విహారాలు

India

Gamyam

Thursday, April 28, 2011

గిరిజన సౌరభం.... ప్రకృతి సోయగం నాగాలాండ్‌

nagaland-kohima-warcemetry 
ఆకాశాన్నంటే.. పర్వతాలు.. పాతాళాన్ని తలపించే లోయలు.. పచ్చదనంతో కళకళలాడే.. పచ్చికబయళ్ళతో పర్యాటకులను అలరించే ప్రకృతి సోయగాలకు ఆలవాలం నాగాలాండ్‌.. దేశంలో అత్యధికంగా గిరిజన జాతులు ఉన్న నాగాలాండ్‌ పర్వతప్రాంతాల్లో.. ప్రకృతి మనోహరంగా శోభిల్లుతోంది.

భారతదేశంలో ఆంగ్లభాష అధికారభాషగా ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం నాగాలాండ్‌. బర్మా - టిబెట్‌ దేశాలకు చెందిన సుమారు 16 జాతులకు చెందిన గిరిజన జాతులకు ఈ రాష్ట్రం ఆలవాలం. చిత్ర విచిత్ర వేషధారణలతో.. తమదైన వింత ఆచారాలతో పర్యాటకులను వీరు అబ్బురపరుస్తుంటారు. చేతులకు కంకణాలు, ఛాతీకి కవచాలు, చేతిలో రంగురంగుల ఆయుధాలు పట్టుకుని తిరుగాడే గిరిజనులు నాగాలాండ్‌లో కోకొల్లలు. జాతీయ రహదారిపై దిమాపూర్‌ నుంచి మూడు గంటలు ప్రయాణిస్తే నాగాలాండ్‌ రాజధాని కోహిమా చేరుకోవచ్చు. సముద్రమట్టానికి 1,495 మీటర్ల ఎత్తులో ఉండే ఈ కోహిమాకు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్‌ సేనలు కోహిమాను ఆక్రమించి, బసచేశాయి. ఆ సమయంలో ప్రాణాలు పోగొట్టుకున్న అమరవీరులకు గుర్తుగా నిర్మించిన స్మారక కేంద్రం పర్యాటకుల కంటతడి పెట్టిస్తుంది.

చూడాల్సినవివే...
Kachari-Kingdom నాగాల జీవన పద్ధతులను, చరిత్రనూ కళ్ళకు కట్టినట్టు చూపే స్టేట్‌ మ్యూజియం టూరిస్టులు చూడాల్సిన ప్రదేశాలలో మొదటిది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న విగ్రహాలు, స్థూపాలు, నగలు, తోరణాలను ఇక్కడ పొందుపరిచారు. ఒకప్పుడు పండుగలప్పుడు వాడిన అతిపెద్ద డ్రమ్‌ (డప్పువాయిద్యం) ను ప్రత్యేకంగా ఒక షెడ్డులో భద్రపరిచారు. ఈశాన్య రాష్ట్రాలలో కనిపించే అరుదైన పక్షులు.. ప్రత్యేకంగా నిర్మించిన ఒక హాలులో సర్వాంగ సుందరంగా కనువిందు చేస్తాయి. కోహిమా సమీపాన అరదుర కొండపై ఉన్న కేథలిక్‌ చర్చికి ఓ ప్రత్యేకత ఉంది. దేశంలోనే అతిపెద్ద శిలువ ఈ చర్చిలోనే ఉండడం విశేషం. చెక్కతో మలచిన అపురూపమైన శిలువ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. శిలువే కాదు.. ఈ చర్చి కూడా చాలా పెద్దదే.

వాణిజ్య రాజధాని దిమాపూర్‌...
నాగాలాండ్‌కు రాజధాని కోహిమానే అయినా.. దాదాపు అంతటి ప్రాధాన్యం ఉన్న మరో నగరం దిమాపూర్‌. నాగాలాండ్‌ వాణిజ్య రాజధానిగా పేరొందిన దిమాపూర్‌.. చుట్టుపక్కల ఉన్న మణిపూర్‌, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాలకు కూడా చాలా దగ్గర. రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క విమానాశ్రయం దిమాపూర్‌లో ఉండటం మరో విశేషం. గతించిన కచారి రాజుల కాలం నాటి కట్టడాలు దిమాపూర్‌లో అక్కడక్కడా కనిపిస్తాయి. దిమాపూర్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రుజాఫెమా మరో చక్కటి సందర్శనా క్షేత్రం. గిరిజనులు తయారుచేసే చిత్రవిచిత్రమైన వస్తువులు ఇక్కడ అనేకం లభిస్తాయి.

ప్రకృతి అందానికి మరోరూపం.. ఖొనోమా..
khonoma కోహిమాకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖొనోమా అనే చిన్న గ్రామం ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. ఆహ్లాదకరమైన గ్రామ పరిసరాలు విహారానికి ఎంతో అనువైన ప్రదేశాలు. పచ్చటి వరి పొలాలతో ప్రకృతి మాత నడయాడే ఖొనోమాకు టూరిస్టుల తాకిడి ఎక్కువ. ఇక్కడ సుమారు ఇరవై రకాల వరి పంట పండిస్తారంటే నమ్మశక్యం కాదు. సముద్ర మట్టానికి 2,438 మీటర్ల ఎత్తున ఉండే జుకోవాలీ ట్రెక్కింగ్‌కు అనువైన ప్రదేశం. ఇది కోహిమాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. వెదురుపొదలతోనూ, తెలుపు, పసుపు పచ్చ రంగుల లిల్లీ పువ్వులతోనూ లోయ అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది.

షాపింగ్‌ అనుభూతి...
కోహిమా నగరం నడిబొడ్డున, బస్‌స్టేషన్‌ ఎదురుగా ఉన్న సేల్స్‌ ఎంపోరియం నాగా చేతివృత్తుల ఉత్పత్తులకు ప్రసిద్ది. రంగురంగుల శాలువాలు, చేతిసంచీలు, చెక్కతో మలచిన బొమ్మలు, వెదురుబుట్టలు ఇక్కడ లభ్యమవుతాయి.

ఇలా వెళ్లాలి...
విమానమార్గం: నాగాలాండ్‌లో ఉన్న ఒకే ఒక్క విమానాశ్రయం దిమాపూర్‌. కోల్‌కతా, గౌహతి నుంచి ఇక్కడికి విమాన సౌకర్యం ఉన్నది.

రైలుమార్గం: దిమాపూర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ఉత్తరభారతంలోని పెద్ద పట్టణాలకు రైలు సౌకర్యం ఉన్నది.
రోడ్డు మార్గం: దిమాపూర్‌ నుంచి కోహిమాకు టాక్సీలున్నాయి. గౌహతి, షిల్లాంగ్‌, కోహిమా నుంచి బస్సు సౌకర్యం ఉన్నది.


కర్టసీ : సూర్య Daily

No comments:

Post a Comment