విహారాలు

India

Gamyam

Wednesday, December 15, 2010

జలపాత హోయలు.... రంగనాథుని కటాక్షం వెరసి..... శ్రీరంగ పట్టణం

Ranganathaswamy_Templeకర్ణాటకలో మైసూరు తరువాత చెప్పుకోదగ్గ అతిపెద్ద పర్యాటక కేంద్రం శ్రీరంగపట్టణం. ఇది మైసూర్‌కు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది... టిప్పు సుల్తాన్‌ కాలంలో అప్పటి మైసూరు రాజ్యానికి రాజధానిగా విరాజిల్లింది. శ్రీరంగ పట్టణంలో ముందుగా చెప్పుకోదగినది రంగనాథస్వామి ఆలయం. ఎంతో చారిత్రక విశిష్టతను తనలో ఇముడ్చుకున్న ఆ ఆలయంతో పాటు ఎన్నో విహార ప్రదేశాలు ఈ పట్టణంలో ఒదిగిపోయాయి. మైసూర్‌ విహారానికి వెళ్లిన ప్రతి పర్యాటకుడు శ్రీరంగపట్టణాన్ని కూడా దర్శిస్తారంటే అతిశయోక్తి కాదు. దేశంలోనే పేరుగాంచిన శ్రీరంగపట్టణ విహార విశేషాలు ..........

కర్ణాటకలోని మాండ్య జిల్లాలో కావేరి తీరప్రాంతంలో ఉన్న శ్రీరంగపట్టణం చుట్టూ కావేరి నది ప్రవహిస్తుండడంతో ఈ నగరం ఓ ద్వీపంలా కనబడుతుంది. ఇక్కడ కొలువైవున్న శ్రీరంగనాధ స్వామి పేరుతో ఈ నగరానికి శ్రీరంగపట్టణం అనే పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో గంగ వంశపు రాజులు నిర్మించారు. అద్భుత శిల్ప సౌందర్యంతో అలరారుతోన్న ఆ ఆలయం... హోయసల, విజయనగర నిర్మాణశైలికి అద్దం పడుతుంది.

రంగనాథస్వామి దేవాలయానికి ఎదురుగా వినాయకుడి దేవాలయం ఉన్నది. అంతేకాకుండా గంగాధరేశ్వరస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, జ్యోతిమహేశ్వర స్వామి వంటి ఎన్నో దేవాలయాలు శ్రీరంగపట్టణంలో కొలువుదీరి ఉన్నాయి.

పట్టణ చరిత్ర...
Tippu_Mausoleum శ్రీరంగపట్టణం... విజయనగర సామ్రాజ్య కాలం నుండి పుణ్యే త్రంగా, సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లుతున్నది. అంతేగాక మైసూ రు రాజ్య రాజధానిగా కూడా విశేష సేవలందించింది ఈ నగరం. రంగ రాయ మహారాజును ఓడించిన వడ యార్‌ రాజు 1610లో శ్రీరంగపట్ట ణాన్ని వశపరుచుకున్నాడు. విజయ నగర సామ్రాజ్యంపై దండెత్తిన వడయార్‌ రాజును విజయనగర సామ్రాజ్య ఆరాధ్య దేవతయైన అలిమేలమ్మ శపించిందనీ, అందువల్ల వడయార్‌ రాజుకు సంతానం కలుగలేదని ఓ కథనం ప్రచారంలో ఉంది. రాజా వడయార్‌ రంగరాయను ఓడించిన తరువాత 1610లో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాడు. అప్పటినుండి ఇక్కడ నవరాత్రి ఉత్సవా లను ఎందో వైభవోపేతంగా జరపడం ఆనవాయితీగా మారింది. అప్పటినుండి మైసూర్‌ దసరా ఉత్సవాలకు ఒక గుర్తింపు వచ్చింది. చాముండేశ్వరీ దేవిని కొలుస్తూ... పదిరోజుల పాటు జరిగే నవరాత్రి ఉత్సవాలు దేశంలోనే ఎంతో పేరుప్రఖ్యాతులను సంతరించుకున్నాయి.

Shivanasamudram 1610లో రాజా వడయార్‌ వశపరుచున్న శ్రీరంగపట్టణం 1947లో భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించేవరకు మైసూర్‌ రాజధానిగా వెలుగొందింది. రాజా వడయార్‌ తరువాత, హైదర్‌ అలీ, టిప్పు సుల్తాన్‌ల ఆధ్వర్యంలో శ్రీరంగపట్టణం... మైసూరు రాజ్యానికి రాజధాని అయ్యింది. టిప్పు సుల్తాన్‌ తన రాజ్యానికి ‘ఖుదాదాద్‌ సల్తనత్‌’ లేదా ‘సల్తనత్‌ ఎ ఖుదా దాద్‌’ అని పేరు పెట్టాడు. టిప్పు సుల్తాన్‌ శ్రీరంగపట్టణాన్ని రాజధాని చేసుకుని, దక్షిణ భారత్‌ లోని చాలా ప్రాంతా లను తన రాజ్యంలో కలుపు కున్నాడు. ఇండో - ఇస్లామీ య నిర్మాణ శైలిలో టిప్పుసుల్తాన్‌ సమాధి, టిప్పూ ప్యాలెస్‌, దరియా దౌలత్‌, జుమ్మా మసీదు లాంటి నిర్మా ణాలు ఈ నగరానికి శోభను చేకూర్చుతున్నాయి. ఇలాం టి ఎన్నో చారిత్రక కట్టడాలను నిర్మించి తనదైన శైలి పరి పాలనతో దేశవ్యాప్త గుర్తింపు పొందిన టిప్పు సుల్తాన్‌ 1799 లో తన సొంత అనుచరగణం విద్రోహ చర్యవల్ల శ్రీరంగపట్టణ పరిసరాలలోనే బ్రిటిష్‌ వారిచే చంపబడ్డాడు.

చూడదగ్గ ప్రదేశాలు...
Daria_daulatమైసూర్‌ పర్యటన పూర్తిచేసుకొని శ్రీరంగపట్టణంలో అడుపెట్టగానే ఎన్నెన్నో చారిత్రక నిర్మాణాలు ప్రకృతి రమణీయతలు స్వాగతం పలుకుతాయి. రంగనాథ స్వా మి దేవాలయంతో పాటు... టిప్పు సుల్తాన్‌ నిర్మించిన జుమ్మా మసీదు, అంతేకాకుండా రంగన్‌తిట్టు పక్షి అభ యారణ్యం, కరిఘట్ట శ్రీనివాస ఆలయం, దరియా దౌల త్‌ గార్డెన్‌, శివనసముద్ర జలపాతం లాంటి ఎన్నో ప్రదే శాలు విహారాన్ని జీవితాంతం గుర్తుండేలా చేస్తాయి.

దేశంలో రెండవ అతిపెద్ద జలపాతం...
శివనసముద్ర జలపాతం, భారత్‌ లో రెండవ, ప్రపంచం లో 16వ అతిపెద్ద జలపాతం. శ్రీరంగపట్టణానికి అతిచేరువలో ఉన్న చిన్న నగరం శివనసముద్ర. ఇది కావేరి నది ఒడ్డున ఉంది. ఆసియాలో మొట్టమొదటి జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం స్థాపించింది ఇక్కడే కావడం విశేషం. 1902 ఇక్కడ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాట చేశారు. కావేరి నదీ మార్గంలో డెక్కన్‌ పీఠభూమి యొక్క రాళ్లు, పర్వత కనుమల్లోనుండి పైనుండి కిందికి దూకుతూ పర్యాటకులను ఆనందడోలి కల్లో ముంచెత్తుతుంది శివనసముద్ర జలపాతం. శివనసముద్ర ద్వీప నగరం... ఇక్కడ కావేరి నదిని జంట జలపాతాలుగా విభజిస్తుంది. ఈ దృశ్యం చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది. ఇది దేశంలో నాల్గవ అతిపెద్ద ద్వీపం ఏర్పరుస్తుంది. ఇక్కడ కూడా శ్రీరంగపట్టణంలో మాదిరిగా ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి.

ఇది ఒక పరిచ్ఛేద జలపాతం. పరిచ్ఛేద జలపాతం అనగా... నీటి ప్రవాహం రెండు లేదా మరిన్ని పాయలుగా విడిపోవడానికి ముందు ఒక చరియ మీదగా కిందకి పడటం వలన ఏర్పడతాయి. ఫలితంగా పక్కపక్కనే ప్రవహించే పలు జలపాతాలు ఏర్పడతాయి. ఈ జలపాతం సగటున 849 మీటర్ల వెడల్పు, 90 మీ ఎత్తుతో సెకనుకు 934 క్యూబిక్‌ మీటర్లను కలిగి ఉంది. గరిష్ట నమోదిత ఘన పరిమాణం సెకనుకు 18,887 క్యూబిక్‌ మీటర్లు. ఇది ఒక జీవ జలపాతం. జూలై నుండి అక్టోబరు వరకు రుతు పవన కాలంలో అత్యధిక ప్రవాహాన్ని కలిగి ఉంటుంది.

Ranganthittu_Bird_Sanctuary బెంగుళూరు నగరానికి 139 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతానికి ఓ విశిష్టత ఉంది. ఈ జలపాతం యొక్క ఎడమ భాగాన్ని గగనచుక్కీ అని, కుడి భాగాన్ని భారచుక్కీ అని పిలుస్తారు. వాస్తవానికి, భారచుక్కీ జలపాతాలు. గగనచుక్కీ జలపాతాలకు నైరుతి దిశలో కొన్ని కిలోమీటర్లు ఉంటాయి. దీనికి కారణం ఏమిటంటే కావేరీ నది కూడా ఉత్తర దిశలో కొన్ని కిలోమీటర్లు పశ్చిమ, తూర్పు భాగాల్లోకి విడిపోతుంది. పశ్చిమ భాగం ఫలితంగా గగనచుక్కీ జంట జలపాతాలుగా విభజించబడుతుంది. అలాగే తూర్పు భాగం ఫలితంగా భారచుక్కీ జలపాతాలు విభజించబడతాయి. గగనచుక్కీ జలపాతాలను శివనసముద్ర వాచ్‌ టవర్‌ నుండి చాలా దగ్గరగా వీక్షించవచ్చు. దక్షిణాది భాషలకు సంబంధిచిన చలనచిత్రాల్లోని జలపాత దృశ్యాలు చాలావరకు ఇక్కడివే కావడం విశేషం. గగనచుక్కీ జలపాతాలకు... దర్గా హజ్రాత్‌ మార్డాన్‌ గాయిబ్‌ నుండి మరొక మార్గం ఉంది. అక్కడ ఉంచిన హెచ్చరికలను పట్టించుకోకుండా, ప్రజలు రాళ్లపై నుండి కిందకి దిగి, వెనుక నుండి జలపాతాలను చూడటానికి ప్రయత్నిస్తున్నారు, దీనివల్ల ఇక్కడ అప్పుడప్పుడు పలు ప్రమాదాలు చోటుచేసుకుంటాయి.

విద్యుత్‌ ఉత్పాదన...
సింషాపురా తర్వాత ఆసియాలో రెండవ జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్ర ఈ జలపాతం వద్ద ఏర్పాటు చేయబడింది. 1902 ఏర్పాటు చేసిన ఈ జలవిద్యుత్‌ కేంద్రం ఇప్పటికీ నిరాటంకంగా పని చేస్తుంది. మైసూర్‌ దివాన్‌ శేషాద్రి ఐయ్యర్‌ ఈ జలవిద్యుత్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ప్రారంభంలో కోలార్‌ బంగారు గనులకోసం ఉపయోగించారు. దీనివల్ల కోలార్‌ బంగారు గనులు ఆసియాలో జల విద్యుత్తును పొందిన మొట్టమొదటి నగరంగా పేరు గాంచింది.

అరుదైన పక్షులకు ఆలవాలం... రంగన్‌తిట్టు పక్షి అభయారణ్యం...
శ్రీరంగపట్టణానికి అతిదగ్గరలో ఉన్న రంగన్‌తిట్టు పక్షి అభయారణ్యంలో... పెయింటెడ్‌ స్టార్క్‌, ఓపెన్‌-బైల్డ్‌ స్టార్క్‌, బ్లాక్‌ హెడెడ్‌ లిబిస్‌, రివర్‌ టెర్న్‌, గ్రేట్‌ స్టోన్‌ ప్లోవర్‌, ఇండియన్‌ శాగ్‌ లాంటి ఎన్నో అరుదైన పక్షిజాతులు ఈ అరణ్యంలో మనకు దర్శనమిస్తాయి. ‘పక్షి కాశి’ అని పిలువబడే ఈ పక్షి అభయారణ్యం 67 చకిమీ వైశాల్యం కలిగి ఉన్నది. శ్రీరంగపట్టణానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఈ అభయారణ్యం ఉన్నది. కావేరి నదీ పరీవాహక ప్రదేశాన్ని సందర్శించిన పక్షి శాస్తవ్రేత్త డా సలీం అలీ తొలిసారిగా ఈ ప్రాంతంలో అరుదైన పక్షులు ఉన్నట్టు కొనుగొన్నాడు. ఈ విషయాన్ని వడయార్‌ రాజులకు తెలిపి వారిని ప్రేరేపించాడు. దాంతో వడయార్‌ రాజు 1940లో ఈ ప్రాంతాన్ని పక్షి అభయారణ్యంగా ప్రకటించారు.

శ్రీనివాసుడు కొలువైన ‘కరిఘట్ట’...
శ్రీరంగపట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లకొండ (బ్లాక్‌ హిల్‌) పై వెలిసిన శ్రీనివాసుడు భక్తులకు అభయాన్ని ప్రసాదిస్తున్నాడు. కరిఘట్ట అని పిలవబడే ఈ ప్రాంతంలో వేంకటేశ్వర స్వామి సంచరించాడని పురాణగాధ. నల్ల కొండ పై వెలిశాడు కాబట్టి ఇక్కడ శ్రీనివాసున్ని ‘కరిగిరివాసుడు’ (కరి అనగా ‘నలుపు’, గిరి అంటే... ‘కొండ’) అని పిలుస్తారు.

No comments:

Post a Comment