విహారాలు

India

Gamyam

Monday, November 1, 2010

తడి ఆరని ఈశాన్య సౌందర్యం .. .. చిరపుంజీ

Cherrapunji1మేఘాలయా రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌కు 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిరపుంజీ ఓ అందమైన ప్రకృతి నిలయం. అంతర్జాతీయ భౌగోళిక గుర్తింపు పొందిన ప్రదేశం... సంవత్సరమంతా సగటున వర్షించే మేఘాలు ఇక్కడి కొండల చాటున పచ్చని తివాచీని పరుచున్నట్లుంటాయి. ఈ ప్రాంతం పర్యాటకులకు స్వర్గధామంగా... ఓ అందమైన అనుభూతిని కలిగిస్తుంది. దాదాపు ప్రతిరోజూ వర్షం కురిసే ఈ ప్రాంతంలో మేఘాలు ప్రసవానికి సిద్ధమైన నిండు చూలాలులా హఠాత్తుగా వర్షిస్తుంటాయి. సముద్రమట్టం నుంచి దాదాపు 1300 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రాంతంలోనే దేశంలో అత్యధికంగా వర్షం పడే ప్రాంతంగా పేరు సంపాధించిన మాసిన్రామ్‌ ఉండడం విశేషం. దాదాపు ఓ చిన్న పట్టణంగా విరాజిల్లుతున్న ఈ ప్రదేశం ప్రకృతి శోభను సొంతం చేసుకున్న కొత్త పెళ్లి కూతురిలా మనసుల్ని ఇట్టే కట్టి పడేస్తుంది. దట్టమైన మేఘాల అంచుల్ని మనం అక్కడ చేతులతోనే తాకవచ్చన్నట్లుంటాయి. ప్రకృతిని ఇంత దగ్గరగా చూడవచ్చా అనిపించేలా ఉంటుంది ఇక్కడి అందమైన వాతావరణం... కలుషిత, శబ్దకాలుష్య వాతావరణానికి దూరంగా ప్రకృతి రమణీయ దృశ్యాల అనుభూతులను మాటలతో వర్ణించలేము... ఒక్కసారైనా వెళ్లి అక్కడి సహజందాల సౌందర్యాన్ని వీక్షించిరావలసిందే...

Presbyterian-Churchచిరపుంజీ ని చిర్రాపుంజి అని కూడా పిలుస్తారు. ఇది మేఘాలయాలోని తూర్పు ఖాశీ హిల్స్‌ జిల్లాలోని ఒక ముఖ్య పట్టణం. భూమి మీద అతి తేమగా ఉండే ప్రదేశంగా ఇది ఖ్యాతిగాంచింది. అయితే ఇప్పుడు దీనికి సమీపంలో ఉండే మాసి న్రామ్‌ అత్యధిక వర్షపాతం ఉంటోంది. చిరపుంజీ అసలు పేరు సొరా, దీన్ని చురా అని బ్రిటిష్‌ వారు పిలిచేవారు. కాలక్రమేణా అది చిరపుంజీగా మారింది.

సంవత్సరమంతా... పర్యాటక శోభ: షిల్లాంగ్‌ నుంచి చిరపుంజీ ప్రాంతానికి పయనమైన వారికి చుట్టూ
నిలుచున్న పర్వతాలు అత్యంత మధురానుభూతిని కల్గిస్తాయి. ఘాట్‌ రోడ్‌లో సాగే ఈ ప్రయాణంలో చుట్టూ ఉన్న ఎతె్తైన పర్వతాలు చూస్తూ వాటినుంచి జాలువారే జలపాతాలను తన్మయత్వంతో తిలకించవచ్చు. చిరపుంజీ ప్రాంతం దాదాపుగా లైమ్‌ రాతి గుహలతో నిండి ఉంటుంది. ఇక్కడ ఉన్న విశేషాల్లో పురాతన ప్రెస్బిటేరియన్‌ చర్చి, రామకృష్ణ మిషన్‌ లాంటి వాటిని దర్శించవచ్చు. దగ్గర్లో ఉన్న మాసిన్రామ్‌ ప్రాంతంలో ఏర్పడిన సహజ శివలింగ రూపం పర్యాటకులను ఆకట్టుకుంటుంది.

ఈ శివలింగాన్ని స్థానికులు మావ్‌ జింబుయిన్‌గా వ్యవహరిస్తారు. చిరపుంజిని దర్శించాలనుకునే పర్యాటకులు షిల్లాంగ్‌ నుంచి పయనించాల్సి ఉంటుంది. షిల్లాంగ్‌ చుట్టు పక్కల ఉన్న ప్రదేశాల్లో కేవలం చిరపుంజి మాత్రమే పర్యాటక ప్రదేశం కాదు. షిల్లాంగ్‌ చుట్టు పక్కల అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. దాదాపు ప్రతిరోజు టూరిస్టులతో సందడిగా ఉండే షిల్లాంగ్‌లో మ్యాజియం ఆఫ్‌ ఎంటోమాలజీ అనే సీతాకోక చిలకల పార్క్‌ పర్యాటకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడ మేఘాలయలో కన్పించే అన్ని రకాల సీతాకోక చిలకలతో పాటు అంతరించిపోతున్న కొన్ని జాతుల సీతాకోక చిలకల్ని కూడా పరిరక్షిస్తుంటారు. దేశంలోనే ఓ ప్రముఖ హిల్‌ స్టేషన్‌గా ఉన్న షిల్లాంగ్‌ కేవలం పర్యాటకులకే కాక సినిమా షూటింగ్‌లకు కూడా అనువైన ప్రదేశం.

Cherrapunji3అధిక వర్షపాతం ఉన్నా... తాగునీటికి ఇబ్బందే: నిత్యం వర్షాలు పడ్డా కూడా, చిరపుంజీ తాగు నీటి సమస్యను ఎదుర్కొంటోంది. ఇక్కడ వారు తాగునీటి కోసం ఎన్నో మైళ్లు వెళ్లాల్సి ఉంటుంది. అడవులు భారీగా ఆక్రమణకు గురికావడంతో, విస్తారంగా పడే వర్షాల కారణంగా, మట్టిపైపొరలు కొట్టుకుపోయాయి. దాంతో ఈ అడవుల్లో నీటిపారుదలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. మేఘాలయా రాష్ట్ర ప్రభుత్వం చిరపుంజీకి సోహ్రా అన్న స్థానిక పేరును తిరిగి పెట్టడానికి నిశ్చయించుకుంది. చిరపుంజీలోని స్మశానవాటికలో డేవిడ్‌స్కాట్‌ (1802-31 వరకు ఈశాన్య భారతానికి సంబంధించిన బ్రిటిష్‌ అధికారి) కు సంబంధించిన స్మారక చిహ్నం ఒకటి ఉంది.

భూగోళ రహస్యం: బంగ్లాదేశ్‌ ముఖంగా ఉన్న ఖాసీ కొండల దక్షిణ కొనకు చిరపుంజీ ఉంది.
బంగాళాఖాతం నుంచి వీచే రుతుపవన గాలులు ఈ కొండశిఖరాలను తాకడం వల్ల చిరపుంజీలో భారీ వర్షాలు కురుస్తాయి. అందుకే ఇది చిత్తడి వాతావరణానికి పుట్టినిల్లుగా భాసిల్లుతోంది. చిరపుంజీలో ఈశాన్య, నైరుతీ రుతుపవనాల నుంచి వర్షాలు కురవడంతో, ఇక్కడ రెండూ కలిసి ఒకే ఒక రుతుపవన కాలంగా ఉంటాయి. ఇది ఖాసీ కొండల నుంచి వీచే గాలులకు వ్యతిరేక దిశలో ఉంటుంది. ఒరనోగ్రాఫిక్‌ భావన కారణంగా రుతుపవన గాలులు అధిక సంఖ్యలో తేమను నిక్షిప్తం చేస్తాయి. శీతాకాలంలో బ్రహ్మపుత్ర వ్యాలీ గుండా ప్రయాణించేఈశాన్య రుతుపవనాల వల్ల ఇక్కడ వానలు పడతాయి. ఒక సంవత్సర కాలంలో గరిష్ట వర్షపాతానికి సంబంధించి చిరపుంజీ పేరిట రెండు గిన్నిస్‌ రికార్డులున్నాయి. ఒక ఏడాది కాలంలో ఆగస్టు 1860 మరియు 1861జులై మధ్య, అదే విధంగా ఒక నెల వ్యవధిలో జులై 1861లో గరిష్ట వర్షపాతం నమోదు కావడంలో ఈ రెండు రికార్డులకు గిన్నిస్‌లో స్థానం దక్కింది.

Ramakrishna-Missionభారీ వర్షపాతానికి కారణం ఇదే: చిరపుంజి భారత వేసవి ఋతుపవనాలు... బంగాళాఖాతం నుండి వర్షాలను అందుకుంటుంది. రుతుపవన మేఘాలు బంగ్లాదేశ్‌లోని పర్వతసానుల గుండా ఎలాంటి అడ్డంకులు లేకుండా సుమారు నాలుగువందల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఆ తరువాత అవి ఖాసీ పర్వతాలను ఢీకొంటాయి. రెండు నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఇవి అనూహ్యంగా సముద్రమట్టానికి 1370మీటర్లు ఎత్తు పెరగడమే దీనికి కారణం. భౌగోళిక పరంగా లోతైన లోయలుండటంతో బాగా దిగువకు ప్రయాణించే మేఘాలు (150 నుంచి 300 మీటర్లు) చిరపుంజీ మొత్తం పరుచుకుంటాయి. ఆ గాలులు వర్షాల మేఘాలను ద్రోణివైపు లేదా నునుపైన తలాల వైపుకు నెడతాయి. మేఘాలు వేగంగా పైకి పోతుండటంతో పైన వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి.

అంటే పై భాగాలు చల్లబడతాయి. ఫలితంగా నీటిభాష్పాలు ద్రవీభవిస్తాయి. చిరపుంజీలో కురిసే వర్షాల్లో అధిక శాతం వర్షాలు, గాలి పెద్దమొత్తంలో నీటి భాష్పాలుగా మారడం వల్లనే సంభవిస్తాయి. ఇక అతి పెద్ద మొత్తం వర్షాలు పడటానికి కారణం, బహుళా అందరికీ తెలిసినదే. అదే ఈశాన్య రాష్ట్రాల్లో కురిసే ఒరోగ్రాఫిక్‌ వర్షాలు. చిరపుంజీలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు సంభవిస్తే మిగిలిన ప్రాంతాలు వర్షపాతంలో తీవ్ర వ్యత్యాసాలు చూపిస్తూ, పూర్తిగా పొడిగా ఉంటాయి. రుతుపవనాల కాలం క్రియాశీలకంగా ఉన్న రోజుల్లో వాతావరణంలో తేమ గరిష్ఠంగా ఉంటుంది. చిరపుంజీలో అత్యధిక శాతం వర్షం కురవడానికి, ఒరోగ్రాఫిక్‌ లక్షణాలే కారణమని చెప్పవచ్చు. దక్షిణం పక్క నుంచి వచ్చే మేఘాలు ఈ కొండల మీదగా ప్రయాణించినప్పుడు ఇవి లోయ మొత్తం విస్తరిస్తాయి. ఈ మేఘాలు చిరపుంజీ కొండలను నిట్టనిలువుగా ఢీకొట్టినప్పుడు దానికి దిగువన ప్రయాణించే మేఘాలు నునుపైన వక్రతలాల్లోకి నెట్టబడతాయి. ఖాసీ కొండల నుంచి గాలి నేరుగా వీస్తున్నప్పుడు భారీ వర్షాలు కురవడంలో ఆశ్చర్యం అనిపించదు.

రాత్రిపూటే... ఎక్కువ :  చిరపుంజీలో కురిసే రుతుపవన వర్షాల్లో అత్యధికం ఉదయం పూటే కురవడం విశేషం.

రెండు రకాల గాలులు ఒకేసారి రావడమే దీనికి కారణం. రుతుపవన కాలంలో బ్రహ్మపుత్ర లోయ నుంచి వీచే గాలులు సాధారణంగా తూర్పు నుంచి ఈశాన్యం వైపుకు వీస్తాయి. కానీ మేఘాలయా నుంచి వీచే గాలులు దక్షిణవైపు నుంచి గాలులు వీస్తాయి. ఈ రెండు రకాల గాలు ఖాసీ కొండల సమీపంలో దగ్గరకు వస్తాయి. ఈ కొండల్లో రాత్రివేళ చిక్కుకున్న గాలులు అవి వేడెక్కిన తరువాత ఉదయం వేళ, పైకి లేవడం ప్రారంభిస్తాయి. ఇది ఉదయం వేళ మాత్రమే వానలు కురవడానికి గల కారణాన్ని పాక్షికంగా వివరిస్తుందని చెప్పవచ్చు. ఒరోగ్రాఫ్‌ లక్షణాల కారణంగా వాతావరణంలోనా మార్పులు కూడా రుతుపవన కాలంలో జరిగే మార్పులో కీలక పాత్ర పోషిస్తాయి. సీజన్‌ మొత్తం ఇదే విధంగా కొనసాగుతుంది.

మాతృపాలన: చిరపుంజీలో నివసించే స్థానికులను ఖాసీలంటారు. వీరిలో మాతృవంశ పాలన ఉం
టుంది. పెళ్లి తరువాత భర్త జీవించడం కోసం భార్య వెంబడి ఆమె ఇంటికి వెళతాడు. పుట్టిన పిల్లలు తల్లిపేరును ఇంటిపేరుగా పెట్టుకుంటారు. చిరపుంజీ లివింగ్‌ బ్రిడ్జ్‌కు పెట్టింది పేరు. ఎన్నో వందల సంవత్సరాల నుంచి చిరపుంజీవాసులు చెట్ల వేళ్లనే బ్రిడ్జిలుగా మార్చే విధానాన్ని అభివృద్ధి చేశారు. వీటిని బ్రిడ్జిలుగా మలచడానికి పది, పదిహేను సంవత్సరాలు పడుతుంది. అయితే ఇవి వందల సంవత్సరాల పాటు ఉంటాయి. ఇప్పటికీ ఉపయోగిస్తున్న ఒక పురాతన బ్రిడ్జి వయస్సు 500 ఏళ్లు ఉంటుందని భావిస్తున్నారు.

రవాణా సౌకర్యాలు:  షిల్లాంగ్‌ చేరుకోవాలనుకునే వారికి సమీపంలోని గౌహతి ప్రధాన కేంద్రం. ఇక్కడే విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ ఉంది. గౌహతి చేరుకుని అక్కడినుంచి షిల్లాంగ్‌ వెళ్లాల్సి ఉంటుంది. గౌహతినుంచి షిల్లాంగ్‌ వెళ్లే వారికోసం మేఘాలయా ప్రభుత్వం హెలికాప్టర్‌ సౌకర్యాన్ని సైతం అందుబాటులో ఉంచింది. అలాగే మేఘాల యాలోని ఏ ప్రాంతానికి చేరుకున్నా అక్కడినుంచి రాజధాని ప్రదేశమైన షిల్లాంగ్‌కు బస్‌ సౌకర్యం ఉంది.

No comments:

Post a Comment