సాధారణంగా ఒక టూర్లో దేవాలయాలను గాని, చారిత్రక ప్రదేశాలను గాని, ప్రకృతి రమణీయ ప్రదేశాలను గాని ఏదో ఒకటే చూస్తాం. కాని ఇవన్నీ ఒకే చోట అందుబాటులో ఉండే అరుదైన ప్రదేశాల్లో ఒకటి మన రాష్ట్రంలోనే మహబూబ్నగర్ జిల్లా నల్లమల అడవుల్లో ఉంది. పేరు సలేశ్వరం. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళేమార్గంలో 150 కిలోమీటర్ల మైలు రాయి దగ్గర ఫరహాబాద్ గేటు ఉంటుంది. అక్కడి నుండి 32 కి.మీ. దట్టమైన అడవుల్లోకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్వారి అనుమతితో వెళ్లొచ్చు. 10 కి.మీ. వెళ్ళగానే రోడ్డుకు ఎడమ పక్కన నిజాం కాలపు శిథిల భవనాలు కనిపిస్తాయి. నిజాం రాజు అక్కడి ప్రకృతి అందాలకు, చల్లదనానికి ముగ్దుడై వందేళ్ళకు ముందే అక్కడ వేసవి విడిదిని నిర్మించుకొన్నాడు. అందుకే ఆ ప్రదేశానికి ఫరహాబాద్, అంటే అందమైన ప్రదేశం అని పేరొచ్చింది. అంతకు ముందు దాని పేరు పుల్లచెలిమల (పులుల చెలిమలు). ఆ ప్రాంతంలో పులులు ఎక్కువగా సంచరిస్తాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం 1973లో 'ప్రాజెక్ట్ టైగర్' పేరిట పులుల సంరక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది మన దేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణా కేంద్రం. 'టైగర్ సఫారీ' పేరిట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు నల్లమల అడవుల్లో స్వేచ్ఛగా తిరుగాడే జంతువులను, పులులను చూపిస్తారు.
నిజాం విడిది (రాంపూర్ చెంచుపెంట) చౌరస్తా నుంచి ఎడమకు తిరిగి 22 కి.మీ. వెళ్ళిన తర్వాత సలేశ్వరం బేస్క్యాంప్ వస్తుంది. అక్కడ వాహనాలు ఆపుకోవాలి. అక్కడనుండి సలేశ్వరం అనే జలధార (వాటర్ఫాల్స్)ను చేరుకోవడానికి 2 కి.మీ నడవాలి. రెండు పొడవైన, ఎత్తైన గుట్టలు ఒకదానికొకటి సమాంతరంగా ఉత్తర దక్షిణాలుగా ఉన్నాయక్కడ. ఆ గుట్టల మధ్య ఒక లోతైన లోయ (సుమారు అర కి.మీ.)లోకి ఈ జలధార దుముకుతుంది. తూర్పువైపున్న గుట్టను అమాంతంగా అర కిలోమీటరు దిగి (పశ్చిమం వైపుకి) తరువాత దక్షిణం వైపుకి తిరిగి పశ్చిమపు గుట్టపైన కిలోమీటరు దూరం నడవాలి. ఆ గుట్ట కొసను చేరుకొన్నాక మళ్ళీ ఉత్తరం వైపు తిరిగి గుట్టల మధ్య లోయలోకి దిగాలి. అలా దిగేటప్పుడు మనలని ఎన్నో గుహలు, గుట్ట పొరల్లోంచి రాలి పడుతున్న సన్నని జలధారలు అలరిస్తాయి.
సలేశ్వరం జలధార: కుండం ఒక ఫర్లాంగు దూరంలో ఉందనగా లోయ అడుగు భాగానికి చేరుకుంటాం. అక్కడి నుండి కుండం నుండి పారే నీటి ప్రవాహం వెంట రెండు గుట్టల మధ్య గల ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. ఒకచోటయితే కేవలం బెత్తెడు దారి మీద నుంచి నడవాల్సి ఉంటుంది. అక్కడ జారితే భక్తుడు శివైక్యం చెందవలసిందే. కుండం (గుండం) చేరిన తరువాత అత్యంత అద్భుతమైన దృశ్యం మనకు దర్శనమిస్తుంది. కొన్ని వందల అడుగుల ఎత్తు నుంచి జలధార కుండంలోకి దుముకుతుంది. కుండం దగ్గర నిలబడి పూర్తిగా తల ఎత్తి పైకి చూస్తే రెండు గుట్టలు ఒక నిజమైన పెద్ద కుండగా ఏర్పడినట్లు, ఆ కుండ మూతి నుండి ఆకాశం, సూర్యకిరణాలు లీలగా కనిపిస్తున్నట్లు తోస్తుంది.జలధార కింద నేను, నా మిత్రుడు రామారావు స్నానం చేశాం. ఆ నీటి చల్లదనానికి ఒళ్ళు పులకించిపోయింది. దోసిళ్ళతో కడుపు నిండా నీళ్ళు తాగాం. ఎన్నో అరణ్య మూలికల సారంతో కూడిన ఆ నీటిని తాగడం వల్లనేమో ఆ రోజంతా మాకు ఆకలే కాలేదు. జలధార కింద కుండం, కుండం ఒడ్డుపైన తూర్పు ముఖం చేసుకొని రెండు గుహలు ఒకదానిపై ఒకటి ఉన్నాయి. పై గుహనే ముందు చేరుకోవచ్చు. ఆ గుహలోనే ప్రధాన దైవమైన లింగమయ్య స్వామి లింగం ఉంది. ఆ స్వామికి స్థానిక చెంచులే పూజారులుగా వ్యవహరిస్తున్నారు. స్వామికి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని కొద్దిగా దక్షిణంగా నడిచి కింది గుహలోకి వెళ్ళాం. ఈ గుహలో కూడా శివలింగమే ఉంది. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలు ఉన్నాయి.
జాతర ప్రత్యేకత
సలేశ్వరం జాతర సంవత్సరానికొకసారి చైత్ర పౌర్ణమికి రెండు రోజులు ముందు, రెండు రోజులు వెనుక మొత్తం ఐదు రోజులు జరుగుతుంది. ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరుగుతుంది కాబట్టి కొంతమంది దాతలు ఉచిత భోజన వసతి, నీరు, ప్రాథమిక ఆరోగ్య సేవలను అందిస్తున్నారు. స్థానికులు కొందరు అరుదైన వనమూలికలను తక్కువ ధరలకే అమ్ముతున్నారు. భక్తులు దారి పొడవునా 'అత్తన్నం అత్తన్నం లింగమయ్యో', 'పోతున్నం పోతున్నం లింగమయ్యో' అని అరుస్తూ నడుస్తుంటారు.
చారిత్రక ఆనవాళ్లు
నాగార్జునకొండలో బయటపడిన ఇక్ష్వాకుల నాటి (క్రీ.శ. 220 - క్రీ.శ. 360) శాసనాలలో 'చుళ ధమ్మగిరి' గురించిన ప్రస్తావన ఉంది. ఆ గిరిపై ఆనాడు శ్రీలంక నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువుల కోసం ఆరామాలు, విహారాలు కట్టించారట. ఆ చుళ ధమ్మగిరి ఈ సలేశ్వరమేనేమోననిపిస్తుంది. కారణం అక్కడ ఇక్ష్వాకుల కాలపు కట్టడాలున్నాయి. లింగమయ్య గుడి గోడల ఇటుకల పరిమాణం 16" x 10" x 3" (పొడవు x వెడల్పు x ఎత్తు) అంగుళాలుగా ఉంది. ఇలాంటి ఇటుకల వాడకం ఇక్ష్వాకుల కాలంలోనే ఉండేది. 'చుళ' తెలుగులో 'సుల' అవుతుంది కాబట్టి బౌద్ధ క్షేత్రం శైవక్షేత్రంగా మార్పు చెందాక సులేశ్వరం (లేదా శూలేశ్వరం) గాను, చివరిగా సలేశ్వరంగానూ మారి ఉంటుందనిపిస్తుంది.ఇక్ష్వాకుల నిర్మాణాలకు అదనంగా విష్ణుకుండినుల (క్రీ.శ. 360-క్రీ.శ. 570) కాలపు నిర్మాణాలు కూడా ఉన్నాయి. వీరి ఇటుకల పరిమాణం 10" x 10" x 3" అంగుళాలుగా ఉంటుంది. దిగువ గుహలోని గర్భగుడి ముఖద్వారం పైన విష్ణుకుండినుల చిహ్నమగు 'పూలకుండి' శిలాఫలకం ఉంది. (అయితే అలాంటి కుండ శాతవాహనులకు, ఇక్ష్వాకులకు కూడా చిహ్నంగా ఉండేది.) ద్వారబంధంపై గడప మధ్యన గంగమ్మ విగ్రహం ఉంది. ద్వారం ముందర కుడి పక్కన సుమారు రెండున్నర అడుగుల ఎత్తుగల నల్లసరపు మీసాల వీరభద్రుని విగ్రహం నాలుగు చేతుల్లో నాలుగు ఆయుధాలతో ఉంది. కుడి చేతుల్లో గొడ్డలి, కత్తి, ఒక ఎడమ చేతిలో డమరుకం, మరో ఎడమ చేయి కిందికి వాలి ఒక ఆయుధాన్ని పట్టుకుని ఉంది.
వీరభద్రుని కింద కుడివైపున పబ్బతి పట్టుకున్న కిరీటం లేని వినాయకుని ప్రతిమ ఉండగా, ఎడమవైపున స్త్రీ మూర్తి (?) ఉంది. ద్వారానికి ఎడమ వైపున విడిగా రెండు గంగమ్మ విగ్రహాలు(?) ఉన్నాయి. ఇవే పాతవిగా తోస్తున్నాయి. ఆ విగ్రహాల ముందర ఒకనాటి స్థిర నివాసాన్ని సూచించే విసురు రాయి ఉంది. గుడికి ఎడమ వైపున గల రాతి గోడకి బ్రాహ్మీలిపిలో ఒక శాసనం చెక్కబడి ఉంది. కుడివైపున గల గోడమీద ఒక ప్రాచీన తెలుగు శాసనం ఉంది. ఈ రెండూ విష్ణుకుండినుల శాసనాలుగా తోస్తున్నాయి. వీటిని చరిత్రకారులు చదివితే విష్ణుకుండినుల జన్మస్థానాన్ని ఖచ్చితంగా నిర్ణయించవచ్చుననిపిస్తోంది.
'స్థల మహాత్మ్యం' అనే ఒక ప్రాచీన తెలుగు క్షేత్రమహాత్మ్య కావ్యంలో దీన్ని (సలేశ్వరం) రుద్ర కుండంగా, దీనికి ఈశాన్యాన గల మల్లెల తీర్థం అనే జలపాతాన్ని విష్ణుకుండంగా, పశ్చిమాన గల లొద్దిని (గుండం) బ్రహ్మకుండంగా పేర్కొన్నారు. విష్ణుకుండిన రాజులు ఈ ప్రాంతం నుంచి ఎదిగినారు కనుకనే ఈ ప్రాంతపు పేరు పెట్టుకొన్నారు. ఈ విషయాన్ని ప్రముఖ చరిత్రకారుడు బి.ఎన్. శాస్త్రి నిరూపించారు కూడా.
క్రీ.శ. పదమూడవ శతాబ్దాంత కాలం నాటి 'మల్లికార్జున పండితారాధ్య చరిత్ర'లో 'శ్రీ పర్వత క్షేత్ర మహాత్మ్యం'లో కూడా ఈ సలేశ్వర విశేషాలను పాల్కురికి సోమనాథుడు విశేషంగా వర్ణించాడు. 17వ శతాబ్దాంతంలో మహారాష్ట్రకు చెందిన ఛత్రపతి శివాజీ కూడా ఇక్కడ ఆశ్రయం పొందినట్లు స్థానిక చరిత్ర చెపుతోంది.
ప్రకృతి రమణీయత
భారతదేశంలోని అడవుల్లో నల్లమల అడవులు రెండవ పెద్ద అడవులుగా పేర్గాంచాయి. ఈ అడవులు హైదరాబాద్-శ్రీశైలం రహదారిలో 130 కి.మీ. తరువాత మన్ననూరులో ప్రారంభమవుతాయి. సముద్ర మట్టానికి సుమారు కి.మీ. ఎత్తున ఏర్పడడం వలన ఈ అటవీ ప్రదేశం చల్లగా ఉంటుంది. సలేశ్వరం దగ్గర్లోనే భూమి-గుట్టల సంగమ ప్రాంతం (వ్యూపాయింట్) ఉండటం వలన చల్లగాలులు వీస్తూ అలరిస్తాయి. ఇదే ప్రాంతంలో 'పులుల చెలిమలు' (పులులు నీరు తాగే కుంటలు) కూడా ఉండటం వలన గాలిలో చల్లదనం ఎక్కువ అవుతుంది. ఎత్తైన చెట్లు, కంక పొదలు, వాటిపైన రకరకాల పక్షులు, కోతులు మనల్ని దారిపొడవునా అలరిస్తాయి.సలేశ్వరం లోయ సుమారు రెండు కి.మీ. పొడవుండి మనకు అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ను గుర్తు చేస్తుంది. గ్రాండ్ కాన్యన్ అందాలను చాలామంది మెకనెస్గోల్డ్ సినిమాలో చూసి ఉంటారు. సలేశ్వరంలోని తూర్పు గుట్ట పొడవునా స్పష్టమైన దారులున్నాయి. అవి జంతువులు నీటికోసం వెళ్ళే మార్గాలని స్థానిక గిరిజనుడు చెప్పాడు. పడమటి గుట్టలో ఎన్నో గుహలున్నాయి. అవన్నీ ఒకప్పుడు ఆదిమ మానవులకు, ఆ తరువాత బౌద్ధ భిక్షువులకు, మునులకు, ఋషులకు స్థావరాలుగా ఉండేవని అక్కడి ఆధారాలే చెప్తున్నాయి. ఇప్పుడు కూడా ఆదిమ మానవుల ఆనవాళ్ళైన చెంచులు అక్కడ జీవిస్తున్నారు.
అడవిలో ట్రాఫిక్ జామ్
సలేశ్వరం జాతరకు ఇంతకు ముందు స్థానిక ప్రాంతాలవారే పోయేవారు. ఇప్పుడు సుదూర ప్రాంతాల నుండి కూడా పర్యాటకులు రావడంతో అక్కడ ట్రాఫిక్ పెరిగిపోయింది. ఈ సంవత్సరమైతే రికార్డు స్థాయిలో రెండు లక్షల మంది ఈ జాతరను వీక్షించారని ఫారెస్ట్ అధికారులు చెప్పారు. దాంతో లింగమయ్య దర్శనానికి పర్యాటకులు గంటల తరబడి క్యూలో నిల్చోవలసి వచ్చింది.
ఇంతకు ముందు తిరుపతి దర్శనానికే అలాంటి పరిస్థితి ఉండేది. అడవిలో ఎత్తైన చెట్ల మధ్య ఇరుకైన దారిలో వందలాది వాహనాలు వెళ్లాల్సివచ్చేసరికి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ వార్త టీవీల్లో కూడా వచ్చింది. ఏప్రిల్ 17న సలేశ్వరానికి వెళ్ళిన మాకు అడవి నుంచి బయటకు రావడానికి ఐదు గంటల సమయం పట్టింది. ఐతే అర్థరాత్రి అడవిలో పున్నమి వెన్నెల్లో గడపడం భలే ఆనందంగా అనిపించింది.
ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు, పరిశోధకులకు ఎంతగానో నచ్చే ప్రదేశం ఇది.
- డా. ద్యావనపల్లి సత్యనారాయణ
94406 87250




కోర్టీసెప్లు అంటే పురుగులు. ఇవి 14 నుండి 17 వేల అడుగుల ఎత్తులో ఉండే మంచుకొండల మీద ఉంటాయి. అవి ఒక రకమైన పురుగు మొక్కలు. చలికాలంలో పురుగులాగా, ఎండాకాలంలో గడ్డిలాగా కనిపిస్తాయి. నిజానికి ఇవి Himalayan Bat Moth అనే పురుగులు. ఇవి గొంగళి పురుగుల్లాగా ఉండి పసుపురంగులో మెరుస్తూ, చిన్న మంచు కన్నాలలో కూరుకుపోయి ఉంటాయి. వైద్యానికి పనికి వచ్చే ఈ చిత్రమైన కోర్టీసెప్లకు హాంగ్ కాంగ్, సింగపూర్ చేశాల్లో మంచి డిమాండ్ ఉంది. శీతాకాలంలో ఆ ప్రాంత ప్రజలు వాటి సేకరణలో ఉంటారు.
హిమ శిఖరమంటేనే ప్రకృతి అందాలకు నెలవు. అలాంటి అందాల నడుమ సిమ్లా రాజధానిగా విరాజిల్లుతున్న హిమాచల్ ప్రదేశ్కి మధ్యలో ఉన్నదే మనాలి... అక్కడి అందాలను చూస్తే మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. కాలుష్యానికి అలవాటుపడి ట్రాఫిక్ కూడళ్ల మధ్య చిక్కుకుపోయి, కాంక్రీట్ జంగిల్లో కాపురాలు చేస్తున్న హైటెక్ నగరవాసికి ప్రశాంత కూడలి... ఈ మనాలి. అందుకే దీనిని స్విడ్జర్లాండ్ ఆఫ్ ఇండియా అంటారు.
మామూలుగా అయితే శీతాకాలంలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. కాబట్టి ఆ సీజన్లో ఉన్ని దుస్తులు తప్పనిసరిగా వేసుకుని తిరగాల్సిందే. సమ్మర్లో మాత్రం సాధారణ ఉష్ణోగ్రతం ఉంటుంది. అందుకనే ఎక్కువగా పర్యాటకులు ఈ సీజన్లోనే ఈ ప్రాంతానికి వెళుతుంటారు. ఎటుచూసినా ఎత్తయిన కొండలు, లోయలు... దట్టమైన అటవీ ప్రాంతాలతో... ప్రకృతి అందాలను రెట్టింపుచేసేలా అందమైన పక్షుల కువకువ ధ్వనులతో అలరారుతుంటుంది. సంవత్సరమంతా సీజన్తో నిమిత్తం లేకుండా ఎప్పుడైనా సందర్శించవచ్చు.
వరి, గోధుమ ఇక్కడి ముఖ్య పంటలు. ఇక్కడి ప్రజలు కోద్ర, సత్యార వంటి ఎనర్జెటిక్ ఫుడ్ను ఆహారంగా తీసుకోవడం విశేషం. వీరికి టీ అంటే మక్కువ. ప్రతి ఇంటికి ఒక ఆవు ఉంటుందక్కడ. అందుకనే పాలతో తయారు చేసిన వెన్న, పెరుగు, లస్సీ వంటివి ఇక్కడ విరివిగా ఉపయోగిస్తారు. కులు మనాలి ప్రజలు బార్లీతో తయారుచేసిన ప్రత్యేకమైన వైన్, రెడ్ రైస్ను విందులు వినోదాల్లో తరచుగా తీసుకుంటారు. ఈ రెండింటినీ ‘చక్తి’, ‘లుగ్రి’ అని పిలుచుకుంటారు.
మనాలికి దక్షిణాన 52 కిలోమీటర్ల పరిధిలో భూంటార్ ఎయిర్పోర్ట్ ఉంది. అక్కడినుంచి మనాలి నుంచి ఢిల్లీ వయా సిమ్లాకు విమాన సౌకర్యం ఉంది. 135 కిలోమీటర్ల పరిధిలో జోగీందర్నగర్ నుంచి నేరో గేజ్ లైన్ రైలు సౌకర్యం ఉంది. బ్రాడ్ గేజ్ లైన్ చంఢీఘఢ్ దాకా ఉంది. చంఢీఘఢ్ నుంచి 310 కి.మీ.దూరం. ఢిల్లీ నుంచి మనాలి వరకు రోడ్డు సౌకర్యం ఉంది. వీటి మధ్య 585 కి.మీ. దూరం ఉంది. మనాలి నుంచి సిమ్లాకు 270 కి.మీ. దూరం. బస్సు సౌకర్యం ఉంది.









కాశ్మీరుకి బయల్దేరేముందు మేము పడ్డ ఆందోళన ఇంతా అంతా కాదు. 'కాశ్మీరా? ఫరవాలేదా? అక్కడంతా అల్లర్లట కదా... కాల్పులట కదా' అని మా మిత్రులు, సన్నిహితులూ మొదట్లో భయపెట్టారు. తీరా అక్కడికి చేరాక ఆ భయమంతా పటాపంచలైపోయింది. మీడియా కాస్త ఎక్కువ చేస్తోందేమో అనే అనుమానం వచ్చింది.




"దేవుడు మొదట మారిషస్ను సృజించి, తరువాత స్వర్గాన్ని సృష్టించాడు. నిజం చెప్పాలంటే, మారిషస్కు నకలుగానే స్వర్గాన్ని సృష్టించాడు''- సుప్రసిద్ధ రచయిత మార్క్ట్వైన్ చేసిన వ్యాఖ్యలో కొంత ప్రశంస ఉన్నా, ఎక్కువ కొంటెతనమే ఉన్నది. మారిషస్ అందాన్ని గురించి పర్యాటకులు సరే, అక్కడి ప్రజలు చెప్పుకునే గొప్పలను వినీవినీ ఆయన ఆ మాటలు అన్నారట. ఆ మాటల్లోని వ్యంగ్యాన్ని విసిరిపారేసి, వాచ్యార్థంలోనే ఆయన ప్రశంసను మారిషన్లు ఇప్పుడు ప్రస్తావిస్తూ ఉంటారు. 



అరేబియన్ ఎడారి అంచున ఉన్న.. నబతియన్ సామ్రాజ్యపు చారిత్రక రాజధాని నగరం పెట్రా. సముద్ర సంబంధిత సాంకేతిక రంగంలో ప్రవీణులైన నబతేయన్లు ఈ నగరానికి ఎన్నో సొరంగ మార్గాలను, నీటి కందకాలను నిర్మించారు. గ్రీకు-రోమన్ల సంస్కృతికి నిలువుటద్దం లాంటి.. సుమారు నాలుగువేల మంది ప్రేక్షకులు కూర్చోవడానికి వీలుగా వుండే ఒక రంగస్ధలం ఇక్కడి ప్రధాన ఆర్షణ. అందువల్లనే ఈ నగరం.. నేటి ఆధునిక ప్రపంచవింతల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. గ్రీకు, రోమన్ నాగరికత ఇక్కడి కపిలవర్ణ శిలల్లో మనకు దర్శనమిస్తుంది. ఎల్-డీయర్ మోనాస్టరీ (ఒక మఠం వంటి ప్రాంగణం) వద్ద హెలెనిస్టిక్ దేవాలయానికి అభిముఖంగా ఉన్న.. పెద్ద పెద్ద భవనాల్లాంటి ఎన్నో సమాధులు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఇవి మధ్య తూర్పు దేశాల సంస్కృతికితార్కాణాలుగా నిలుస్తున్నాయి.
ఆధునిక ప్రపంచవింతల్లో ఒకటైన నగరం జోర్డాన్లోని పెట్రా. ఇదే కాదు.. మరో చారిత్రక నగరం జెరిష్ కూడా ఎన్నో చారిత్ర విశేషాలను తనలో దాచుకుంది. దాదాపు రెండు వేల ఏళ్ళ చరిత్ర కలిగిన పెట్రా ఒకప్పటి వ్యాపార కేంద్రం. మౌంట్ హోర్ అనే పర్వతాన్ని తొలిచి ఈ నగరాన్ని నిర్మించారట. పెట్రా అన్న పదం గ్రీకు పదం పెట్రియా నుంచి వచ్చింది. అంటే రాయి అని అర్థం. ్రపూ.6వ శతాబ్దంలో నబాటియన్ల రాజధానిగా వెలుగొంది గ్రీకు చరిత్రకి ఎన్నెన్నో అద్భుత కళకృతులను అందించింది. ఇప్పటికీ శాస్తవ్రేత్తల మదిని తొలిచే సంగతుల నెన్నింటినో ఈ నగరం వెలికి తెస్తూనే ఉంది. 1812 వరకూ పెట్రా ఆనవాళ్లు ప్రపంచానికి తెలియదు. స్విస్ చారిత్రిక పరిశోధకుడు జోహన్ లడ్విగ్ బర్కంత్ ఈ పెట్రా చరిత్ర పుటల్ని తెరిచిన మొట్టమొదటి వ్యక్తి. ఈ నగరాన్ని రెడ్-రోజ్ సిటీగా అభివర్ణించాడు జాన్ విలియం అనే కవి.
యునెస్కో చారిత్రక నగరాల్లో ఒకటిగా పేరుగాంచిన ఈ కోటను.. ఇక బీబీసీ మరికాస్త ముందుకు వెళ్లి... మరణించేలోపు మీరు చూడాలనుకుంటున్న అరుదైన పర్యాటకకేంద్రాల్లో పెట్రా ఒకటని తేల్చేసింది. అందుకే ఈ అందమైన నగరం ఆధునిక ప్రపంచవింతల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. పెట్రా చారిత్రక కట్టడమే కాదు.. సువిశాలంగా విస్తరించిన పర్షియల్ గల్ఫ్ ప్రాంతానికి చేరుకోవటానికి చక్కటి మార్గం కూడా. దక్షిణాన.. గాజా, ఉత్తరాన.. బోస్రా, డమాస్కస్, అకాబా, లూరుూస్ ప్రాంతాల వారితో నబాటియన్లు వ్యాపార వ్యవహారాలు నడిపేవారట. చుట్టూ ఎడారి ప్రాంతం.. కొండలూ గుట్టల మధ్య ఎలాంటి నీటి వసతి లేకున్నా.. చక్కటి ప్రణాళికతో నబాటియన్లు నిర్మించిన ఈ కోట చరిత్రకు పునాదులు వేసింది. ఉన్నపళంగా వరదలు ముంచెత్తినా.. ఏళ్ళ తరబడి వర్షాలు కురవకపోయినా.. నబాటియన్ల ఆలోచనల ముందు ప్రకృతి సైతం తలవంచాల్సి వచ్చింది. ఉవ్వెత్తున ముంచుకొచ్చే వరదలు ఓ వైపు నుంచీ కోటని దాటి మరోవైపు వెళ్లిపోయేందుకు.. కోట లోపల సమృద్ధిగా నీటి వనరులు నిల్వ ఉండేందుకు వారు కల్పించిన మార్గాలు ఇన్నీ అన్నీ కావు. పెట్రా కోటని ఒక్కరోజులో చూడాలంటే కుదిరే పనికాదు. ప్రతి అడుగునూ స్పృశించటం.. మనసు తెరల్లో చరిత్రని నిక్షిప్తం చేసుకోవటం.. ఆనాటి శిల్ప చాతుర్యానికి అచ్చెరువొందటం.. ఒక్కరోజులో ఎలా సాధ్యం. పెట్రా కోట అంతరంతరాల్లోకి వెళ్ళి తరచి చూడటం ఒక్కటే మార్గం.
ఈ ఎడారిలో సూర్యస్తమయ దర్శనం.. వర్ణించరాని అనుభూతి. కపిలవర్ణ ఇసుకతిన్నెల మాటున.. సన్నని సూర్యకాంతితో మెరిసే రాళ్ళతో ఇక్కడ సూర్యాస్తమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక మృత సముద్రం (డెడ్ సీ) గురించి చెప్పాలంటే.. ఈ సముద్రానికి ఎన్నో ప్రత్యేకతలు. సాధారణ సముద్ర జలాలకంటే.. ఈ మృత సముద్రంలోని నీరు పదిరెట్టు ఉప్పుగా ఉంటుంది. మీకు పూర్తిగా ఈదడం రాకపోయినా.. ఈ డెడ్ సీలో ఈదడం అత్యంత సులభం. సూర్యాస్తమయం సమయాన.. ఈ చల్లని సముద్ర జలాల్లో ఈదడం ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది.
ఇక్కడ ట్రైనింగ్, క్యాంపింగ్, నౌకాయానంతో పాటు పర్వతారోహణ సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇక్కడి ఒకరోజు ప్రయాణం తరువాత సురూఘాట్ చేరుకుని హిమాలయ పర్వతాలను చూడవచ్చు. కార్గిల్ నుంచి గోమా కార్గిల్ మధ్య రెండు కిలోమీటర్ల ప్రయాణంలో ఉత్కంఠభరితమైన దృశ్యాలు అబ్బురపరుస్తాయి. అంతేకాకుండా సరూ నదిపై ఉన్న పాత వంతెన మీదుగా ‘పోయెన్’ గ్రామాన్ని చేరుకోవచ్చు. దీని అవతలి వైపు వాఖా నది ఉంది. కార్గిల్ మార్కెట్లో పొగాకుతో పాటు హుక్కా కూడా దొరుకుతాయి. రోజువారీ వస్తువులతోపాటు పర్వతారోహణకు అవసరమైన వస్తువులను కూడా ఇక్కడ అమ్ముతారు. యాత్రికుల అవసరాలకు అనువైన వస్తువులన్నీ లభ్యమవుతాయి. ఈ మార్కెట్లో వస్తువుల కొనుగోలుకి మధ్యాహ్న వేళలో వెళితే సికిందర్ సైన్యంలో భాగమైన మినారోజ్ ప్రజాతివారిని కూడా చూడవచ్చు.





