో కనుపిస్తూ, కొండ పైభాగమునుండి చూసేవారికి సముద్రంలొ తెరచాపల్లా కనువిందు చేస్తూఉంటాయి.

త్రికూట పర్వతాలయం...
shivass ఈ దేవాలయ శిఖరం.. మూడు విభాగాలుగా ఉంటుంది. ఈ క్షేత్రం మొదటి కొండపై ముసలి కోటయ్య గుడి ఉంది. ప్రస్తుతం ఇది శిథిలావస్థలో ఉంది. రెండవది.. త్రికోటేశ్వరస్వామివారి దేవాలయము కలది. ఇక్కడ ఎర్రగా ఉండే కోతులు ఒక ప్రత్యేకత. గుడి పరిసరాలలో భక్తులు ఇచ్చే ప్రసాదాలను తీసుకొంటూ ఒక్కోసారి లాక్కుంటూ తిరుగుతూ సండడి చేస్తాయి. ఇక్కడ ఒక పెద్దపుట్ట, నవగ్రహాలయం, ధ్యాన మందిరం, దేవాలయ వెనుక బాగంలో రెస్ట్‌ రూం ఉన్నాయి. ఇక మూడవ భాగమైన కొండ క్రింద బొచ్చు కోటయ్యగారి మందిరం, కళ్యాణ కట్ట, సిద్ధి వినాయక మందిరాలున్నాయి.

వసతి, రవాణా సౌకర్యాలు...
కొండపై టీటీడీ సత్రం, ప్రభుత్వ అతిథి గృహంతో పాటు.. కొండ దిగువన.. చాలా ఏళ్ళ క్రితం నిర్మించిన బసవ మందిరం ఉన్నాయి. కోటప్పకొండకు దగ్గరలో ఉన్న నరసరావుపేట పాత బస్‌స్టాండ్‌, కొత్త బస్‌ స్టాండ్‌ల నుండి ప్రతి అరగంటకు ఇక్కడకు బస్సు సౌకర్యం ఉంది. ఇవేకాక జీపులు, ఆటోలు లాంటి ప్రైవేట్‌ వాహనాలు సైతం.. ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.

ప్రకృతి అందాల కొలమానం ... కుమరకోమ్‌

సముద్ర గర్భాన్ని చీల్చుకుని వెలుపలికి వస్తున్నట్లుగా కడిగిన ముత్యంలా ప్రకాశించే సూర్య భగవాగవానుడి లేలేత కిరణాల హొయలు, ఆ ఆదిత్యుడికి స్వాగతం పలికే పక్షుల కిలకిలారావాలు, ఈ సుందర దృశ్యాలను ప్రతిబింబిస్తూ మురిసి మెరిసిపోయే సముద్ర అలలు.. గాలి తాకిళ్లను తట్టుకుని ముందుకు దూకే పడవలు, వాటిలోని జాలర్లు, పసిపిల్లల కేరింతల్లా చప్పుడుచేసే కొబ్బరాకుల గలగలలు.. ఇంతటి ప్రకృతి సౌందర్యాన్ని తనలో దాచుకున్న అద్భుతమైన ప్రాంతమే కేరళ.

water-houseసముద్ర జలాలతో ఏర్పడిన సరస్సులు, నదులు, పిల్లకాలువలు కలగలసి... కేరళ రాష్ట్రానికి దేశంలోనే అందమైన ప్రాంతంగా గుర్తింపు తెచ్చాయి. పశ్చిమ కనుమలలోని కార్డమమ్‌ హిల్స్‌ నుండి కనీసం 40 నదులు కేరళ గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంటాయి. కేరళలో సరస్సులున్న ప్రాంతాలను కుట్టునాడు అని అంటుంటారు. కుట్టునాడు అంటే.. పొట్టివాళ్ళు ఉండే ప్రదేశం అని అర్థం. ఇక్కడి రైతులు ఎప్పుడూ సాగుభూముల్లో మోకాలిలోతు కూరుకుపోయి పంట పనులు చేయటం వల్ల బహుశా ఆ ప్రాంతాలకు ఆ పేరు వచ్చి ఉంటుంది.

శతాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఫలసాయాలు, కొబ్బరి ఉత్పత్తులు, ఇతర వస్తువుల రవాణాకు మళయాళీలు ఈ నదులపైనే ఆధారపడ్డారు. అందుకేనేమో.. ఇప్పటికీ ఆయా లంకల్లోని మళయాళీలకు పడవలే రవాణా సౌకర్యాలు. పాఠశాలలకు పిల్లల్ని తీసుకెళ్లటం, తీసుకురావటం లాంటి వాటితో సహా ప్రజలు దైనందిన కార్యకలాపాలలో పడవ ప్రయాణాలు సర్వసాధారణం. ఈ తీర ప్రాంతాలలో విహారం ఓ అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇంత అందమైన ప్రకృతి దృశ్యాలను చూడాలంటే కోకొనట్‌ లాగూన్‌ రిసార్ట్‌కు వెళ్ళాల్సిందే మరి..!

కుట్టునాడ్‌ జీవనశైలికి ప్రతిబింబం..

కేరళలోని కొట్టాయం పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉండే కోకొనట్‌ లాగూన్‌ రిసార్ట్‌.. కొచ్చి నుంచి 78 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దట్టమైన పామ్‌ చెట్ల మధ్యలో.. వెంబనాడ్‌ సరస్సు తూర్పుతీరంలో కవనార్‌ నదీ ముఖద్వారం వద్ద ఈ కోకొనట్‌ లాగూన్‌ రిసార్ట్‌ వెలసింది. కుట్టునాడ్‌ ప్రజల జీవనశైలిని ప్రతిబింబిస్తూ, చక్కటి సరస్సులు, నదులు కలగలసి ఉన్న ఈ ప్రదేశంలోని కోకొనట్‌ లాగూన్‌ హెరిటేజ్‌ రిసార్ట్‌... పచ్చని చీరను చుట్టుకున్నట్లుగా ప్రకృతి తన అందాలతో అలరింపజేస్తుంది. కేరళ సంప్రదాయసిద్ధమైన ధారవాడ నిర్మాణశైలిలో నిర్మించిన విడి కాటేజీలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ కాటేజీలన్నీ పురాతనమైన భవనాలు కావడంతో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

ది గాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ థింగ్స్‌లోనూ...
house-kerala ప్రపంచ ప్రఖ్యాత రచయిత అరుంధతీరాయ్‌కి బుకర్‌ ఫ్రైజును తెచ్చిపెట్టిన ‘గాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ థింగ్స్‌’లో పేర్కొన్న కోకొనట్‌ లాగూన్‌ రెస్టారెంట్‌.. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న కోకొనట్‌ లాగూన్‌ రిసార్ట్‌లోని ఒక పురాతన భవనం కావడం విశేషం. ఇది అద్భుతమైన కేరళ వంటకాలకు ప్రసిద్ధి చెందిన ధారావాడ శైలిలో నిర్మించిన చక్కటి భవనంలో ఉన్న ఈ రెస్టారెంట్‌ కోకొనట్‌ లాగూన్‌ రిసార్ట్‌లోకెల్లా అత్యంత పురాతన భవనం. ఓ మళయాళీ కుటుంబానికి చెందిన ఈ భవనాన్ని కొనుగోలు చేసి జాగ్రత్తగా ముక్కలుచేసి తెచ్చి, ఈ లాగూన్‌లో మళ్లీ నిర్మించటం మరో విశేషం. కోకొనట్‌ లాగూన్‌లోని రిసెప్షన్‌ భవనం ఒక్కటే కేరళలోని సంప్రదాయ సిద్ధమైన మరో నిర్మాణశైలి, నలుకెట్టు ఆకృతితో అందంగా ఆహ్వానిస్తూంటుంది. నిజానికి ఇది ఈ లాగూన్‌కు సమీపంలో ఉండే గ్రామమైన వైకోమ్‌లో 1860లో నిర్మితమై, ఒక బ్రాహ్మణ కుటుంబీకులు నివాసం ఉండిన పురాతన భవనం. దీనిని కొనుగోలు చేసి లాగూన్‌కు తెచ్చి పునర్నిర్మించారు.

ఇవీ వసతులు...
చిన్న చిన్న కాటేజీలు, కొన్ని ఏసీ సౌకర్యం ఉన్న గదులు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. 14 హెరిటేజ్‌ మాన్షన్లు, 28 హెరిటేజ్‌ బంగ్లాలు, 8 ప్రైవేట్‌ పూల్‌ విల్లాలు పర్యాటకులకు చక్కని వసతులు అందించగలవు. హెరిటేజ్‌ మాన్షన్స్‌లో అయితే ఒక్కో కాటేజీకి రెండు అంతస్థులు ఉండి, పై అంతస్తు నుండి వెంబనాడ్‌ సరస్సు అందాలను చూసేందుకు వీలుగా ఉంటుంది.

సూర్యాస్తమయం అద్భుతం...
keralas సూర్యాస్తమయ దర్శించేందుకు కోకోనట్‌ లాగూన్‌ రిసార్ట్‌ను మించిన అనువైన ప్రదేశం మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈ లాగూన్‌ చుట్టుపక్కల ప్రాంతాలను పడవల్లో ప్రశాంతంగా తిరుగుతూ చూడటం మరో అనిర్వచనీయమైన అనుభూతి. ఈ రిసార్ట్‌కు సమీపంలో, కవనార్‌ నదికి దక్షిణ ప్రాంతంలో నెలవైన రక్షిత పక్షుల కేంద్రం మరో ఆకర్షణీయమైన ప్రదేశం అని చెప్పవచ్చు.

సౌందర్య వీక్షణమే కాదు.. ఆరోగ్య సౌలభ్యం కూడా...
ఆయుర్వేదిక్‌ మసాజ్‌, యోగ, ధ్యానం, మారుమూల ప్రాంతాలకు పడవ ప్రయాణాలు, రైస్‌ బోట్‌ ప్రయాణాలు, ఫిషింగ్‌, ఈత లాంటివి ఈ కోకొనట్‌ లాగూన్‌ రిసార్ట్‌ అదనపు ఆకర్షణలుగా చెప్పవచ్చు. స్థానిక, అంతర్జాతీయ (బఫె) భోజన సదుపాయాలు ఈ ప్రాంతాల్లో లభ్యం అవుతాయి. సాధారాణంగా ఇక్కడి వాతావరణం కనిష్టంగా 23 డిగ్రీల సెల్సియస్‌, గరిష్ఠంగా 32 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. ఇక్కడి చేరుకోవాలంటే.. కొచ్చిలోని కాసినో హోటల్‌ నుండి నేరుగా అక్కడికి ప్రయాణికులను చేరవేసే పడవ సౌకర్యం ఉంటుంది. లేదా కొంతదూరం రోడ్డు మార్గంలో ప్రయాణం చేసి కుమరకోమ్‌ నుండిగానీ.. పుతెన్గడి నుండిగానీ పడవ ప్రయాణం ద్వారా కోకొనట్‌ లాగూన్‌ హెరిటేజ్‌ రిసార్ట్‌కు చేరుకోవచ్చు.

మరో ప్రకృతి సౌందర్యం.. కుమరకోమ్‌...
కేరళ ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందిన కుట్టనాడ్‌ ప్రాంతంలో వెంబనాడ్‌ సరస్సు పరీవాహక ప్రాంతంలో ఈ కుమరకోమ్‌ కొలువై ఉంది. ఈ సరస్సు నుండి పిల్లకాలువలు విస్తరించి, మధ్య లంకలన్నీ గుబురైన కొబ్బరి చెట్లతో పచ్చగా, చల్లగా, ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండి కుమరకోమ్‌కు వన్నె తెస్తాయి. కేవలం ఈ ప్రాంతంలోనే కాదు. కేరళలోని మరెన్నో ప్రాంతాలలో ప్రధాన రవాణా మార్గాలుగా పలు నదులు, కాలువలు నిలుస్తున్నాయి. పల్లెలను, పట్టణాలను కలిపే ఈ నదీమార్గాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. కుట్టనాడ్‌లో నదీమార్గం ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఘనత సాధించింది. కేరళ గ్రామీణ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ పడవలలో ఈ నదీమార్గాల ద్వారా చేసే ప్రయాణం ఎన్నటికీ మరపురానిది.

అన్నీ పడవల ద్వారానే...
కుమారకోమ్‌.. కేరళలోని ప్రసిద్ధ విహార కేంద్రం. ఈ ప్రదేశంలో సింహభాగం నీటితో నిండి ఉంటుంది. ఎటుచూసినా.. సరస్సులు, సెలయేళ్లతో నిండివుంటుంది. ఇక్కడి చుట్టు పక్కల గ్రామాలకు.. పాలు మొదలకుకొని.. కూరగాయలు, గ్యాస్‌ సిలిండర్లు, పప్పులు, నూనెలు ఇలా గృహావసరాలకు కావలసిన ఏ వస్తువైనా లాంచీల్లో రావాల్సిందే. ఇక్కడ రోడ్లకంటే.. నదీ పాయలే ఎక్కువ. బైకులు, మోటార్‌సైకిళ్లకంటే.. బోట్లే ఎక్కువ. చుట్టూ నీరుండడంతో.. ఇక్కడి ప్రజల్లో చాలామంది చేపల వేటనే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు.

ఆగస్టు, సెప్టెంబర్‌లలో వెంబనాడ్‌ సంబరాలు...
locationssకేరళ పేరు చెప్పగానే గుర్తొచ్చే అంశాలలో పడవల పోటీ ఒకటి. వెంబనాడ్‌ సరస్సులో ప్రతి సంవత్సరం ఆగస్టు, సెప్టెంబరు నెలల మధ్యకాలంలో నిర్వహించే ఈ పోటీలు నీళ్లలో పోటీజ్వాలలు రగులుస్తాయని అంటుంటారు. నాటి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ స్మారకంగా నెహ్రూ బోట్‌ రేస్‌ పేరిట నిర్వహించే పడవల పోటీ అత్యంత ఆసక్తికరంగా సాగుతుంది. ఆగస్టు నెల రెండవ శనివారంనాడు దీనిని నిర్వహిస్తారు. మళ్లీ ఓనమ్‌ సందర్భంగా అళప్పూజ ప్రాంతంలో అరణ్‌ముల పడవల పోటీ నిర్వహించడం ఆనవాయితీ.కొట్టాయం నుండి పది కిలోమీటర్ల దూరంలో.. కొచ్చిన్‌ నుండి 78 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే.. సగం దూరం రోడ్డు గుండా చేరుకుని తన్నీర్ముక్కమ్‌ జెట్టీ ద్వారా కుమరకోమ్‌ చేరుకోవచ్చు. సమీపంలోని రైల్వే స్టేషన్‌ కొట్టాయం. సమీపంలోని విమానాశ్రయం.. కొచ్చిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం.

కుమరకోమ్‌ పక్షుల రక్షిత ప్రాంతం...
కుమరకోమ్‌ ప్రాంతం అంతా వెంబనాడ్‌ సరస్సు తీరంలోని చిన్నచిన్న లంకలతో కలిపి ఉంటుంది. ఇదంతా కుట్టనాడ్‌ ప్రాంతానికి చెందిందే. ఇక్కడ 14 ఎకరాలలో విస్తరించి ఉన్న పక్షుల రక్షిత ప్రదేశం పక్షుల వీక్షకులకు చక్కని అనుభూతిని కలుగజేస్తుంది. కోయిలలు, హంసలు, వలస పక్షులు, లొట్టిపిట్టలు, సైబీరియన్‌ స్టార్క్‌ వంటి అనేక జాతుల పక్షులకు ఇది ఆవాస ప్రదేశం. ఈ పక్షులను సందర్శించాలనుకుంటే ఇక్కడి లంకల్లో పడవల్లో ప్రయాణించడం ఒక్కటే ఉత్తమ మార్గం.

మరెన్నో ప్రత్యేకతలు ....

కుమరకోమ్‌లో ఇంకా ఎన్నో ప్రత్యేక ఆకర్షణలు పర్యాటకలను ఆకట్టుకుంటాయి. ఇక్కడి తాజ్‌ గార్డెన్‌ రిట్రీట్‌లో బోటింగ్‌, ఫిషింగ్‌ సౌకర్యాలు ఉన్నాయి. కేరళ పర్యాటక అభివృద్ధి సంస్థ కుమరకోమ్‌ టూరిస్ట్‌ గ్రామ సముదాయంలో భాగంగా కొబ్బరి, అరటి తోటల్లో కాటేజీలను ఏర్పాటు కూడా ఉంది. పడవ ఇళ్లలో హాలిడే ప్యాకేజీలు వర్ణతీతమైన అనుభవం.