విహారాలు

India

Gamyam

Thursday, January 20, 2011

ముక్తితోపాటు విహారానందం ... గోకర్ణ

బీచ్‌ల పేరు చెప్పగానే... మొదటగా మన స్మృతిపథంలో మెదిలే పదం ‘గోవా’. అయితే గోవాకు అతి సమీపంలో... గోవా బీచ్‌లకు ఏమాత్రం తీసిపోని సముద్రతీర అందాలకు నెలవైన ప్రాంతం గోకర్ణ. ఈ ప్రదేశం బీచ్‌ల అందాలకే కాదు, ముక్తిని ప్రసాదించే ఆధ్యాత్మిక క్షేత్రం కూడా.గోవా క్రైస్తవ సంస్కృతికి నిలయమైతే... గోకర్ణ హిందూ సంస్కృతికి నిలయంగా భాసిల్లుతోంది.ఇక్కడ ఉన్న శైవక్షేత్రం, భక్తులకు ముక్తిమార్గాన్ని ప్రసాదించే పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది.

Gokarna2 

గోకర్ణ కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్నది.బెంగళూరు కి 545 కిమీల దూరంలో... ఉత్తర కన్నడ జిల్లా రాజధాని కార్వార్‌ కి 55 కిమీదూరంలో ఉన్నది. గోకర్ణ శైవ క్షేత్రంగా చాలా ప్రసిద్ధి చెందినది.ఈ ప్రదేశం... అందమైన గోవా బీచ్‌లకు అతి సమీపంలో ఉండడంతో దేశీయంగానే కాక, అంతర్జాతీయ పర్యాటకులను సహితం ఆకర్షిస్తోంది.

మహాబళేశ్వర దేవాలయం... చరిత్ర...
లంకాధిపతి రావణాసురుడు శివుని గురించి అకుంఠిత తపస్సు చేసి మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తెస్తాడు. కాని శివుడిచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం భూమిమీద ఎక్కడ పెడితే అక్కడ స్థాపితం అయి, అక్కడ నుండి తిరిగి ఎత్తడానికి శక్యం కాదని శివుడు చెబుతాడు. రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి దేవతలు విష్ణువును వేడుకోగా విష్ణువు తన మాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు. అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయిందని భావించి సంధ్య వార్చుకోవడానికి సంసిద్ధుడవుతాడు.

ఈ విషయం తెలుసుకున్న నారదుడు వినాయకుని వద్దకు వెళ్ళి రావణాసురుడి వద్ద నుండి ఆత్మలింగం తీసుకొని భూమి మీద పెట్టాలని చెబుతాడు. అప్పుడు వినాయకుడు నారదుడు కోరినట్లు రావణాసురుడు సంధ్యవార్చుకొనే సమయానికి బ్రాహ్మణ వేషంలో వెళతాడు. ఆ బ్రాహ్మణ బాలకుడిని చూసిన వెంటనే రావణాసురుడు తాను సంధ్యవార్చుకొనే కారణం చేత ఆ బాలడిని ఆత్మలింగాన్ని పట్టుకోవల్సిందిగా కోరుతాడు. అప్పుడు వినాయకుడు లింగం చాలా బరువు ఉంటే తాను ఎక్కువ సేపు మోయలేనని, సమయం వచ్చినప్పుడు మూడుసార్లు పిలుస్తానని రావణాసురుడు రాకపోతే ఆలింగాన్ని భూమి పైన పెడతానని చెబుతాడు.

Gokarna1 

రావణాసురుడు అందుకు అంగీకరించగా, వినాయకుడు ఆత్మ లింగాన్ని తన చేతులలోకి తీసుకొంటాడు.రావణాసురుడు సంధ్యవార్చుకోవడానికి వెళ్ళగానే గణపతి లింగాన్ని మోయలేకపోతున్నట్లు మూడుసార్లు పిలుస్తాడు. సంధ్య మధ్యలో ఉండడంతో రావణాసురుడు అక్కడకు వచ్చేటప్పటికే వినాయకుడు లింగాన్ని భూమి మీద పెడతాడు. రావణాసురుడు వచ్చి లింగాన్ని భూమి మీద పెట్టినందుకు గణపటి నెత్తిమీద మొట్టుతాడు, దాంతో గణపతి నెత్తికి గుంట పడుతుంది.వినాయకుడు ఆత్మలింగాన్ని భూమి మీద నిలిపిన స్థలమే గోకర్ణ, మురుడేశ్వర లింగం పడిన భాగాలలో ఒక ప్రదేశం.

విష్ణువు తన మాయని తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో మళ్ళి కనిపిస్తాడు. ఈ విషయాన్ని గ్రహించి రావణుడు ఎంతో కోపోద్రిక్తుడై ఆత్మలింగాన్ని తన చేతులతో పెకలించడానికి ప్రయత్నిస్తాడు.ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరివేస్తే గోకర్ణ కు 23 కిమీల. దూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడుతుంది. లింగంపైనున్న మూత తొలగించి విసిరి వేస్తే అది గోకర్ణకు 27 కిమీల దూరంలో ఉన్న గుణేశ్వరలో పడుతుంది. లింగం పైనున్న వస్త్రాన్ని విసిరివేస్తే అది కందుక పర్వతంపై నున్న మృదేశ్వరలో పడుతుంది. ఆపేరు కాలక్రమంలో మురుడేశ్వరగా మారింది.

గణపతి దేవాలయం...
Gokarna3 

మహాబలేశ్వరుడి ఆలయానికి పక్కనే గణపతి ఆలయం ఉంటుంది. రావణాసురుడు తల మొట్టాడు అనడానికి గుర్తుగా గణపతి మాడు మీద ఒక గుంట ఉంటుది.గణపతి ని అందరు సృశించవచ్చు, గణపతి అభిషేకం చేయవచ్చు.

భద్రకాళి దేవాలయం...
మహాబలేశ్వరుడి దేవాలయానికి దగ్గరలొనే భద్రకాళి దేవాలయం ఉన్నది. ఇక్కడ వెలసిన భద్రకాళి ని అన్నపూర్ణమ్మ తల్లితో సమానంగా భావిస్తారు. ఆవిడ చేతిలో తక్కెడ సరిసమానంగా ఉండకుండా ఒక వైపు ఒరిగి ఉంటుంది, దానికి కారణంగా కాశిలో గంగ మాత్రమే ఉన్నది, కాని గోకర్ణలో కోటి తీర్థం, సముద్రం (ఇక్కడి అరేబియా సముద్రం పుణ్య తీర్థంగా భావిస్తారు) కూడా ఉన్నాయని ప్రాంతీయులు చెబుతారు.

కోటి తీర్థం...
గ్రామంలోని కోనేరు కోటీ తీర్థాన్ని గంగతో సమానంగా ప్రాంతీయులు భావిస్తారు. ఇక్కడ పితృతర్పణాలు సమర్పిస్తారు.

ఇలా వెళ్ళాలి...
Gokarna_Beach 

గోకర్ణ గ్రామానికి 10 కిమీ దూరంలో మంగళూరు-ముంబాయి కొంకణ్‌ రైల్వే లైనులో గోకర్ణ రోడ్‌ రైల్వే స్టేషన్‌ ఉన్నది. కాని ఈ గోకర్ణ రైల్వే స్టేషన్‌ లో ప్యాసింజర్‌ రైళ్లు మాత్రమే నిలుస్తాయి. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు గోకర్ణ కు 23 కిమీల దూరంలో ఉన్న కుంటా, 25 కిమీల దూరంలో ఉన్న అంకోలా, ఉత్తర కన్నడ రాజధాని కార్వార్లో నిలుస్తాయి.

కార్వార్‌ నుండి ప్రొద్దున 7, 8 గంటలకు, మధ్యాహ్నం 4 గంటలకు గోకర్ణ కు సరాసరి బస్సులు నడుస్తాయి. మిగతా సమయంలో కార్వార్‌ నుండి ఆంకోలా వరకు బస్సులు నడుస్తాయి. హొబ్లీ, హంపి నుండి కూడా గోకర్ణ కు తరచు బస్సులు ఉన్నాయి. గోవా నుండి పొద్దున 8 గంటలకు సరాసరి గోకర్ణక్ఠు చేర్చే బస్సు ఉన్నది (5 గంటల ప్రయాణం). మంగళూరు (252 కిమీల దూరంలో ఉన్నది) నుండి ఉదయం 7 గంటలకు బస్సు ఉన్నది. బెంగళూరు నుండి పగలు 9 గంటలకు, మైసూర్‌ నుండి పగలు 6 గంటలకు గోకర్ణ కు సరాసరి బస్సులు నడుస్తాయి. విమానసౌకర్యం మంగళూరు లేదా పనాజిలో ఉంది.

No comments:

Post a Comment