విహారాలు

India

Gamyam

Sunday, August 22, 2010

ప్రాచీన కళావైభవానికి రామగిరి ఖిల్లా...!

ramagiri4
ఆ దుర్గం అద్భుత కళా సంపదకు నిలువెత్తు నిదర్శనం... నాటి శిల్పుల నైపుణానికి తార్కాణం... ఆహ్లాదపరిచే ప్రకృతి రమణీయ దృశ్యాలు ఓవైపు... ఉల్లాసాన్ని పంచే సెలయేటి గలగలలు, అబ్బురపరిచే కళాఖండాలు మరోవైపు... రాజుల ఏలుబడిలో శతాబ్దాల చరిత్ర కలిగిన రామగిరి ఖిల్లా... ప్రాచీన కళావైభవాన్ని చాటుతూ నేటికీ పర్యాటకులను అలరిస్తూ విరాజిల్లుతోంది... కాకతీయుల కాలం శిల్ప కళాపోషణకు పెట్టింది పేరుగా ఉండేది... వీరి పరిపాలనలోనే రామగిరి దుర్గం పై అపురూప కట్టడాలు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. లక్ష్మణుడు, ఆంజనేయుడితోపాటు సీతాసమేతుడైన శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో రామగిరి దుర్గంపై విడిది చేసినట్లు స్థానికులు కథలు కథలుగా చెబుగారు. దీంతో రామగిరి పర్యాటక కేంద్రంగానే కాక ఆధ్యాత్మిక కేంద్రాంగాను భాసిల్లుతోంది... 200 రకాలకు పైగా వనమూలికలను కలిగివున్న ఈ ఖిల్లాఆయుర్వేద వైద్యానికి మూలకేంద్రంగా పేరొందింది. చారిత్రాత్మక నేపథ్యంతో... ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొని... తెలంగాణ ప్రాంతంలో విశిష్టమైన పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన రామగిరిఖిల్లా విశేషాలు ‘విహారి’లో మీకోసం...

చారిత్రక నేపథ్యం...
ramagiri
క్రీశ 1వ శతాబ్దంలో రామగిరి కోటను నిర్మించారు. ఈ ప్రాంతాన్ని గౌతమీపుత్ర శాతకర్ణి, పులోమావి పాలించినట్లు పెద్దబొంకూర్‌, గుంజపడుగు గ్రామాల్లో పురావస్తుశాఖ తవ్వకాల్లో బయటపడిన ఆధారాలు తెలుపుతున్నాయి. చంద్రగుప్తుడు, బిందుసారుడు, అశోకుడు ఈ దుర్గాన్ని అభివృద్దిపరిచారని చరిత్ర చెబుతుంది. క్రీశ 1158 లో చాళుక్య గుండ రాజును ఓడించి కాకతీయులు రామగిరి దుర్గాన్ని స్వాధీనపరుచుకొన్నారు. రామగిరి ఖిల్లాను ప్రతాప రుద్రుడు 1195 వరకు పాలించినట్లు ఓరుగల్లు మంత్రకూటముల శాశనాలు తెలియపరుస్తు న్నాయి. అనంతరం 1442 లో బహమనీ సుల్తానులు ఆక్రమించుకోగా వారి నుంచి రెడ్డి రాజు లు స్వాధీనం చేసుకొన్నట్లు చరిత్రక ఆధారాలున్నాయి. అటుపిమ్మట 1595లో మొఘలాయిల స్వాధీనంలోకి వెల్లింది. 1606 లో గోల్కొండ నవాబుల ఈ దుర్గాన్ని తమ స్వాధీనంలోకి తీసు కున్నారు. వారి నుండి మహమ్మదీయులు వశపరుచుకొని నైజాం కాలం వరకు పాలించినట్లు చరిత్ర చెబుతుంది. అప్పట్లో రామగిరి కోటకు ఇరువైపులా తొమ్మిది ఫిరంగులు 40 తోపులు ఉండేవి. కాలక్రమంలో వాటి సంఖ్య కుదించుకుపోయింది. ప్రస్తుతం కేవలం ఒక్క ఫిరంగి మాత్రమే ఉంది.

సంగీత, నృత్యకళలకు ఆనవాలు...
ramagiri3
పౌరాణికంగాకూడా రామగిరి ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకుంది. శ్రీరామచంద్రుడు వన వాసం సమయంలో ఇక్కడికి వచ్చి తపస్సు చేసి ఇక్కడ శివలింగం ప్రతిష్టించి నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ కోటపైన సీతాసమేత శ్రీరాముడు, హనుమాన్‌ విగ్రహాల తో పాటు నంది విగ్రహం కూడా ఉంది. శ్రీరాముని విగ్రహం ఉన్నచోట సుమారు 1000 మంది తలదాచుకునేంత విశాల ప్రదేశం ఉండడం విశేషం. రాజులపాలనలో రామగిరి ఖిల్లా పరిసర ప్రాం తానికి రామగిరి పట్టణం అనే పేరు వచ్చింది. చుట్టుపక్కల గ్రామాలన్నీ వాడలుగా ఉండేవని అంటారు. రాజుల ఆస్థానం లో సంగీత నృత్యకళా కారులుండే ప్రాంతాన్ని బోగంవాడ అనేవారట. కాల క్రమేణ అది బోగంపేట మారింది.

శ్రావణం మాసంలో పర్యాటకులసందడి...
వర్షాకాలంలో పచ్చదనం పరుచుకోవడంతో... ప్రతి శ్రావణ మాసంలో రామగిరిఖిల్లాపై పర్యాటకుల సందడితో ఆహ్లదకర వాతావరణం ఉంటుంది. రామగిరి దుర్గంపై ప్రకృతి అందచందాలను తిలకిస్తూ పర్యాటకులు మైమరిచిపోతారు. ఆయుర్వేద వైద్యులు ఈ ఖిల్లాపై విలువైన వనమూలికలను సేకరిస్తారు. తెలంగాణ ప్రాంతంలో ప్రాచీన కళాసంపదకు నిలయమైన రామగిరిఖిల్లా ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సివుంది. పర్యాటకకేంద్రంగా తీర్చిదిద్దుతామని పాలకులు చెబుతున్న నేటికి ఆచరణ కు అమలు కాలేదు.

శిల్ప కళకు ఒడి..!
కాకతీయుల కాలంలో రామగిరిపై నిర్మించిన రామగిరి కోట శిల్పకళా సంప దతో శోభిల్లుతోంది. పర్యాటకులను ఆహ్ల దపరుస్తూ అలరిస్తోంది. కాకతీయుల శిల్ప సాంస్కృతిక సంపదకు తార్కాణంగా నిలు స్తూ... శ్రావణ మాసంలో వచ్చే భక్తులకు, సంద ర్శకులకు నిలయంగా మారింది. ఇక్కడి నిర్మింపజే సిన రాతి కట్టడాలు అప్పటి శిల్ప కళానైపుణ్యాన్ని చాటు తాయి. రాతిపై చెక్కిన సుందర దశ్యాలు పర్యాటకులను మంత్ర ముగ్దులను చేస్తుంది.

వనవాసంలో రామగిరిపై రామచంద్రుడు...
వనవాసం కాలంలో శ్రీరాముడు రామగిరిపై కొద్దిరోజులు కుటీరం ఏర్పారుచుకొని సీతా లక్ష్మణులతో ఉన్నారని పెద్దలు చెబు తారు. ఈ ఖిల్లాపై సీతారామలక్ష్మణులు సంచరించినట్లు చెప్పబడుతున్న కొన్ని ఆనవాళ్ళు ఇప్పటికీ చెక్కుచెదరకుండా పర్యాటకుల కు దర్శనమిస్తాయి. ఖిల్లాపైన గల బండరాతిపై శ్రీరాముని పాదాలు, సీతాదేవి స్నానమాచరించిన కొలనుతో పాటు శ్రీరామునితో సంచరిం చిన ఆంజనేయుడి విగ్రహం కూడా నెలకొల్పబడివుంది.

నాటి వాడలు... నేడు పల్లె సీమలు...
ramagiri1
రాజుల పరిపాలనాకాలంలో వాడలుగా పిలువబడిన రామగిరి దుర్గం చుట్టుపక్కల ప్రాంతాలు నేడు పల్లె సీమలుగా మారాయి. వాడల యొక్క విశిష్టతను బట్టి నేటికీ ఆ గ్రామాల పేర్లు అలాగే కొనసాగుతుండడం విశేషం. రత్నాలు విక్రయించే వీధిని రత్నాపూర్‌ గా మహ్మదీయుల కాలంలో బేగంలు నివాసం ఉండేప్రాంతం నేడు బేగంపేటగా పిలవబడుతోంది. అదే విధంగా పోత న పేరుతో ఉన్న వాడను పోతారంగా, ఆయన తల్లి లక్కమాంబ పేరుతో ఉన్న ప్రాంతాన్ని లక్కారం అని, నాగాళ్లు నిలిపేచోటును నాగెపల్లి అని, శుక్రవారం సంత జరిగేచోటును శుక్రవారంపేట అని ఆదివారం సంత జరిగే చోటు ఆది వారంపేట గా మైదపుపిండి విసురురాళ్ళు ఉండే చోటును మైదం బండగా, గుండ రాజు పేరున గుండారం అనే పేర్లు వాడుకలోకి వచ్చినట్లు స్థానికులు చెబుతారు.

దుర్గంలో చూడాల్సిన ప్రదేశాలు...
రామగిరి దుర్గం అంతర్బాగంలో సాలుకోట, సింహల కోట, జంగేకోట, ప్రతాప రుద్రుల కోట, అశ్వశాల కోట, కొలువుశాల, మొఘల్‌శాల, చెరశాల, గజశాల, భజనశాల, సభాస్థలి వంటి వాటితో పాటు చెక్కరబావి, సీతమ్మ బావి, పసరుబావి, సీతమ్మకొలను, రహస్య మార్గాలు, సొరంగాలు లాంటి అనేక ప్రదేశాలు పర్యాటకులను ఇట్టే మైమరిచిపోయేలా చేస్తాయి.

రామగిరి చరిత్ర వెలుగులోకి వచ్చిన విధం...
రామగిరి చరిత్రను వెలుగులోకి తీసుకరావడానికి పలువురు రచయితలు ఎంతో వ్యయ ప్రయాసలుకోర్చి రామగిరి చరిత్రను పుస్తకరూపంలో ప్రచురించారు. కాల్వశ్రీరాంపూర్‌ మండలం మంగపేటకు చెందిన యరబాటి బాబురావు, కమాన్‌పూర్‌ మండలానికి చెందిన మాధవరావు, బలరాందాస్‌లు ‘రామగిరి మహత్యం’ పేరుతో ఓ గ్రంథాన్ని రాశారు. వీరికంటే ముందు రామగిరి చరిత్రను వెలికితీసిన ఘనత ఆర్‌.బాల ప్రసాద్‌కే దక్కుతుందంటారు.

‘కళ’ తప్పుతోందా..?
ramagiri2
గత చరిత్ర వైభవానికి సజీవ సాక్ష్యమైన రామగిరి ఖిల్లా... ప్రభుత్వం, పురావస్తు శాఖల నిర్లక్ష్యం మూలంగా కళావిహీనమవుతోంది. ప్రాచీన సంస్కృతికి, కళా వైభవానికి అద్దంపట్టిన ఇక్కడి కట్టడాలు కాలగర్భంలో కలిసిపోయే ప్రమా దంవుంది. ఇప్పటికైనా ఈ కళాసంపద కనుమరుగు కాకుండా ఈ చారిత్రాత్మక కళా సంపదను పరిరక్షించాల్సిన అవసరం ప్రభు త్వం పై ఉంది. ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీ ఆధ్వ ర్యంలో అప్పటి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి విద్యా సాగర్‌రావు పాదయాత్ర చేపట్టి... రామగిరిఖిల్లాను పర్యా టక కేంద్రం గా తీర్చిదిద్దుతామని హమీ ఇచ్చారు. అయి నా ఆ హామీ హామీగానే మిగిలిపోయింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రామగిరిఖిల్లాను పర్యాటక కేంద్రం గా తీర్చిదిద్ది అరుదైన కళాసంపదను కాపాడాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

ఖిల్లాకు వెళ్లాలంటే...
కరీంనగర్‌ జిల్లాకేంద్రం నుంచి తూర్పు దిశగా... మంథని, కాళేశ్వరం వెళ్లే రహదారిలో 58 కిలోమీటర్ల దూరంలో వుంది రామగిరి దుర్గం. కమాన్‌పూర్‌ మం డలం లోని నాగెపల్లి (బేగంపేట అడ్డరోడ్డు) నుంచి బేగంపేట గ్రామం మీదుగా నడుచుకుంటూ వెళితే రామ గిరి ఖిల్లాకు చేరు కోవచ్చు. ఈ రామగిరి ఖిల్లా సాంతం చూడాలంటే కనీసం 16 కిలోమీటర్లు కొండపైన నడవాల్సి ఉంటుంది. రైలు మార్గం ద్వారా వచ్చే పర్యాటకులు కాజీపేట - బల్లార్షా మార్గం లోని పెద్దపల్లి రైల్వే స్టేషన్‌ లో దిగి బస్సుద్వారా మంథని మార్గం లో బేగంపేటకు చేరుకోవచ్చు.

కాకతీయుల కాలంలో రామగిరిపై నిర్మించిన రామగిరి కోట శిల్ప కళా సంపదతో శోభిల్లుతోంది. పర్యాటకులను ఆహ్లాదపరుస్తూ అలరిస్తోంది. కాకతీయుల శిల్ప సాంస్కృతిక సంపదకు తార్కాణంగా నిలుస్తూ... శ్రావణ మాసంలో వచ్చే భక్తులకు, సందర్శకులకు నిలయంగా మారింది. మిగతా సీజన్‌ల కంటే శ్రావణమాసంలోనే ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. దీనికి ఈ సీజన్‌లో దట్టంగా పరుచుకునే పచ్చదనం ఒక కారణమైతే... శ్రావణమాసంలో ఇక్కడ పూజలు చేయడానికి పురోహితులు కూడా అందుబాటులో ఉండడం మరో కారణం.
- బండ సాయిశంకర్‌,  కమాన్‌పూర్‌

No comments:

Post a Comment