విహారాలు

India

Gamyam

Sunday, October 24, 2010

శాంతిని ప్రసాదించే 'శ్రీ నెల్లియప్పార్'

లయకారుడైన మహాశివునికి మన దేశంలోనే కాక పొరుగు దేశాలలో కూడా జ్యోతిర్లింగాలు, పంచభూత క్షేత్రాలు, పంచారామాలు, పంచ నాట్యసభల పేరిట ఎన్నో ఆలయాలున్నాయి. మనకు తెలిసిన కైలాసగిరి, వారణాసి, కేదార్‌నాథ్, పశుపతినాథ్, మథురై, రామేశ్వరం, అరుణాచలం, కంచి, శ్రీశైలం, శ్రీకాళహస్తి లాంటి కొన్ని క్షేత్రాలు విశేష ప్రాముఖ్యం, ప్రాచుర్యం సంపాదించుకున్నాయి. అన్నింటిలోనూ మహాదేవుడే స్వయంగా కొలువుతీరి, కొలిచిన వారిని కాపాడతాడన్న నమ్మకం శతాబ్దాలుగా భక్తులలో ఉంది. ఈ జాబితాలోనిదే తిరునల్వేలిలోని "శ్రీ నెల్లియప్పార్'' ఆలయం.

నేను, నా మిత్రులు ప్రసాదు, సుందర్‌లు గత ఆగస్టులో శబరి యాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో మాకు ఇష్టమైన 'కుర్తాళం' సందర్శించుకుని, అక్కడికి అరవై కిలోమీటర్ల దూరంలోని 'తిరునల్వేలి' చేరుకున్నాము.
తమిళనాడులోని తిరునల్వేలి చేరుకోవడానికి చెన్నయ్, కన్యాకుమారి, మధురైలనుండి నేరుగా రైలు, బస్సు సౌకర్యం ఉంది. వాయు మార్గంలో అయితే 'టూటికోరన్' గాని, మధురై గాని చేరుకుని, అక్కడ్నుంచి రోడ్డు మార్గంలో ఇక్కడికి చేరుకోవచ్చు. బస్టాండ్ సమీపంలోనే అందుబాటు ధరలలో లాడ్జీలు, రుచికరమైన భోజన ఫలహారాల వసతులు లభిస్తాయి.
తిరునల్వేలిలోని ప్రధాన ఆలయం 'శ్రీకాంతిమతి అమ్మన్, శ్రీ నెల్లియప్పార్ దేవాలయం' బస్టాండు నుండి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

భూలోక సంచార సమయంలో ప్రకృతి రమణీయతకు ఆకర్షితుడైన శివుడు ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని, త్రేతాయుగంలో శ్రీరాముడు, అగస్త్య మహామునిని ఈ ప్రాంతంలోనే కొలిచారని పురాణ కథనం.
పాండ్యరాజులు ఏడో శతాబ్దంలో ఆరంభించిన ఈ ఆలయ నిర్మాణం దశలవారీగా పదిహేడో శతాబ్దానికి పూర్తయి ప్రస్తుత రూపం సంతరించుకున్నదట. ఏడో శతాబ్దానికి చెందిన గాయక శివభక్తులైౖన 'నయమ్మార్'లలో ఒకరైన శ్రీతిరుజ్ఞాన సంబందార్ ఈ స్వామి మీద ఎన్నో 'తేవరాలు' (కీర్తనలు) గానం చేశారట.

ఆ పేరెలా వచ్చిందంటే...

క్షేత్రానికి తిరునల్వేలి అనే పేరు రావడానికి ఒక పురాణగాథ ప్రచారంలో ఉంది. మొదట్లో శ్రీరాముడు ఇక్కడి స్వామిని నిత్యం కొలిచేవారట. కాలక్రమంలో ఆలయం శిథిలమయ్యి చుట్టూ వెదురు పొదలు పెరగడం వలన వేణుపురము (వేణు=వెదురు) అని పిలిచేవారని, పరమేశ్వరుని ఆజ్ఞ మేరకు వింధ్య దాటి దక్షిణాపథానికి వచ్చిన అగస్త్య మహాముని, పొదల మధ్య ఉన్న లింగాన్ని వెలికి తీసి పూజించారని అంటారు.
తదనంతర కాలంలో శివభక్తుడైన వేదశర్మ అనే పేద బ్రాహ్మణుడు, ప్రతి నిత్యం బిక్షమెత్తి సేకరించిన ధాన్యాన్ని వండి శ్రీ నెల్లియప్పార్‌కు నివేదన చేసి తాను ప్రసాదంగా స్వీకరించేవాడట.
ఒకరోజు అలాగే ధాన్యాన్ని సేకరించి అరబెడుతుండగా, అకస్మాత్తుగా 'తమిర పారాణి' నదికి వరద వచ్చిందట. భక్తుని ధాన్యం కొట్టుకుపోకుండా కైలాసపతి చుట్టూ కంచె ఏర్పాటు చేశారట! విషయం తెలిసిన రాజు వచ్చి చూసి, వేదశర్మ శివభక్తిని ప్రశంసించి జరిగిన సంఘటనకు గుర్తుగా ఆ ప్రాంతాన్ని 'తిరునెల్ వెలి' (తిరు-శ్రీ, నెల్-ధాన్యం, వెలి-కంచె)గా పిలవాలని అధికారికంగా ప్రకటించారట. ఆ పేరే క్రమేణా వాడుకలో 'తిరునల్వేలి'గా మారింది.

ఉన్నతినిచ్చే శ్రీకాంతిమతి అమ్మాళ్

స్వయంభూ శ్రీ నెల్లియప్పార్, శ్రీ కాంతిమతీ అమ్మాళ్ విడివిడిగా రెండు ఆలయాలలో కొలువై ఉంటారిక్కడ. రెండు ఆలయాలను కలిపే దారిని 'సంగలి మండపం' అంటారు. ముందుగా ప్రాంగణానికి దక్షిణం వైపు ఉన్న అమ్మవారిని దర్శించుకుని తర్వాత స్వామిని సేవించుకుంటే భక్తుల కోర్కెలు నెరవేరతాయని స్థానికుల నమ్మకం. ఈ కారణంగానేమో రెండు ఆలయాలకు వేర్వేరు రాజద్వారాలుంటాయి. శ్రీ కాంతిమతీ అమ్మాళ్ భక్తుల జీవితాల్లో ఉన్నత స్థాయినీ, శ్రీ నెల్లియప్పార్ ప్రశాంతతనూ ప్రసాదిస్తారని చెబుతారు.

ఆలయ విశేషాలు

సుమారు పద్నాలుగు ఎకరాల వైశాల్యం విస్తరించిన ఈ ప్రాంగణంలో ఐదు గోపురాలు, బం గారు కోనేరు, ఎన్నో ఉప ఆలయాలు ఉంటాయి. ప్రతి నిత్యం భక్తులు చేసే శివనామస్మరణ మరింత సందడిని సంతరించుకుంటుంది. ఈ ఆలయ ప్రధాన విశేషం 'శిల్పకళ'. ప్రతి రాతి మీద అపురూప చెక్కబడిన శిల్పాలు మనకు కన్నుల పండుగ చేస్తాయి. మహామండపం, అర్థమండపం, తొంభై ఆరు స్తంభాల ఊంజల్ మండపం, సంగిలి మండపం ... వీటన్నిటిపైనా అద్భుత శిల్ప సంపదని మనం చూడొచ్చు. పెద్ద నందీశ్వరుడు రాతి పీఠం మీద గంభీరంగా కూర్చుని మూలవిరాట్టుకు ఎదురుగా ఉంటాడు. నందీశ్వరునికి ఎదురుగా ఏక రాతి మీద చెక్కిన అర్జున, కర్ణల విగ్రహా సౌందర్యం అద్వితీయం. వీటికి అలంకరణగా రాతితో చెక్కిన నగల సోయగం చూడాల్సిందే! సంగిలి మండపం ఆరంభంలో ఉన్న శ్రీ దక్షిణామూర్తి ఆలయానికి అలంకరణార్థం రాతి మీద చెక్కిన పూలు, లతలు అమోఘం!

ఆనవాయితీ ప్రకారం ముందుగా అమ్మవారిని దర్శించుకుని, అక్కడే ఉన్న వెయ్యి స్తంభాల మండపంలోని శిల్పాలను చూసి ఆనందించాం. ఈ సుందర మండపంలోనే అప్పాశి నెల (అక్టోబరు-నవంబరు)లో స్వామి వారి తిరుకళ్యాణం జరుగుతుందట! మరో మనోహరమైన మండపంలో చిత్తిరై నెల (ఏప్రిల్-మే)లో వసంతోత్సవం జరుగుతుందట!

తామ్రసభ
తమిళనాడులో నటరాజ పంచ నాట్యసభలు ఉన్నాయి. తిరువలంగాడు (అరక్కోణం దగ్గర)లో రత్నసభ, చిదంబరంలో కనకసభ మధురైలో వెండిసభ, కుర్తాళంలో చిత్రసభ అయితే తిరునల్వేలీ ఉన్నది తామ్రసభ. కాకపోతే ఇక్కడ లోహంతోగాని రాతితోగాని చేసిన శిల్పాలు ఉండవు. మిగతా వాటికి భిన్నంగా చెక్కతో చక్కని బొమ్మలు చెక్కారు. శివపురాణ దృశ్యాల మొదలు శృంగార శిల్పాల వరకూ అన్ని రకాలు ఉన్నాయి. తామ్రసభలో నటరాజు, శివకామిని దర్శించుకుని వెనుక చందన పూతతో అలంకరించబడిన 'చందన సభాపతి'ని దగ్గరలోని 'పెరియ సభాపతి'ని దర్శించుకున్నాము.

తామ్రసభలో మార్గశిరమాసం(డిసెంబరు-జనవరి)లో నటరాజ "ఆరుద్ర దర్శనం'' జరుగుతుందట. 'ఆని' నెల (జూన్-జూలై)లో జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరయ్యేంత మంది భక్తులు ఈ ఆర్రుద దర్శనానికి కూడా వస్తారట! ప్రదక్షిణా క్రమంలో ప్రధాన ఆలయానికి పడమరన, మయూర వాహనం మీద దేవేరులు వల్లి, దేవసేనలతో కలిసి కొలువైన సుబ్రమణ్య స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని కన్నుల పండుగగా చూసి గర్భాలయం వైపు కదిలాం.

సంగీతాన్ని పలికే స్తంభాలు

గర్భాలయం సుమారు పది అడుగుల ఎత్తులో ఉంటుంది. పైకి సోపాన మార్గం ఉంది. మెట్లెక్కగానే వచ్చేది 'రత్న మండ పం'. ఇక్కడే ఉన్నాయి నాటి శిల్పుల అద్వితీయ ప్రతిభకు నిదర్శనమైన 'సంగీత స్తంభాలు'. ఏకరాతి మీద ఇరవై నాలుగు స్తంభాలను ఒక గుత్తిగా చెక్కారు. వీటి గురించి అడిగినప్పుడు గైడు మమ్మల్ని మూడో స్తంభంలోని ఒక దానికి చెవి ఆనించమని, తాను మొదటి స్తంభాలను ఒక దాని తర్వాత ఒకటి తట్టాడు. మధురమైన సప్తస్వరాల ధ్వని మాకు వినిపించింది. ఇంకో స్తంభంలో మృదంగ ధ్వని, మరో దాని నుండి మద్దెల వాయిద్యం వినిపించాడు.
కరకురాళ్ళను కర్ణపేయమైన సంగీతాన్ని పలికేలా చెక్కిన నాటి శిల్పుల గొప్పదనం ఎంతైనా ప్రశంసించదగినది. చిన్నపిల్లల్లా కాసేపు స్తంభాలను తట్టి సంగీతధ్వనులు వింటూ ఆనందించాం.
అనంతరం గర్భాలయంలోని శ్రీ నెల్లియప్పార్‌కు పూజలు జరిపించి తర్వాత విఘ్ననాయకుని, అనంతశయనుడైన 'నెల్లి గోవిందుని' దర్శించుకున్నాం.
 
ఆపద్బాంధవుని పేరు అనవతర ఖాన్

కొలిచేవారు ఎవరైనా శ్రీ నెల్లియప్పార్ కాపాడుతారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం- గైడు మాకు ఆలయ ఆగ్నేయ మూల చూపించిన 'అనవతర ఖాన్ లింగం'లో కనిపించింది. దీని తాలూకు పూర్వాపరాలు ఇలా తెలియజెప్పారు.
గతంలో ఈ ప్రాంతాన్ని పాలించిన నవాబుకు సంతానం లేదు. భార్య కూడా నిరంతరం కడుపునొప్పితో బాధపడుతూ ఉండేదట. ఎన్నో రకాల వైద్యాలు చేయించినా ఫలితం లేకపోవడంతో ఆయన వేద పండితులను సంప్రదించగా, వారు నియమంగా 'శ్రీ నెల్లియప్పార్'ను సేవించమని తెలిపారట. ఆ ప్రకారం చేయడంతో అనతికాలంలోనే రాణి ఆరోగ్యం బాగుపడడంతో పాటు, ఆమె చక్కని మగశిశువుకు జన్మనిచ్చింది. సంతసించిన నవాబు దంపతులు కుమారునికి 'అనవతర ఖాన్' అని నామకరణం చేసి, కృతజ్ఞతా పూర్వకంగా లింగాన్ని ప్రతిష్ఠించారట. ఆ బాలుని పేరు మీద 'అనవతర ఖాన్ లింగం' అన్న పేరొచ్చిందట.

జీవంలేని రాళ్లను రమణీయ శిల్పాలుగా మలచిన శిల్పులకు, వారిని ఆ పనికి నియమించి చరిత్రలో శాశ్వత కీర్తి పొందిన రాజులకు, దేవదేవుడు శ్రీ నెల్లియప్పార్‌కు మరోసారి మనస్ఫూర్తిగా మొక్కి, ఎన్నో విషయాలు తెలిపిన గైడుకు కృతజ్ఞతలు తెలిపి మా తదుపరి మజిలీ అయిన 'తిరుచందూర్'కు బయలుదేరాము.

- ఇలపావులూరి వెంకటేశ్వర్లు
96666 37614

No comments:

Post a Comment