విహారాలు

India

Gamyam

Saturday, February 26, 2011

సై.. అంటూ ఢిల్లీకి

విజయవాడ టు ఢిల్లీ.. సుమారు రెండు వేల కిలోమీటర్ల దూరం... రైల్లో వెళ్లాలంటే ముప్పై గంటలు పడుతుంది. మరి సైకిలెక్కి వెళ్లాలంటే ఎన్ని రోజులు పడుతుంది? అయినా సైకిలెక్కి వెళ్లే సాహసం ఎవరు చేస్తారు అనుకుంటున్నారా... విజయవాడకి చెందిన ముప్పైమంది సైకిలిస్టులు అదే పని చేశారు. రాజధాని చేరడానికి వారికి నెల రోజులు పట్టింది. అయ్యబాబోయ్.. అన్ని రోజులా..! అనుకోకండి. వారి ఉద్దేశం ఎంత తొందరగా ఢిల్లీ చేరాలన్నది కాదు. సైకిల్ వాడకం వల్ల మన ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి, మన చుట్టూ ఉండే పర్యావరణానికి ఎంత మేలు కలుగుతుందో తెలియజేయడం.

అందుకే ఢిల్లీ యాత్రని ఎంచుకున్నారు. తమ నినాదాన్ని దేశ రాజధాని దాకా తీసుకెళ్లాలనుకున్నారు. 2010 డిసెంబర్ 29న సైకిలెక్కి బయల్దేరి... పల్లెలు, పట్టణాలు, నగరాలు చూసుకుంటూ... రాష్ట్రాలు దాటుకుంటూ... ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు, గురుద్వార్‌లు... ఎక్కడ వసతి దొరికితే అక్కడ రాత్రులు బస చేస్తూ ఢిల్లీ చేరుకున్నారు. కొత్త కొత్త ప్రదేశాల్ని చూస్తూ, ప్రజలతో సంభాషిస్తూ... ఓ విహార విజ్ఞాన యాత్రలా సాగింది వారి ఢిల్లీ ప్రయాణం. అంత చలికాలంలో సైకిలెక్కి ఢిల్లీ యాత్రకి వెళ్లడం ఓ అదనపు సాహసం. ఈ సాహస యాత్రను నిర్వహించింది యాక్టివ్ బైసైకిలర్స్ అసోసియేషన్ (విజయవాడ). దాని కార్యదర్శి వి.సత్యనారాయణ మనతో పంచుకున్న యాత్రా విశేషా
లు...

తనని తాను సైకిల్ ఉద్యమకారుడిగా పిలుచుకుంటారాయన. సైక్లింగ్ గురించి ప్రజలకు చెప్పడమే కాదు, చేసి చూపించాలనుకుంది ఆయన నాయకత్వంలోని యాక్టివ్ బైసైకిలర్స్ అసోసియేషన్. స్థాపించినప్పటి నుండి (అన్నట్టు 09-09-09 దాని పుట్టిన రోజు) నెలనెలా సైకిల్ ర్యాలీ నిర్వహిస్తూనే ఉన్నారు. విద్యార్థుల్ని, ఆసక్తి ఉన్న మరికొందరిని కూడగట్టి విజయవాడలోనూ, అక్కణ్ణుంచి చుట్టుపక్కల ఉన్న నూజివీడు, గుంటూరు, బాపట్ల... మొదలైన పట్టణాలకు సైకిల్‌పై వెళ్లొచ్చేవారు. బడిపిల్లల దగ్గర్నుండి రిటైర్ అయిన సీనియర్ సిటిజన్ల దాకా చాలా మంది ఆ ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ఒక్కో యాత్ర యాభై అరవై కిలోమీటర్ల కన్నా ఉండదు. అయితే ఈ సారి మాత్రం మహా యాత్ర నిర్వహించాలనుకున్నారు వాళ్లు. అది ఎంత పెద్ద యాత్ర అంటే.. రెండు వేల కిలోమీటర్లు.. ఢిల్లీ దాక. సైకిళ్లు తొక్కుకుంటూ రాజధాని చేరి రాష్ట్రపతిని కలిసి తమ యాత్ర ఉద్దేశాన్ని ఆమెకి తెలియజేయాలన్నది వారి ప్రణాళిక.

ఆచరణ సాధ్యమే


ఆలోచన బాగానే ఉంది. ఏ బస్సులోనో, రైల్లోనో విహార యాత్రకు వెళ్తే ఎక్కడపడితే అక్కడ ఆగలేం.. దేన్ని చూడాలంటే దాన్ని చూడలేం. అదే సైకిల్ అయితే ఎవరి ఇష్టం వచ్చిన చోట వాళ్లు ఆగొచ్చు. అన్నీ చూసి తరించొచ్చు. తమ పర్యావరణ నినాదాన్ని జనానికి తెలియజేయొచ్చు. అందుకే ఈ ఆలోచన చాలామందికి నచ్చింది. అయితే అది సాధ్యమేనా ! ఒక్కొక్కరికి ఎంత ఖర్చవుతుంది, మార్గంలో తిండి తిప్పలు ఎలా? పైగా చలికాలం. రాత్రిళ్లు ఎక్కడుండాలి? లాడ్జిల్లో ఉండాలంటే వేలు ఖర్చు చేయాలి. ఇలాంటి చాలా ప్రశ్నలు వచ్చాయి. అయితే అవన్నీ పెద్ద సమస్యలుగా అనిపించలేదు సత్యనారాయణకి. ఇదివరకే ట్రెక్కింగ్‌కి, సైకిల్ యాత్రలకి వెళ్లిన అనుభవం ఉందాయనకి. అసలు ఈ అసోసియేషన్ పెట్టాలన్న ఆలోచన కూడా కులూ మనాలీలో ట్రెక్కింగ్ ట్రిప్‌కు వెళ్లినప్పుడే వచ్చింది.

ఢిల్లీ యాత్ర ఆలోచనను రాష్ట్ర యువజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి డా. వెలగా జోషికి తెలియజేశారు సత్యనారాయణ. ఆయన 'యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా' కృష్ణా జిల్లా చైర్మన్ కూడా. ఇలాంటి యాత్రల పట్ల ఆయనకి కూడా ఆసక్తి ఉంది. కాబట్టే ఢిల్లీ యాత్రలో పాల్గొనే విద్యార్థులు తమ పేర్లు నమోదు చేయించుకోవచ్చంటూ యువజన సంక్షేమ శాఖ నుంచి జిల్లాలో కాలేజీలకి లేఖలు పంపించారు. చాలామంది విద్యార్థులు ఆసక్తి చూపారు. అందరూ ఇంటర్మీడియట్, డిగ్రీ చదివే పిల్లలే. వారిలో నుండి 26 మంది యాత్రకొచ్చారు. శ్రీమతి గెంటేల శకుంతలమ్మ కళాశాల నుంచి 15 మంది విద్యార్థులు వస్తే మిగతా వాళ్లు తిరువూరు, విజయవాడ, అవనిగడ్డలలోని వివిధ కాలేజీల్లో చదువుకుంటున్న వాళ్లు.

నిధుల కోసం...


యాత్రకి కావాల్సిన నిధుల్ని సమకూర్చే పనిలో పడ్డారు సత్యనారాయణ. పర్యావరణ పరిరక్షణ కదా వారి నినాదం. అందుకే ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌ని సంప్రదించారు. యాభై వేల రూపాయలు ఇవ్వడానికి ముందుకొచ్చారు వాళ్లు. ఒక సిమెంటు ఫ్యాక్టరీ అధినేత ఇంకో యాభై వేలు సాయం చేశారు. అలా లక్ష రూపాయలొచ్చాయి. సైకిల్ ర్యాలీ గురించి బిఎస్ఏ సైకిల్ కంపెనీకి లేఖ రాస్తే ఆ సంస్థ స్పందించి 26 గేర్ సైకిళ్లను పంపించింది. కొన్ని టైర్లు, ట్యూబులు కూడా ఇచ్చింది. యాత్ర ముగిశాక తిరిగి ఇచ్చేయాలనే షరతు మీద. దారిలో వండుకుని తింటే ఖర్చు తగ్గుతుంది. పైగా రాష్ట్రం దాటితే తిండి సమస్య. ఉత్తరాది వాళ్ల తిండి మనం తినలేమని వంట చేసుకోవాలనుకున్నారు. వంటసామానుకి, అందరి లగేజి తీసుకెళ్లడానికి ఓ వ్యాన్‌ను సిద్ధం చేసుకున్నారు. ఒక వంటాయన్ని మాట్లాడుకున్నారు. యాత్రలో పాల్గొనే 26 మందితో పాటు మరో ఏడుగురు సహాయకులు కలిసి మొత్తం 33 మంది సిద్ధమయ్యారు. వారిలో సత్యనారాయణ భార్య, వారి నాలుగేళ్ల కుమార్తె కూడా ఉన్నారు.

అలా మొదలైంది...


2010 డిసెంబర్ 29 ఉదయం... సైకిళ్లన్నీ ప్లకార్డులు తగిలించుకుని యాత్రకి సిద్ధమయ్యాయి. విద్యార్థులందరూ తమ అమ్మనాన్నలను ఒప్పించి యాత్రకు బయల్దేరారు. కృష్ణా జిల్లా కలెక్టర్ పచ్చజండా ఊపి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పారు. సాయంత్రానికి కృష్ణాజిల్లా ఎ. కొండూరు చేరి అక్కడ ప్రభుత్వ కార్యాలయంలో బస చేశాం. ఉదయం మొదటిసారిగా పరిచయమైన వాళ్లం సాయంత్రానికల్లా ఫ్రెండ్స్ అయిపోయాం. 30 ఉదయాన్నే మళ్లీ సైకిలెక్కి సాయంత్రానికి ఖమ్మం చేరాం. 31,1 వరంగల్ జిల్లాలో, రెండున కరీంనగర్‌లో, మూడున మంచిర్యాలలో, నాల్గున ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్‌లో... ప్రతిచోటా ప్రభుత్వ కార్యాలయాల్లో బస చేస్తూ సాగిపోయాం. రాష్ట్ర ప్రభుత్వ యువజన సంక్షేమ శాఖ ప్రోత్సాహం ఉంది కాబట్టి యాత్ర మన రాష్ట్రంలో సాగినన్నాళ్లు ప్రభుత్వ కార్యాలయాల్లోనే పడుకున్నాం. కొందరు అధికారులు విసుక్కున్నా కొందరు మాత్రం చాలా సహకరించారు. యాత్రకి ఎలాంటి ఇబ్బందులు రాలేదు.

రాష్ట్రం దాటాం...


5న మహారాష్ట్రలోకి ప్రవేశించాం. రాష్ట్రం దాటేటప్పుడు అక్కడున్న మన పోలీసు చెక్‌పోస్టు అధికారులు మా అందరికీ టీ, కాఫీలు, బిస్కట్లు తెప్పించారు. మా వ్యాన్‌కి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉందా అని అడిగితే లేదన్నాం. 'మనవాళ్లు కాబట్టి మేం వదిలేస్తున్నాం కాని ఇతర రాష్ట్రాల్లో పోలీసులతో ఇబ్బందులు ఎదుర్కొంటార'ని చెప్పారు వాళ్లు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉన్న వేరే వ్యాన్ తెప్పించుకోవడానికి ఒక రోజు పట్టింది. దాంతో ఆ రోజు మహారాష్ట్రలోని లక్కడుకోట గ్రామంలో ఉండిపోయాం. పల్లెటూరు కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలేవీ లేవు. అయితే ఆ గ్రామంలో చాలామంది తెలుగు వాళ్లున్నారు. వాళ్లు నడిపే హోటల్ కూడా ఉంది. అక్కడే మధ్యాహ్నం భోజనం చేసి ఆ రాత్రికి ఆ ఊళ్లోని ప్రభుత్వ పాఠశాలలో పడుకున్నాం.

ఆరవ తేదీకల్లా మా వ్యాన్ వచ్చేసింది. మాకు కొత్త శక్తి వచ్చినట్టయింది. ఇక దిగుల్లేదు, పోలీసులు పట్టుకుంటారనే సమస్య కూడా లేదు. నూతనోత్తేజంతో ముందుకు సాగాం. సాయంత్రానికి చంద్రపూర్ పట్టణం చేరుకున్నాం. మేం సైకిళ్లపై వెళ్తుంటే చూసి చాలామంది ఎన్నో ప్రశ్నలడిగే వారు. ఎక్కణ్ణుంచి వస్తున్నారు. ఎక్కడి కెళ్తున్నారు. ఎందుకిదంతా... ఇలాంటివే మరెన్నో ప్రశ్నలు. వాళ్ల ప్రశ్నలకి సమాధానం చెప్పడం మా దినచర్య అయిపోయింది. చాలాచోట్ల విలేకరులు కూడా కలిసి మాట్లాడారు. మేం ఎక్కడికెళ్లినా మీ గురించి పేపర్లో చూశాం, వాళ్లు మీరేనా అనే వాళ్లు. అప్పుడు కాని అర్థం కాలేదు.. మా గురించి పేపర్లో రాస్తున్నారని. పనిలో పనిగా ప్రాంతాల్ని చూస్తూ వాటి విశేషాలు తెలుసుకుంటూ వెళ్లాం.

చంద్రపూర్ నుంచి బయల్దేరిన రోజు సాయంత్రం బుట్టిబోరి అనే టౌన్ చేరుకున్నాం. అక్కడ ఓ పెద్ద స్కూల్ కనిపించింది. శ్రీ దత్తా విద్యా మందిర్ అని రాసుంది. ఆ స్కూల్‌కి వెళ్లి మా ట్రిప్ గురించి వివరించాం. స్కూల్ చైర్‌పర్సన్ మా గురించి, మేం చేపట్టిన యాత్ర గురించి చాలా ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. తెలుగువాళ్లని తెలియగానే ఆ స్కూల్ ప్రిన్సిపాల్‌ని పిలిపించారు. ఆయన వచ్చి తెలుగులో మాట్లాడడంతో మా ఆనందానికి అవధుల్లేవు. మన తెలుగు వాడేనట. మరో ఇద్దరు టీచర్లు కూడా తెలుగు వాళ్లున్నారు. వాళ్లంతా స్కూల్లో ఉండడానికి మాకు వసతి కల్పించారు. మరునాడు ఉదయం ఆ స్కూల్ విద్యార్థులతో ముచ్చటించి, స్కూల్ వాళ్లందరికి ధన్యవాదాలు తెలిపి మళ్లీ పయనమయ్యాం.

వాటర్ ట్యాంక్ తెప్పించారు...


అందరూ యువకులే కాబట్టి, పోటాపోటీగా సైకిళ్లు తొక్కేవాళ్లు. టౌన్లు, నగరాల్లో మాత్రం గ్రూపులుగా విడిపోయి ఎవరు చూడాలనుకున్న ప్రదేశానికి వారు వెళ్లిపోయేవాళ్లు. అనుకున్న సమయానికి అనుకున్న చోట కలిసేవాళ్లు. నేను, మరో ఒకరిద్దరు మావసతి ఏర్పాట్లు చూసుకునే వాళ్లం. సైకిళ్లపై వెళ్లే వాళ్లకంటే ముందే వ్యాన్ వెళ్లిపోయి ఒక చోట ఆపేసి, అన్నం రెడీ చేసేసే వాళ్లం. భోజనాలు అయిపోగానే ఆ వ్యాన్ బయలుదేరి ఆ రోజు బస చేయబోయే ఊళ్లో ఆగేది. పనివాళ్లు వారి పనుల్లో వాళ్లుండేవాళ్లు. ఆ విధంగా తొమ్మిదో తేదీకి 'సియోని' అనే పట్టణానికి చేరాం. అక్కడి పోలీస్ కమిషనర్‌ని కలిసి మా గురించి వివరించాం. 'వసతి కోసం మమ్మల్నే ఎందుకు కలవాలనిపించింది' అనడిగారాయన. యా త్ర గురించి చెప్పాక వెంటనే అక్కడున్న పాలిటెక్నిక్ కళాశాలలో వసతి ఏర్పాటు చేయించారు. స్నానానికి నీళ్లు లేకపోతే ఒక వాటర్ ట్యాంకర్ అప్పటికప్పుడు తెప్పించారు. అంత బాగా స్పందించిన ఆ కమిషనర్‌ని చూసి మాకే ఆశ్చర్యమేసింది.

ఉదయాన్నే మళ్లీ ప్రయాణం.. పదో తేదీ సాయంత్రం మంగ్వాని అనే ఊళ్లో ఓ పాఠశాలలో రాత్రి బస చేశాం. ఢిల్లీ వైపు వెళుతున్నాం కాబట్టి చలి నానాటికీ పెరిగిపోతోంది. అందరం రగ్గులు, దుప్పట్లతో వెళ్లినా..వాటితో చలి ఆగలేదు. 11వ తేదీన లోలారి రాజ్ మార్గ్ అనే గ్రామానికి వెళ్లి కేరళకి చెందిన టీచర్లు నడుపుతున్న 'రుక్మిణి దేవి పబ్లిక్ స్కూల్'లో ఉన్నాం. దేశంలో ఎక్కడికెళ్లినా కేరళ టీచర్లు కనిపిస్తారనిపించింది వారిని చూస్తుంటే.

గురుద్వారాల్లోనే మా బస


మధ్యప్రదేశ్‌లోని సాగర్ పట్టణం నుంచి మా బస ఎక్కువగా గురుద్వార్‌లలోనే బస జరిగింది. విజయవాడ గురుద్వారా నిర్వాహకులు చేసిన సాయాన్ని మేం ఎన్నడూ మరువలేం. ఎందుకంటే... ఆయన ఒక్క మాట చెప్పినందుకే మా ప్రయాణంలో 12 రోజుల పాటు గురుద్వారాలలో బసతో పాటు ఉచితంగా ఆహారం కూడా పెట్టారు. 13న లలిత్‌పూర్ గురుద్వారాలో, 14న ఝాన్సీ గురుద్వారా ఉన్నాం. 15న గ్వాలియర్ చేరాం. అక్కడ గురుద్వారా కొండపైన ఉంటుంది. కొండపై నుంచి గ్వాలియర్ నగరం మొత్తాన్ని చూడొచ్చు. ఆ నగరంలో అద్భుత కట్టడాలకు కొదవలేదు. గొప్ప పర్యాటక కేంద్రమే కాక ఆధ్యాత్మిక కేంద్రం కూడా. అందుకే అక్కడ రెండురోజులు ఉండి సిటీ మొత్తం తిరగాలని ముందే అనుకున్నాం. చేతిలో సైకిళ్లున్నాయి, వాటిపై మా నినాదాలూ ఉన్నాయి. నగరం మొత్తం తిరిగినట్టూ ఉంటుంది.. ప్రజలకి మా ఉద్దేశం గురించి తెలియజేసినట్టూ ఉం టుంది. అలా అనుకుని అందరం గ్వాలియర్ మొత్తం తిరిగి చూశాం. అక్కణ్ణుంచి బయల్దేరి ముందే అనుకున్న చోట అందరం కలిశాం... ఒక్కరు తప్ప.

అజయ్ వచ్చేశాడు...


అజయ్ అనే అబ్బాయి తప్పిపోయాడు. ఉత్సాహంగా ముందుకి వెళ్లిపోయి మా నుంచి వేరైపోయాడు. సాయంత్రం అయిపోతోంది. అజయ్ ఇంకా రావట్లేదు. సెల్‌ఫోన్ లేదు. వెంట తెచ్చుకున్న డబ్బులు అందరం వ్యాన్‌లోని మా బ్యాగ్‌లలో పెట్టుకున్నాం. అందుకే అజయ్ ఏమయ్యాడో, ఎలా వస్తాడో అని భయపడి చచ్చాం. అంతపెద్ద గ్వాలియర్ నగరంలో ఎక్కడని వెతకాలి. ఏం చేయా లో అర్థం కాలేదు. ఎలా గైనా వస్తాడులే అని ఎదురు చూస్తూ కూర్చున్నాం. రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఫోన్ వచ్చింది. మీ అబ్బాయి ఇక్కడున్నాడు తీసుకెళ్లండి అని ఎవరో చెప్పారు.

ఒక్కసారిగా మా అలిసిపోయిన ముఖాల్లో చిరునవ్వులు. వెంటనే వ్యాన్ వేసుకెళ్లి అజయ్‌ని తీసుకొచ్చాం. మా సైకిళ్లన్నిటి మీదా మా నినాదాలతో పాటు మా ఆర్గనైజేషన్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్‌కి ఫోన్ చెయ్యమని చాలామందిని అడిగాడట అజయ్. చివరికి ఒక పెద్దాయన కరుణించి ఫోన్ చేశాడని చెప్పాడు. ఇలాంటి సంఘటన జరిగితే మనం చేయాల్సింది ఒక్కటే అని ముందే చెప్పుకున్నాం. ఎపి రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న ఏ లారీ అయినా ఆపితే చాలు.. వాళ్లు మనల్ని ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తారని. ఎవరైనా నీరసపడి సైకిల్ తొక్కలేకపోతే దాన్ని వ్యాన్‌పై వేసుకుని వ్యాన్‌లో వెళ్లిపోయే వాళ్లు. ఒకబ్బాయికి నీరసంగా ఉంటే ఎందుకైనా మంచిదని సెలైన్ కూడా పెట్టించాం.

ఫైర్ ఇంజన్‌తో స్నానం చేశాం...


16న గ్వాలియర్‌లో బయల్దేరి రాజస్థాన్‌లోని డోలాపూరా వెళ్లాం. అక్క డ గురుద్వారా చాలా చిన్నది. అంతమంది ఉండడానికి సాధ్యం కాలేదు. డోలాపూర్ జిల్లా కేంద్రం కావడం వల్ల నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వసతి కల్పించాలని అభ్యర్థించాం. ఆ కలెక్టర్ పేరు రామ్ కిలాడి మీనా. మా యాత్ర గురించి తెలుసుకుని మమ్మల్ని అభినందించారు. మేం ఉండడానికి ప్రభుత్వ గోడౌన్‌లలో ఒక గదిని అప్పటికప్పుడు శుభ్రం చేయించారు. అంతే కాదు, మా స్నానాలకి నీళ్లు లేకపోతే వెంటనే ఫైర్ డిపార్ట్‌మెంట్‌కి ఫోన్ చేసి ఫైర్ ఇంజన్ తెప్పించారు. ఆ నీళ్లతో స్నానాలు చేసి బట్టలు కూడా ఉతుక్కు న్నాం. అధికారులు తలుచుకుంటే పనులు ఎంత చకచకా జరుగుతాయో తెలిసింది. అందుకే ఆయనకి కృతజ్ఞతలు చెప్పి ఆగ్రాకి బయల్దేరాం.

ఆగ్రాలో ఫోటోలే ఫోటోలు


17, 18 తేదీల్లో ఆగ్రాలో గడిపాం... ఆగ్రా చూడ్డానికి రెండ్రోజులు చాలవు. తాజ్‌మహల్ సౌందర్యాన్ని చూసి తరించాలన్న మాలో చాలామంది కోరిక ఈ సైకిల్ యాత్రతో నెరవేరింది. మిగతా ఎక్కడా ఫోటోలపై అంతగా ఆసక్తి చూపని మేమంతా తాజ్‌మహల్ ముందు మాత్రం మమ్మల్ని మేం చూసుకోవాలని తెగ ఆరాటపడ్డాం. ఆగ్రా వెళ్లిన వాళ్లు తప్పకుండా అక్కడున్న గురుద్వారాని చూడాలి. గురుద్వారాలు నియమాలకి, నిబద్ధతకి, పవిత్రతకి చిహ్నాలు. అక్కడి వాళ్లు అతిథులపై చూపించే ప్రేమ, గౌరవం మేం ఎక్కడా చూడలేదు. ఎవరెవరో ఖరీదైన కారుల్లో వచ్చి భక్తుల చెప్పులు తుడిచే వాళ్లు. మనం తిన్న ప్లేట్లు కూడా కడుగుతారు. వాళ్లలా సేవలు చేయడం చూసి మా కళ్లని మేమే నమ్మలేకపోయాం. మా ట్రిప్ మొత్తంలో సగం రోజులు గురుద్వారాలలో ఉన్నందుకు మేం చాలా సంతోషించాం. మనం ఇలా సేవచేయగలమా అని మమ్మల్ని మేమే ప్రశ్నించుకుని సిగ్గుపడ్డాం.

ఢిల్లీలో ఓ వారం


19న ఆగ్రాలో బయల్దేరి సాయంత్రానికి మధుర చేరుకున్నాం. అక్కడ కూడా మాకు వసతినిచ్చింది గురుద్వారానే. అక్కణ్ణుంచి 20న ఢిల్లీకి 30 కిమీ దూరంలోని బల్లబ్‌గాజ్ చేరుకుని అక్కడి గురుద్వారాలో రాత్రి గడిపాం. 21న రాజధానికి చేరుకున్నాం. ఆరోజు మధ్యాహ్నం మన తెలుగు సోదరులు కోటిరెడ్డి, శ్రీనివాస్‌తో పాటు కొందరు మాకు స్వాగతం పలికారు.

రాజధానిని చూడడానికి వారం కేటాయించుకున్నాం. పార్లమెంటు దగ్గర్లోని రకబ్‌గంజ్ గురుద్వారా ఉండడానికి అవకాశం లభించినా రిపబ్లిక్‌డే ఉత్సవాలు జరగబోతున్నాయి కాబట్టి భద్రతా కారణాల వల్ల అక్కడ ఉండడానికి వీలు కాలేదు. దాంతో ఆ మహానగరంలో ఎక్కడుండాలో తెలీలేదు. దగ్గర్లో ఉన్న హిందూ సమాజ్ భవనంలో ఓ మూడు వేలు చెల్లించి ఆ రాత్రికి తల దాచుకున్నాం. మా యాత్ర మొత్తంలో ఆ ఒక్కరోజు మాత్రమే మేము ఉండడానికి డబ్బులు ఖర్చు చేశాం. మరునాడు ఉదయం చాందినిచౌక్‌లోని శిశు గురుద్వారాకి వెళ్లి.. మిగిలిన ఆరు రోజులూ అక్కడే ఉన్నాం.


రోజంతా సిటీ మొత్తం తిరగడమే మా దిన చర్య. 26న రిపబ్లిక్‌డే వేడుకలు తిలకించాం. 27న పార్లమెంటు భవనాన్ని చూడ్డానికి వెళ్లాం. ఆ సమయంలో మాలాగే కొందరు పార్లమెంటు చూడ్డానికి వచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కుమారుడు, పార్లమెంట్ సభ్యుడు అయిన సందీప్ దీక్షిత్ వారికి ఆ విశేషాలన్నీ వివరిస్తున్నాడు. వాళ్లతో పాటు మాకు కూడా ఆయన చాలా విశేషాలు చెప్పారు. అపరిచితులమైన మాకు కూడా ఆయన అంత ఆసక్తిగా వివరించడం చూసి మేం ఆశ్చర్యపోయాం. ఆరోజు సాయంత్రం కేంద్ర పర్యావరణ శాఖ కార్యాలయానికి వెళ్లాం. ఆ శాఖ సభ్య కార్యదర్శి జె ఎస్ కామ్యోత్రని కలిశాం.


మా యాత్ర గురించి చెప్పి ఆయన అభినందనలు పొందాం. 28న ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ని కలిశాం. ఆమె అపాయింట్‌మెంట్ దొరుకుతుందో లేదో అని మాలో చాలామంది రాలేదు. ఏడుగురమే వెళ్లాం. ఆమె అపాయింట్‌మెంట్ దొరికింది. సాయంత్రం అయిపోవడంతో అప్పటికే చలి బాగా ఉంది. మా ఏడుగురిలో ఇద్దరు ఆడవాళ్లు, మా పాప కూడా ఉన్నారు. 'ఇంత చలిలో ఏమీ కప్పుకోకుండా వచ్చారే' అంటూ వెంటనే మూడు షాల్స్ తెప్పించి మా పాపకి, ఇద్దరు ఆడవాళ్లకి కప్పారు. ఆమెతో కాసేపు ముచ్చటించి అక్కణ్ణుంచి సెలవు తీసుకున్నాం. అన్నట్టు మేం ఎపి భవన్‌కి వెళ్లి అక్కడ మన తెలుగు భోజనాన్ని కూడా రుచి చూశాం. అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ని కూడా కలిశాం.


సైకిలెక్కి వందల గ్రామాలు, పదుల పట్టణాలు తిరిగాం. వేలమందిని కలిశాం, వారందరికీ మా యాత్ర గురించి వివరించాం. ఉపఖండంలో ఎంతో కొంత భాగాన్ని కలియ తిరగడానికి, మన దేశంలోని భిన్నత్వాన్ని కనులారా చూడడానికి ఇది మాకు గొప్ప అవకాశాన్ని కల్పించింది. జనవరి 29న ఢిల్లీలో రైలెక్కి 30న విజయవాడ చేరుకున్నాం. సైకిళ్లు ట్రాన్స్‌పోర్ట్‌లో వచ్చేశాయి. వాటిని మళ్లీ బిఎస్ఏ కంపెనీకి అప్పజెప్పాం... సైకిల్ యాత్ర తాలూకు మధురానుభూతుల్ని మాత్రం మాతోనే ఉంచుకున్నాం.

No comments:

Post a Comment