విహారాలు

India

Gamyam

Friday, February 11, 2011

గ్రీన్ టూర్ లేడీస్ స్పెషల్

పదిమంది అతివలు... 21 నుంచి 52 వరకూ వివిధ వయసుల వారు, ఒక్కొక్కరిదీ ఒకో ప్రాంతం, వేర్వేరు భాషలు... అందర్నీ కలిపింది సాహసమే. 'గో గ్రీన్ గాళ్స్' అనే పేరుతో ఒక బృందంగా ఏర్పడ్డారు. పర్యావరణానికి మేలు చేయాలి, తమను చూసి మరో పదిమంది నేర్చుకోవాలి. తమకు సాహసమనే సరదా తీరాలి. ఇవన్నీ ఆలోచించి 35 రోజుల సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. కోల్‌కతాలో జనవరి 25న జెండా ఊపి బయల్దేరారు.

ఫిబ్రవరి 28న కన్యాకుమారిలో ఆ జెండాను పాతి యాత్రను ముగిస్తారు. రోజుకు సగటున 70-100 కిలోమీటర్ల దూరాన్ని ఆడుతూపాడుతూ అధిగమిస్తున్నారు. మధ్యమధ్యలో ఊళ్లలో ఆగి పాఠశాలలు, కళాశాలల్లో ఉపన్యాసాలు ఇస్తున్నారు. "ఇలా చేస్తే బాలికల్లో సాహసం పట్ల స్పృహ పెరుగుతుంది. తలచుకుంటే తాము చేయలేనిదేమీ లేదన్న ఆత్మవిశ్వాసం వాళ్లలో కలుగుతుంది'' అంటున్నారు ఈ బృందం మహిళలు.

ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్న వసుమతి శ్రీనివాసన్ 40 ఏళ్లుగా ఇదే రంగంలో కృషి చేస్తున్నారు. ఆమె ఉత్సాహానికి ఆర్మీలో పనిచేసే భర్త ప్రోత్సాహం తోడయింది. "ప్రతిరోజూ ఉదయాన్నే నాలుగున్నరకల్లా నిద్రలేస్తాం. ఐదున్నరకల్లా యాత్రను ప్రారంభిస్తాం. రోజుకు ఇద్దరు లీడర్స్‌గా వ్యవహరిస్తారు. వాళ్లు ముందుంటారు. అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం. ఏడున్నర ఎనిమిదింటికి శుభ్రంగా ఉండే చోట అల్పాహారం తీసుకుంటాం.

మళ్లీ ముందుకెళతాం. భోజనాలు చేశాక కాసేపు విశ్రమిస్తాం. సాయంత్రం ఐదున్నర, ఆరింటి వరకూ ప్రయాణం సాగుతుంది. మధ్యలో కనిపించిన వారినల్లా పర్యావరణానికి హాని చేయొద్దని అభ్యర్థిస్తూ ముందుకెళుతున్నాం...'' అంటూ ఈ సైకిల్ సాహసయాత్ర జరుగుతున్న తీరును వివరించారామె. "ఊళ్లలో మా వైపు విచిత్రంగా చూస్తుంటారు. కానీ, మా యాత్ర ఉద్దేశం చెప్పగానే గౌరవిస్తున్నారు. అప్పుడప్పుడూ ఈవ్ టీజింగ్ చేసేవాళ్లూ ఎదురవుతుంటారు. కామెంట్లను సరదాగ తీసుకుని ముందుకెళ్లిపోతాం.

మరీ ఇబ్బంది పెట్టే సంఘటనలు ఇప్పటి వరకు జరగలేదు..'' నవ్వుతూ అన్నారు ఆ మహిళలు. 'ఇన్నిసార్లే ఆగాలనే నియమం ఏం పెట్టుకోలేదు. మధ్యమధ్యలో చల్లటి కొబ్బరినీళ్లు వంటివి కనిపిస్తే ఆగిపోతాం. నిన్న ఒకచోట తాజా కల్లు ఇచ్చారు అక్కడివారు. అబ్బో దాని రుచి అమోఘం... లోకల్‌గా ఎక్కడేది దొరికితే దాన్ని లాగించేస్తున్నాం..'' అంటున్నప్పుడు నవ్వులే నవ్వులు.

మాకు భయం లేదు..

వీళ్లందరికీ పర్యావరణ స్పృహ ఒక్కటే కాదు. సాహసాలు చేయాలన్న ఉత్సాహం కూడా ఎక్కువ. "నాకు పర్వతారోహణ అంటే చాలా ఇష్టం. ఏటా మూడు నాలుగు సార్లు హిమాలయాలను ఎక్కేందుకు వచ్చే బృందాలకు నాయకత్వం వహించాను. నిజానికి చాలామందికి సాహసాలు చేయాలన్న ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తిని సరైన దిశలో ప్రోత్సహించాలి. ముఖ్యంగా పిల్లలను.

చిన్నప్పటి నుంచీ ఉత్తేజపరచడం వల్ల వాళ్లకు పెద్దయ్యాక ఒక బృందంగా కలిసి పని చెయ్యడం, ఇతరుల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం వంటి లక్షణాలు అబ్బుతాయి. ఉదాహరణకు మీరొక శిఖరాన్ని చూస్తారు. 'అబ్బో దీన్ని అధిగమించడం కష్టం, నావల్ల కాదులే' అనుకుంటారు. కానీ కష్టపడి దాన్ని సాధించిన తర్వాత ఇందాక భయపెట్టిన పర్వత శిఖరం ఇప్పుడు మీ కాళ్ల కింద ఉంటుంది. అదెంత సంతోషాన్ని ఇస్తుందో మాటల్లో చెప్పలేం..'' అన్నారు బెంగళూరుకు చెందిన వసుమతి శ్రీనివాసన్.

కోల్‌కతాకు చెందిన లిపిక బిశ్వాస్ కూడా ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తపరిచారు. "నా సోదరులు సరదాగా పర్వతారోహణ చేస్తుంటే నాకూ చెయ్యాలనిపించింది. అన్నయ్య చెయ్యగాలేనిది నేనెందుకు చెయ్యకూడదు? అని మా నాన్నను అడిగితే 'ఎందుకు చెయ్యకూడదూ, నువ్వు కూడా బాగా చెయ్యగలవు' అంటూ భుజంతట్టారు. డార్జిలింగ్‌లోని 'హిమాలయన్ మౌంటెనీరింగ్ ఫౌండేషన్'లో కొన్ని కోర్సులు చేశాను. 95 నుంచి నేను పర్వతారోహణ చేస్తున్నాను. కిందటేడు వసుమతిని కలిసిన తర్వాత విమెన్ అడ్వెంచర్ నెట్‌వర్క్ ఆఫ్ ఇండియా (డబ్య్లుఎఎన్ఐ)లో సభ్యత్వం తీసుకున్నా.

రైల్వే ఉద్యోగినైనా సమయం సర్దుబాటు చేసుకుంటున్నా. పదేళ్ల కింద ఒక సాహసయాత్ర చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా నా బూట్లు పాడయిపోయాయి. అందరినీ నాకోసం ఆగమనలేను, అలాగని బేస్‌క్యాంపు దాకా వెళ్లి కొత్తవి తెచ్చుకోలేను. నా తోటి వాళ్లను ముందుకు సాగిపోమ్మని చెప్పి నేను ఉదయం పది నుంచీ సాయంత్రం ఆరింటివరకూ వాళ్లు వచ్చేదాకా అక్కడే కూర్చున్నాను. హిమాలయాల్లో ఎవరూ లేకుండా ఒంటరిగా... గాలి వీచిన శబ్దానికి ఉలిక్కిపడేదాన్ని. ఎవరో వస్తున్నారనిపించేది... మళ్లీ నిశ్శబ్దం...'' మరిచిపోలేని జ్ఞాపకాలను ముచ్చటగా చెప్పుకొచ్చారామె.

అందరికీ అతిథులం

ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో కూడా కొందరు సైకిల్‌యాత్రలో పాల్గొంటున్నారు. సరదాతోపాటు సాహసం చేస్తే వచ్చే థ్రిల్‌ను వారు సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆ మాటే చెప్పుకొస్తూ.. "రెండేళ్లుగా చేస్తున్న ఉద్యోగాన్ని మొన్నే వదిలేశాను. మరో ఉద్యోగంలో చేరే ముందు ఏదైనా సాహసయాత్ర చేద్దామనుకుంటున్నప్పుడు ఈ బృందం గురించి తెలిసింది. ఇదే నా మొదటి సాహసయాత్ర. మొన్న ఒరిస్సాలో జలేశ్వర్‌లో ఆగినప్పుడు అక్కడొక జాతర జరుగుతోంది. వాళ్లు మమ్మల్ని ముఖ్య అతిథులుగా అందరికీ పరిచయం చేశారు.

వారి ఆదరం ఎప్పటికీ మరపురానిది..'' అంటూ చెప్పుకొచ్చారు బెంగుళూరుకు చెందిన స్నేహ సుబ్రమణ్యం. ఇలాంటి సాధారణ ఉద్యోగినులే కాదు. పర్వతారోహణను ఒక సవాల్‌గా తీసుకున్న మరికొందరు మహిళలు కూడా ఈ సైకిల్‌యాత్రలో తళుక్కుమన్నారు. "ఎవరెస్ట్‌ను అధిరోహించిన అతి పిన్న మహారాష్ట్ర అమ్మాయిని నేనే. మరో నాలుగు ఖండాల్లో ఎత్తయిన శిఖరాలను అధిరోహించాను. సాహసక్రీడల్లో నిత్యం పాల్గొనేదాన్ని.

గడచిన రెండేళ్లుగా పర్వతారోహణ నా నిత్యజీవితంలో భాగమైపోయిందంటే నమ్మండి. ప్రస్తుతం 'జోర్‌కా ఝట్కా' అనే రియాల్టీషో చేస్తున్నాను. అంటార్కిటికాలోని ఎత్తయిన శిఖరాన్ని ఎక్కిన మొదటి భారతీయ అమ్మాయిగా రికార్డు ఉంది. మొత్తం ఏడు ఖండాల్లో ఇలాంటి రికార్డును నెలకొల్పాలన్నదే నా ఆశయం..'' అంటున్న పుణె వాసి కృష్ణా పాటిల్ పట్టుదలను మెచ్చుకోకుండా ఉండలేము.

మరపురాని అనుభవాలు..
"రెండేళ్లక్రితం ఒక పర్వతారోహణ చేస్తున్నప్పుడు మా లీడర్ విమలా నేగికి సైక్లింగ్ ఆలోచన వచ్చింది. నాకూ చెయ్యాలనిపించిందిగానీ సైక్లింగ్ రాదు. మాది పర్వత ప్రాంతం కావడం, ఏడాదికి ఆర్నెల్లు మంచుతో కప్పేయడం వల్ల నేర్చుకోవడం కుదర్లేదు. మా తమ్ముడు ఒకరోజు రెండుగంటల పాటు నేర్పాడంతే. దానితో ఏమీ రాలేదు. అయినా ఇందులో పాల్గొనాలని యాత్ర ప్రారంభానికి రెండు రోజుల ముందు ప్రాక్టీస్ చేశాను. ఊళ్లలో సైకిల్ తొక్కడం కష్టమనిపిస్తోందిగానీ, ఆరుబయట ప్రదేశాల్లో మాత్రం అందరితో సమంగా తొక్కగలుగుతున్నా. నిన్న ఒడిషాలో ఒక టీవీ కెమెరామన్ నాకు దగ్గరగా కెమెరా పెట్టాడు. సైకిల్‌ను గాభరాగా తొక్కడంతో ఆయనతోపాటు కెమెరా కూడా కిందపడిపోయింది..'' అంటూ నవ్వుకున్నారు మనాలికి చెందిన కృష్ణ ఠాకుర్.

వీళ్లంతా ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు పర్వతప్రాంతాలలో పర్యటించారు. మరిచిపోలేని అనుభూతులను సొంతం చేసుకున్నారు. అలాంటి మహిళల్లో డెహ్రడూన్‌కు చెందిన కవిత ఒకరు. "నేను ఒకసారి ఎవరెస్ట్ ఎక్కి దిగుతున్నప్పుడు మంచు తుపాను కమ్ముకుంది. నేను ఇక బతకడం కష్టమే అనుకున్నాను. నా కళ్లముందే ఇద్దరు విదేశీయులకు గాయాలయ్యాయి. ఒక షేర్పా మంచులో కూరుకుపోయి చనిపోయాడు..'' అంటూ యాత్రలో ఎదురైన విషాద అనుభవాన్ని చెప్పారు కవిత. "నేను ఋషీకేశ్‌లో పర్యాటకులతో బంగీజంప్ చేయిస్తుంటాను. మరికొన్ని సాహస క్రీడల్లో శిక్షణ ఇస్తుంటాను. కేవలం మహిళలతో మాత్రమే కలిసి ఈ యాత్ర చేయడం అద్భుతం'' అన్నారు రూప సాహీ.

దేశవ్యాప్తంగా మహిళల సాహసయాత్రలను ప్రోత్సహించడానికి 'విమెన్ అడ్వెంచర్ నెట్‌వర్క్ ఆఫ్ ఇండియా' సంస్థ పనిచేస్తోంది. సాహసాలే మాధ్యమంగా మహిళలను ఉత్తేజపరచడానికి, పనిలో పనిగా పర్యావరణ పరిరక్షణకూ తన వంతు సాయం చేస్తుంది. ఈ సంస్థలో సభ్యులే ఇప్పుడీ సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు.

జనవరి 25న కోల్‌కతాలో ప్రారంభమైన 'గో గ్రీన్ గాళ్స్' సైకిల్ యాత్ర ఒడిషాను దాటి మన రాష్ట్రంలో ఇచ్ఛాపురం, కోటబొమ్మాళి, రణస్థలం, విశాఖపట్నం వరకూ వచ్చింది. ఇక్కడ నుంచి తుని, కాకినాడ, నర్సాపూర్, మచిలీపట్నం, చిన్న గంజాం, కావలి, మనుబోలు, తడల మీదుగా తమిళనాడులోకి ప్రవేశిస్తుంది. ఫిబ్రవరి 28న కన్యాకుమారిలో సైకిల్‌యాత్ర ముగుస్తుంది. బీఎస్‌యే హెర్క్యులస్, ఇండియన్ మౌంటెనీరింగ్ ఫౌండేషన్, టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్, రోటరీ సంస్థలు ఈ యాత్రను స్పాన్సర్ చేస్తున్నాయి.

రికార్డులు కొట్టారు..

ఈ మహిళల బృందంలో అందరూ సైకిళ్లే కాదు. మోటర్‌బైక్‌లు కూడా నడుపుతారు. బైక్‌ల మీద సహసాలు కూడా వీరికి కొత్తేం కాదు. "కొన్నేళ్ల కిందట నేను ఉత్తరాఖండ్ పర్వతాల్లో మూడు వేల కిలోమీటర్ల బైక్ యాత్ర చేశా. నాకు సీబీజెడ్ సొంత బైక్ ఉంది తెలుసా? ఊరికే హారన్ కొట్టడం నాకు నచ్చదు. అందుకే నా బైక్‌కు హారన్ లేదంటే మీరు నమ్మగలరా?'' అంటున్న సోనీషా మాటల్లో పర్యావరణం పట్ల తనకున్న బాధ్యతను చెప్పకనే చెప్పినట్లయింది. అమెరికాలోని నేషనల్ అవుట్‌డోర్ లీడర్‌షిప్ స్కూల్‌లో విద్యార్థులకు సాహసక్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు రీనా ధర్మసక్తు.

ఈమె దక్షిణ ధృవానికి స్కీ చేసిన మొదటి భారతీయ మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ సైకిల్ యాత్రలో భాగస్వాములయ్యారు. ఈ యాత్రలో అందరినీ ఆకర్షిస్తున్న తల్లీకూతుళ్లు వసుమతి, స్మితా శ్రీనివాసన్. పర్వతారోహణ చేసిన తొలి తల్లీకూతుళ్లుగా వీరి పేరిట లిమ్కా రికార్డు కూడా నమోదయ్యింది. "సైకిల్‌కు రెండు చక్రాలు. మా ఆశయానికి రెండు లక్ష్యాలు సాహసాభిరుచి, సామాజిక స్పృహ. ఇవే మమ్మల్ని కోల్‌కతా నుంచి కన్యాకుమారి వరకు నడిపిస్తున్నాయ్'' అంటున్న వీరందరికీ చల్లటి విశాఖ తీరం కాస్త సేద తీరమని స్వాగతం పలికింది.

No comments:

Post a Comment