విహారాలు

India

Gamyam

Sunday, October 3, 2010

పాలరాతి కొండల మధ్య పడవ ప్రయాణం

జబల్పూరుకు దగ్గర్లో ఉన్న బేడాఘాట్‌లో ఎత్తైన పాలరాతి శ్రేణుల మధ్య ప్రవహించే నర్మదానదిలో నౌకా విహారం ఒక అద్భుతం. పండువెన్నెల్లో అయితే అది పరమాద్భుతం. ఆ మధురానుభూతిని అనుభవించాలనే ఉద్దేశ్యంతో మధ్యప్రదేశ్‌లోని భోపాల్, సాంచీ, వైశాలీ వగైరా ప్రదేశాలను సందర్శిస్తూ అక్కడికి చేరుకున్నాం. దారిలో మాకు తారసిల్లినప్రదేశాలు, దేవాలయాలు, జలపాతాలు ...

మనదేశానికి దాదాపు మధ్యభాగంలో ఉండి చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యం సంతరించుకున్న పట్టణం జబల్పూరు. ఎన్నో భవ్య స్మారకాలు ఈ పట్టణ పరిసర ప్రాంతాల్లో మనకు కనువిందు చేస్తాయి. మహాభారతంలో కూడా ఉటంకించబడిన ఈ పట్టణం తర్వాత మౌర్య, గుప్త, కల్చురి రాజుల పాలనలో ఎంతో ప్రాముఖ్యం సంతరించుకుంది. దాదాపు నాలుగు శతాబ్దాల పాటు పాలించిన యువరాజు దేవుడు, కర్ణదేవుడు, గంగ దేవుడు మొదలైన కల్చురి వంశపు రాజుల రాజధానిగా ఇది ప్రసిద్ధికెక్కింది. పద్దెనిమిదవ శతాబ్దంలో మరాఠాలు తమ రాజధానిని సాగర్‌నుండి జబల్పూరుకు మార్చారని, ఆ తర్వాత క్రీ.శ. 1817లో ఇది ఆంగ్లేయుల స్వాధీనమైందని చారిత్రక కథనం.

దుర్గావతి పేరు మిగిలిపోయింది

మేం జబల్పూరును చూడటానికి ఒక ఆటోరిక్షా మాట్లాడుకున్నాం. చిన్న ఊరు కాబట్టి ఒక్క పూటలోనే జబల్పూరులోని విశేషాలన్నీ చూడగలిగాం. ఇది సముద్ర మట్టానికి 393 మీటర్ల ఎత్తులో ఉండడం వల్ల వేసవిలో కూడా మరీ భరించలేనంత ఎండలు ఉండవు. మహారాణి లక్ష్మీబాయి కారణంగా ఝాన్సీ పేరు చిరస్థాయైనట్లు, మహారాణి దుర్గావతి శౌర్య పరాక్రమాల వల్ల జబల్పూరు చారిత్రక ప్రదేశమైంది. దుర్గావతి గోండు రాణిగానే కాక అక్బర్ చక్రవర్తిని ఎదిరించి పోరాడిన స్త్రీగా ప్రసిద్ధురాలు. ఆ సంగ్రామంలో ఆమె అసువులు బాసినట్లు చరిత్ర చెబుతోంది. జబల్పూరులోని భంపర్‌లాల్ ఉద్యానవనంలో ఏనుగుపై స్వారీ చేస్తున్న మహారాణి దుర్గావతి విగ్రహం ఉంది. 'రాణి దుర్గావతి మ్యూజియం'లో ఆ కాలంనాటి దుస్తులు, ఆయుధాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. వీటితో పాటు పెక్కు శిలా శాసనాలు కూడా మనకు ఈ మ్యూజియంలో దర్శనమిస్తాయి.

గోండుల మహల్‌కోట

ఆ తరువాత ఆటోవాలా మమ్మల్ని 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న మదన్ మహల్ కోటకు తీసుకెళ్లాడు. కొండపై కట్టిన ఈ దుర్గం ఒకప్పుడు గోండు రాజులదట. క్రీ.శ. 1116లో ఈ దుర్గాన్ని గోండు రాజు 'రాజా మదన్‌షా' నిర్మించాడట. దీనిపై నుండి నిలబడి చూస్తే జబల్పూరు పట్టణమంతా కనిపించింది.

బేడాఘాట్ నర్మద అందాలు

తర్వాత అక్కడ్నుంచి బేడాఘాట్‌కు చేరుకున్నాం. ప్రధానంగా మేము జబల్పూరుకు వచ్చింది కూడా బేడాఘాట్ చూడాలనే ఉద్దేశ్యంతోనే. అటూ ఇటూ పాలరాతి కొండల మధ్య ప్రవహించే నర్మదానది దృశ్యం ఎంతో నయనానందకరంగా ఉంటుంది. ఈ కొండల మధ్య నర్మద ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. దారిలోనే పంచవటీ ఘాట్ దగ్గర పావన్‌గంగ అనే నది పాయగా వచ్చి నర్మదలో కలుస్తుంది. ఆ కొండలకు కుడివైపున అనేక మందిరాలు కనిపించాయి. పాలరాతి శిలలలో 'భూల్ భు లయ్యా' అనే ప్రదేశం ఉంది. ఇక్కడ నర్మదానది బండరాళ్ల మధ్యన ఏ మార్గంలో ముందుకు దూకుతోందో తెలుసుకోవడం కష్టం. అక్కడ చూడతగ్గ వాటిల్లో శివలింగం, కాలభైరవుని ఆకారంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ నల్లని పాషాణం, ఏనుగు తల ఆకారంలో ఉండే శిల, దత్తాత్రేయ ముని గుహ, గణేశుని గుహ మొదలైనవి ఉన్నాయి.

వెన్నెల్లో నౌకా విహారం అద్భుతం

ఒకటిన్నర కిలోమీటర్ల దాకా ఇరువైపులా సుమారు 30 మీటర్ల ఎత్తుగల పాలరాతి శిలల మధ్య నర్మదలో నౌకావిహారం ఒక మరపురాని మధురానుభూతి. దాదాపు 45 నిమిషాలు పట్టింది ఆ ప్రయాణానికి. మార్గ మధ్యంలో నర్మదానది లోతు కనీసం 30 - 80 మీటర్ల మధ్య ఉంటుందని అక్కడి వారు చెప్పారు. వెన్నెల రాత్రుళ్లలో అయితే ఆ తెల్లని పాలరాళ్లు మరింతగా మెరుస్తూ కళ్లు మిరుమిట్లు గొలుపుతాయనిపించింది.

దీపావళి తరువాత బేడాఘాట్‌లో పెద్ద ఉత్సవం జరుగుతుందని, ఆ ఉత్సవానికి పరిసర ప్రాంతాలనుండి వేలాదిమంది ప్రజలు వస్తుంటారని చెప్పారు. పంచవటీ ఘాట్ సమీపంలోని పర్వతాలపై 64 మంది యోగినుల మందిరం ఉంది. ఇందులో 12వ శతాబ్దానికి చెందిన ఎన్నో విగ్రహాలు కనిపించాయి. ఇక్కడున్న ఒక శిలాఫలకంపైన ఈ మందిరాన్ని క్రీ. శ. 1156లో కల్చురి వంశపు రాజు నిర్మించినట్లు ఉంది. ఖజురహో దేవాలయంపై కనిపించే శృంగార శిల్పాల్లాంటివి ఈ మందిరంపై కూడా చూడవచ్చు.

హోరు ఒకటిన్నర కి.మీ. దూరం విన్పిస్తుంది

బేడాఘాట్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో జబల్పూరు నుండి శాహ్‌పూర్‌కు వెళ్లే మార్గంలో నర్మదానది జలపాతంగా మారి ఇరవైమీటర్ల పైనుండి దూకుతుంది. ఈ జలపాతపు హోరు దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. నర్మదానది వింధ్యాచలం, మేక్లే పర్వతాల పైనుండి అంటే దాదాపు 1070 మీటర్ల ఎత్తునుండి బయలుదేరి, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మీదుగా గుజరాత్‌లోని ఖంజాత్ అఖాతంలో సముద్రంలో కలుస్తుంది.

జబల్పూరుకు సుమారు 6 కిలోమీటర్ల దూరంలో నాగపూర్‌కు వెళ్లే మార్గంలో వందమీటర్ల ఎత్తున్న మఢియా అనే చిన్న పర్వతం ఉంది. దానిపైన 12 జైన మందిరాలు, 24 ఇతర చిన్న మందిరాలు ఉన్నాయి. పర్వతం చాలా అందంగా ఉంటుంది. పైకెక్కడానికి సుమారు 265 మెట్లున్నాయి. నర్మదానదీ తీరంలోనే తిల్‌వార్‌ఘాట్ అనే పిక్నిక్ స్పాట్ ఉంది. ఇక్కడ 1935లో నిర్వహించబడిన కాంగ్రెస్ మహాసభలకు గుర్తుగా గాంధీజీ స్మారకస్థూపం నిర్మించబడింది. తర్వాత పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేశారు. ఆ రాత్రికి జబల్పూరులోనే బసచేసి మర్నాడు పచ్‌మరీ వెళ్లాం.

పచ్‌మరీ అందచందాలు

పచ్‌మరీ మరో అద్భుతమైన ప్రదేశం. జబల్పూరుకు 225 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది. ఇక్కడి జలాశయాలు, జలపాతాలు మన మనసుల్ని మరోలోకంలోకి తీసుకెళ్తాయి.

అప్సరా విహార్: ఇక్కడ జలపాతం ప్రవాహంతో ఏర్పడిన జలాశయం ఉంది. పర్యాటకులు స్నానం చెయ్యటానికి, ఈత కొట్టడానికి చక్కని ఏర్పాట్లు ఉన్నాయి. ఇది పచ్‌మరీకి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది.

హాండీలోయ: పచ్‌మరీలో ఇదొక అద్భుతమైన దర్శనీయ ప్రదేశం. అటూ ఇటూ కొండల వరస, మధ్యలో వందలాది అడుగుల లోతుగల లోయ. తొంగి చూడటానికే మాకు గుండె దడదడలాడింది. బాగా దగ్గరకి వెళ్లకుండా ఇనుప కడ్డీలతో కంచెలా ఏర్పాటు చేశారు. పచ్‌మరీ పరిసర ప్రాంతాలలో ప్రకృతి దృశ్యాలను తిలకించడానికి 30 - 40 దాకా వ్యూ పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా జలపాతాలు చూడతగ్గవి. జలపాతాలలో చెస్‌ఫాల్, బిగ్‌ఫాల్, లిటిల్ ఫాల్ పేరొందినవి. ఇవి దాదాపు 100 - 125 మీటర్ల ఎత్తునుండి కిందకి దూకుతుంటాయి. మధ్యప్రదేశ్ మంత్రి మండలి సమావేశాలు (గ్రీష్మకాలంలో) ఇక్కడే నిర్వహించబతాయట. పచ్‌మరీని అక్టోబర్ - జూన్ మధ్య 9 నెలల కాలంలో దర్శిస్తే చాలా బాగుంటుంది. వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
నిజానికి పచ్‌మరీ ఒక్క రోజులో చూసే ప్రదేశం కాదు. తనివితీరా చూసి మన మనస్సులో గాఢంగా పదిలపరచుకోవాలంటే కనీసం వారం రోజులైనా మకాం వెయ్యాలి. లేదంటే 'తనవి తీరలేదే - నా మనసు నిండలేదే' అని పాడుకుంటూ బస్సెక్కాల్సిందే - మేమూ అదే చేశామనుకోండి!

- నల్లబెల్లి శ్రీమన్నారాయణ
98490 54936

No comments:

Post a Comment