విహారాలు

India

Gamyam

Saturday, November 12, 2011

సిటీ ఆఫ్ పొయెట్స్ అండ్ ఫ్లవర్స్


ఒక దేశం ఆత్మను దర్శించాలంటే- విలాసవంతమైన నగరాల్లో పర్యటిస్తే సరిపోదు. ఆ దేశం గ్రామాల్లో పర్యటించాలి. ఆ గ్రామాల ప్రజల జీవనవిధానాన్ని దగ్గరి నుంచి తెలుసుకోవాలి. వాళ్లు తినే తిండి, వాళ్ల సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రను అర్థం చేసుకోవాలి. మనసుల్ని పంచుకోవాలి. అప్పుడే ఆ దేశం గురించి సంపూర్ణంగా తెలుస్తుంది. అలాంటి అనుభవాలను వివరించేదే ఈ ట్రావెలోకం..

ఒయాసిస్సుల ఒడ్డున పరుచుకుపోయిన పల్లెల్లో జీవించాలనీ, ఎడారిలో ప్రయాణాలు చేయాలనీ ఎప్పటి నుంచో మనసులో ఉంది. ఉమర్ ఖయ్యాం రుబాయిల్లోని బుల్‌బుల్ పిట్టల సంగీతాన్ని వినాలనీ, ద్రాక్ష పళ్ల తోటల్లో తిరగాలనీ, సుల్తానులు కట్టిన ఎత్తయిన గోపురాల్ని చూడాలనీ కలలు కనేవాడిని. ఫిరదౌసీ, సాదీ, హఫెజ్‌లాంటి పార్సీ మహాకవుల రచనల్ని చదువుతున్నప్పుడల్లా వాళ్ల దేశం ఎప్పుడెప్పుడు వెళదామా అని ఉండేది. నా కల నిజమయ్యే రోజు రానే వచ్చింది. ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకొంటున్న రేజా బగేరీ అనే స్కాలర్, సమీరా అనే స్టూడెంట్ ఇరానీ దేశీయులు కావటం వల్ల వారి పరిచయంతో వేసవి సెలవుల్లో ఇరాన్ వెళ్లేందుకు వీసా తీసుకున్నాను. "మీరు వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంట్లోనే ఉండాలి'' అంటూ వాళ్లిద్దరూ నన్ను ఆహ్వానించారు. మే ఏడున కువైట్ ఎయిర్ లైన్స్ ఎక్కాను.

అది ముంబై నుండి, అరేబియా సముద్రం, ఇరాన్ మంచు పర్వతాల మీదుగా ప్రయాణించి.. మధ్యాహ్నానికి టెహరాన్ చేరుకుంది. అక్కడ సమీరా నాన్నగారు నాజర్ అక్బారీ నాకు స్వాగతం పలికి వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడు. కుటుంబ సభ్యులందరికీ పరిచయం చేసి పర్షియన్ తివాచీల మీద తేనీటి విందు ఏర్పాటు చేశాడు. సాయంత్రంబయటికి తీసుకెళ్లాడు. ఎదురుగా అన్నీ కొండల వరుసలే. కొండలపైకి వెళ్లేకొద్దీ, టెహరాన్ నగరమంతా విస్తరించిన ఆకాశహర్మ్యాలు లేత బంగారు ఎండలో మెరుస్తున్నాయి. దూరంగా కనిపిస్తున్న పర్వత శిఖరాలకు మాత్రం దట్టమైన మంచు పట్టుకొని వెళ్లాడుతోంది.. తల్లి వక్షాన్ని వదల్లేని బిడ్డ మాదిరిగా.

అంత ఎత్తులో ఉండే ఆ మంచు రిజర్వాయర్ల వల్లే టెహరాన్ నగరానికి ఆకలి దప్పులు తీరేది. ఆ మంచు కరిగి కాలువలై పారుతూ, చిన్న నదులుగా ఏర్పడి, ఎడారిలో కొంత భాగాన్ని పచ్చగా మార్చడం వల్లనే అక్కడ మానవ ఆవాసం ఏర్పడింది. "మిస్టర్ ఆదినా (నా పేరుకు వాళ్లు పెట్టుకున్న ముద్దుపేరు) చిన్నప్పుడు స్నేహితులతో కలిసి ఈ పర్వతాల్లో తిరిగేవాణ్ని. అప్పట్లో పెద్ద పెద్ద మంచు దిబ్బలు ఉండేవి..'' అంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు నాజర్ అక్బారీ. అక్బారీ సాబ్ నాకంటే రెండేళ్లు పెద్దవాడు. అయినా గుర్రప్పిల్ల మాదిరి పరుగులు తీస్తూ ఎంతో హుషారుగా ఉన్నాడు. ఇరాన్ గురించి మాట్లాడుకుంటూ ఆ పరిసరాల్లో చాలాసేపు తిరిగాం.

సేద్యం పదిశాతమే..

ఈ దేశంలో సగానికిపైగా ఎడారి. కేవలం పదిశాతం భూమే వ్యవసాయానికి, మరో ముప్పయి శాతం పశువుల మేతకీ పనికివస్తుంది. దాదాపు భారతదేశమంత వైశాల్యం ఉన్నా ఇరాన్ జనాభా మాత్రం ఏడుకోట్లే ఉంది. కొండలు, ఎడారులు, ఒయాసిస్సులు, జలపాతాలూ ఎక్కువగా ఉన్నాయి. ఇరాన్ అందమంతా వాటిల్లోనే ఉంది. 90 లక్షల మంది ప్రజలున్న ఈ టెహరాన్‌లో దాదాపు 30 లక్షల మంది కార్లలో తిరుగుతారు. 1980-88 సంవత్సరాల మధ్య ఇరాక్‌తో యుద్ధం కారణంగా నష్టపోయినా వెంటనే కోలుకొని పశ్చిమాసియాలో ఒక ప్రముఖ దేశంగా కొనసాగుతోంది.

మంచుగడ్డల్ని దాస్తారు..

మర్నాడు సాదాబాద్ మ్యూజియం వెళ్లాం. చినార్ వృక్షాల నీడలోని మెల్లాత్ ప్యాలెస్‌లో మధ్యయుగాల ముస్లిం వాస్తుకళ తొణికిసలాడుతోంది. 1979లో ఆయతుల్లా ఖొమైనీ తెచ్చిన విప్లవం తరువాత ఈ భవంతుల్ని ప్రజోపయోగంగా మార్చారు. అంతకుముందు పహ్లవీ వంశపు నవాబులు ఈ రాజప్రాసాదం నుంచి పరిపాలన సాగించేవారు. మ్యూజియం మొత్తం మీద నన్ను ఆకర్షించింది 'ఒమిద్‌వార్ బ్రదర్స్ గ్యాలరీ'. ఈ ఇరానీ సోదరులు 1954లో ప్రపంచయాత్రకు బయలుదేరి, 1964 వరకూ 90 దేశాల్లో తిరిగారు. వెళ్లేటప్పుడు వారి వద్ద 90 డాలర్లు మాత్రమే ఉన్నాయట.

మ్యూజియంలో మినియేచర్ చిత్రాలు, హస్తకళలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నా, నాకు బాగా నచ్చింది మాత్రం వాటర్ మ్యూజియం. నీటి విలువ ఉపయోగం ఎడారి ప్రజలకే ఎక్కువగా తెలుస్తుంది. భూమికిందుగా ప్రవహించే నీటిపాయల్ని కనిపెట్టి, ఆ నీటిని సేకరించే విధానాలు.. కొండల మీదున్న మంచు గడ్డల్ని సేకరించి, వాటిని ఎండాకాలం వరకు దాచిపెట్టే పద్ధతులు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మెల్లాత్ భవనంలో మార్క్‌ఛాగల్ పెయింటింగ్స్ చూశాం. తోచల్ రోప్‌వే మార్గం ద్వారా మంచుకొండల మీదికి వెళుతున్నప్పుడు లోయల్లో తిరుగుతున్న గొర్రెల మందలు, వంట చేసుకొంటున్న కాపర్ల దృశ్యాలు అపురూపంగా కనిపించాయి.

సఫర్ బే ఖేయిర్ చెప్పారు..

మరుసటి రోజున 'ఇరాన్ ఎస్పరాంతోసెంత్రో'లో నా ఆర్ట్ ఎగ్జిబిషన్ మొదలై మూడు రోజులపాటు సాగింది. కొత్త మిత్రులు పరిచయం అయ్యారు. నా వయసు వాళ్లందరూ గాంధీ, నెహ్రూలను తల్చుకున్నారు. మూడవ రోజున వాళ్లు నా బొమ్మలు కొన్ని తీసుకుని, ప్రయాణ ఖర్చుల కోసం వంద డాలర్లను చేతిలోపెడుతూ.. 'సఫర్ బే ఖేయిర్' (హ్యాపీ జర్నీ) చెప్పారు. అక్బారీ సాబ్ నన్ను మరో రోజంతా టెహరాన్‌లో తిప్పి, తన మాతృభూమి గొప్పదనాన్ని, అభివృద్ధిని చూపించాడు.

ఎంతో బిజీగా ఉండే టెహరాన్‌లో ఎక్కడా శబ్ద కాలుష్యం లేదు. అక్కడి పరిశుభ్రత నన్ను ఆశ్చర్యపరిచింది. ఫిరదౌసి మాన్యుమెంట్ వద్ద పుస్తకాలు కొన్నాను. 'కలర్ ఆఫ్ ద ప్యారడైజ్' సినిమా తీసిన ప్రఖ్యాత ఇరానీ డైరెక్టర్ మాజిద్ మాజ్దేని ఉంచిన జైలు పక్కగా వెళుతున్నప్పుడు 'మాకు పత్రికా స్వాతంత్య్రం లేదు' అంటూ చాలా బాధపడ్డాడు అక్బారీ. "సీ యు సూన్ ఇన్ టెహ్రాన్'' అంటూ నన్ను ఆజాదీ టవర్ వద్ద బస్సు ఎక్కించాడు అక్బారీ.

హస్తకళల నగరం..

నేను యాజ్ద్ నగరానికి బయలుదేరాను. ఇది టెహరాన్‌కి దక్షిణంగా ఉంటుంది. యాజ్ద్‌లో ఉన్న మిత్రుడు రేజా బగేరీని కలిశాను. అతడు ఆష్కజార్ యూనివర్శిటీలోని ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్‌మెంట్‌కి హెడ్. ఊరి బయట ఇసుక దిబ్బల మధ్యలో ఉంది వారి కాలేజీ. అక్కడ చదువుకొనే స్త్రీలు ఎక్కువ. ఇతర ముస్లిం దేశాలకంటే ఇరాన్‌లోనే స్త్రీలకి స్వాతంత్య్రం ఎక్కువ అనిపిస్తుంది. భారతీయ చిత్రకళ మీద నా చేత రెండు ఉపన్యాసాలు ఇప్పించాడు రేజా. కాలేజీలో ఆ రోజు జరుగుతున్న ఒక ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్‌కి ముఖ్య అతిథిగా హాజరయ్యాను. యాజ్ద్‌లో ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ఇళ్ల పైకప్పు మీద కిటికీలాంటి నిర్మాణాలు కట్టారు.

పది నుండి పదిహేను అడుగుల ఎత్తులో దీర్ఘచతురస్రాకారంగా ఉండే ఈ కట్టడాలు పెద్ద చిమ్నీల మాదిరి కనిపిస్తాయి. ఈ నిర్మాణం వల్ల బయట నుండి వీచే గాలి ఇంటి మధ్యలోకి వెళుతుంది. గాలి ఎటు నుండి వీచినా అది లోపలికి వెళ్లే విధంగా నిర్మించారు. వీటిని బద్‌గీర్ (విండ్ క్యాచెర్స్) అని పిలుస్తారు. ఒక్కొక్కసారి ఇంటి లోపల అరుగు మీద పెద్ద నీటిపళ్లాన్ని అమర్చటం వల్ల బద్‌గీర్ నుంచి ఇంటిలోపలికి వచ్చే గాలి నీటితో కలిసి ఇంటి మొత్తాన్నీ చల్లబరుస్తుంది. ఓల్డ్‌టౌన్ అంతటా ఇలాంటి ఇళ్లే ఉన్నాయి. సిటీలో ఉన్న చారిత్రక కట్టడాల్ని ఒక్క రోజులోనే చూసేశాను. యాజ్ద్ హస్తకళలకు ప్రసిద్ధి. మధ్య ఆసియా వాసులందరికీ యాజ్ద్ తివాచీలంటే ఎంతో అభిమానం.

ఒయాసిస్సు పక్కనే గ్రామం..

ఇరాన్‌కు శుక్రవారం సెలవు దినం. ఇంగ్లీషు డిపార్ట్‌మెంట్‌లో పరిచయం అయిన ప్రొఫెసర్ ఆలీగేవేష్ గురువారం సాయంత్రం వాళ్ల అమ్మగారి గ్రామం నౌదుషాన్‌కి బయలుదేరుతుంటే నేనూ సిద్ధం అయ్యాను. "ఆల్వేస్ ఎట్ యువర్ సర్వీస్'' అంటూ తన కారులోనే రమ్మన్నాడు. యాజ్ద్ నుండి ఉత్తర దిశలో వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నౌదుషాన్. రెండు గంటల ప్రయాణం. అద్భుతమైన ముడుత పర్వతాల పక్క నుంచి దూసుపోయింది కారు. అంతా ఎడారే. దారిలో కొన్ని మసీదులు, గ్రామాలున్నాయి. గ్రామం ఉందంటే అక్కడ ఒయాసిస్సు ఉందనుకోవాలి.

అం దులో దొరికే నీటిని బట్టి అక్కడ జనావాసం ఉంటుంది. ప్రజల జీవన గమనాన్ని నిర్ణయించేది ఒయాసిస్సే. హఠాత్తుగా ఎదురైన ఒక పెద్ద కొండ నీడలో సేదతీరుతూ ఉంది నౌదుషాన్ గ్రామం. మిత్రుడి ఇంట్లో వాళ్ల అమ్మగారు, అన్నయ్యగారి అబ్బాయి ఉన్నా రు. ఇల్లు చాలా విశాలంగా ఉంది. ఇంటి మధ్యలోనే తోట. వెలుతురు తగ్గిపోక ముందే గ్రామాన్ని చూడడానికి బయలుదేరాం. గడ్డిమోపులు మోస్తున్న గాడిదల గుంపులు ఎదురయ్యాయి. ఒక చిన్న పురాతన కోటను దాటుకుని ఊర్లోకి వెళ్లాం. "మా ఊళ్లో మూడువేలమంది నివసిస్తున్నారు. అందరికీ సరిపడా నీరు ఇచ్చేది ఒకే ఒక చిన్న నీటి ఊట'' అన్నాడు ఆలీగేవేష్.
"సార్! కొంచెం వివరంగా చెప్పండి?'' అని అడిగాను.

"ఇక్కడికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎత్తయిన కొండల నుండి సాగిన నీటి ఊట, భూమి లోపల ఇక్కడి వరకూ ప్రయాణించి, బల్లపరుపుగా ఉన్న ఈ ప్రదేశంలో బయటికి వచ్చి ప్రవహిస్తోంది. అందువల్లే ఇక్కడ ఒయాసిస్సు ఏర్పడింది. ఒయాసిస్సు చుట్టూ సారవంతమైన భూములు వెలిశాయి. మంచి పంటలు పండుతున్నాయి. దీనివల్లే ఇక్కడ గ్రామం ఏర్పడింది'' అని వివరించాడు.
"అయితే ఈ ఊట ఆగిపోవడం, పూడిపోవటం లాంటి సమస్యలు ఉండవా?'' అన్నాను.
"అలా జరిగినప్పుడు వెంటనే వాటికి మరమ్మతులు చేస్తారు. యాజ్ద్ పనివాళ్లకు ఈ కాలువల్ని తవ్వడంలో మంచి ప్రావీణ్యం ఉంది'' అని చెబుతూ కొంచెం పైభాగంలో ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లాడు. ఒక చోట నేల మీద గుండ్రంగా ఉన్న కొన్ని రాళ్లు తొలగించగానే, ఒక మనిషి నిలువుగా కిందికి వెళ్లటానికి సరిపడే బిలం ఉంది.
"ఈ బిలం ద్వారా 15 అడుగుల కింద ప్రవహిస్తున్న ఆ నీటిమార్గంలోకి దిగి అవసరమైన మరమ్మత్తులు చేసి, అదే మార్గంలో పైకి వస్తారు. భూమిలో ప్రవహించే నీటి కాలువపైన ప్రతి 100 మీటర్లకీ ఇలాంటి ఒక బిలం ఉంటుంది. వీటి ద్వారానే మరమ్మత్తులు జరుగుతాయి. ఈ నీటి కాలువను 'కనాత్' అని పిలుస్తున్నారు.

నౌదుషాన్ గ్రామంలోని ప్రతి ఇంటి మధ్యలో చిన్న తోటని పెంచుకుంటున్నారు. తోటని పెంచుకోవడం వల్ల ఆ చెట్లు పై వరకూ పెరిగి విసనకర్రల్లా పనిచేస్తూ ఇంటిలోనికి చల్లని గాలిని, పరిమళాన్ని పంపిస్తుంటాయి. ఆ రాత్రి కాసేపు ఎత్తుగా ఉన్న అరుగుల మీదే కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం. ఈ గ్రామంలో సున్నీలు, షియాలు కలిసే ఉంటున్నారు. నిజానికి ఈ ఇద్దరికీ పడదు. కాని పల్లెటూళ్లలో పరస్పర అవసరాల కోసం కలిసిపోక తప్పదు మరి.

సిటీ ఆఫ్ పొయెట్స్ అండ్ ఫ్లవర్స్

తెల్లారగానే పక్కింటి పిల్లల్ని తీసుకుని ఊరిబయట కొండలెక్కటానికి వెళుతుంటే.. "మీరు త్వరగా వస్తే, పిస్తా తోటల్లో తిరుగుదాం'' అన్నాడు మిత్రుడు అలీగేవేష్. రెండు కొండల్ని, కొన్ని పాత కట్టడాల్ని చూసి పది గంటలకే తిరిగొచ్చాం. ఆ మధ్యాహ్నం నౌదుషాన్ పిస్తాతోటలో ఇద్దరు ప్రొఫెసర్లు పనిచేశారు -నేనూ, అలీగేవేష్. ఎండిన కొమ్మల్ని కత్తిరించాం, నీళ్లు పెట్టాం, పనికి అడ్డం వస్తున్న చెట్లని రంపంతో కోశారు. నేను చిన్నతనంలో పొలాల్లో పనిచేయడం గుర్తుకు వచ్చింది. అదొక మధురానుభూతి. వాళ్ల మేనల్లుడిని "ఇండియా వస్తావా?'' అని అడిగాను. "రెండేళ్లు మిలిటరీ సర్వీసు పూర్తి చేయాలి కదా. అప్పుడు తప్పక వస్తాను'' అన్నాడు.

మరుసటి రోజు ఉదయాన్నే యాజ్ద్ మిత్రుల వద్ద సెలవు తీసుకుని సాయంత్రానికి కెర్మాన్ నగరం చేరుకున్నాను. ఇది యాజ్ద్‌కి దక్షిణంగా ఆఫ్ఘనిస్తాన్‌కి దగ్గరగా ఉంటుంది. ఇదంతా బెలూచీ ఒంటెల కాపర్లు తిరిగే ప్రాంతం. ఇక్కడ నాకు రేజా సత్వానీ అనే చిత్రకారుడు ఆతిథ్యం ఇచ్చాడు. అంతర్జాతీయ పద్ధతుల్లో కళాసాధన చేస్తున్న ఆయన వయస్సు 35 సంవత్సరాలు. ఇంకా ఒంటరిగానే ఉంటున్నాడు కాబట్టి అతని స్టూడియోలోనే నా నివాసం. సొంత ఇల్లు కట్టుకుని కొంత సంపాదించాక మాత్రమే ఇరాన్ యు వకులు పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. "గెస్ట్ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ గాడ్.. అనేది మా నమ్మకం. మీరు వారంపాటు మా ఇంట్లో ఉండవచ్చు'' అంటూ ఎంతో ప్రేమగా ఆహ్వానం పలికాడు. అతను నన్ను ప్రతిరోజూ నగరంలోని ఒక ప్రముఖమైన ప్రాంతంలో వదిలిపెట్టి, సాయంత్రానికి మళ్లీ అక్కడికే వచ్చి తన కారులో తీసుకెళ్లేవాడు. ఈలోపుగా నేను ఆ పరిసరాల్లో హాయిగా తిరిగేవాణ్ణి. చేతిలో మొబైల్ ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది కలుగలేదు.

సఫావిద్ కాలంలో నిర్మించిన గంజాలీఖాన్ బజార్ నగరానికి మధ్యలో ఉన్న అద్భుతమైన కట్టడం. ఈ బజార్‌లో ఉన్న ఒక గొప్ప నిర్మాణం గంజాలీఖాన్ హమామ్ (బాత్ హౌస్). దీన్ని మ్యూజియంగా మార్చారు. ఇది 17వ శతాబ్దం నాటి సఫావిద్ నవాబుల సామూహిక స్నానాల గదుల సముదాయం. ఎడారి దేశాలన్నిటిలోనూ ఇలాంటి హమామ్‌లు ఉన్నాయి. టర్కీలోని హమామ్‌లైతే విలాసాలకి మారుపేరు. వీటిలోకి నగరంలోని స్త్రీలు, పురుషులు వేరువేరు వేళల్లో స్నానాలకు వచ్చేవారు. సమాజంలోని వివిధ హోదాల వారికి వేరు వేరుగా గదులు ఉన్నాయి. శరీరాన్ని మర్దన చేయడానికి, జుట్టు కత్తిరించుకోవడానికి, దేహదారుఢ్యాన్ని పెంపొందించుకోవటానికి ప్రత్యేక వసతులున్నాయి ఇక్కడ.

'గుల్' పూలదుకాణాలు...

ఇరాన్‌లో భూకంపాలు ఎక్కువ. 2003లో బామ్ అనే చోట వచ్చిన భూకంపంలో 43 వేల మంది మరణించారు. కాబట్టి ఇళ్లు కట్టుకునేవాళ్లు ముందుగా ఐరన్‌తో బిల్డింగ్‌ఫ్రేమ్‌ను దృఢంగా తయారుచేసుకొని దాని ఆధారంతో గోడలు కట్టుకుంటారు. పార్కుల్లో మన ముద్ద బంతిపూలు చూసి సంతోషించాను. కెర్మాన్ బజార్లలో 'గుల్' పేరుతో పూలు అమ్మే దుకాణాలు చాలా ఉన్నాయి. ఒక సాయంత్రం కుర్దిస్తాన్‌కు చెందిన బహాడిస్ రేడ్ అనే చిత్రకారుడి షో చూడటానికి వెళ్లాను. ఇండియా గురించి ఆయనకి బాగా తెలుసు. ఈ యువకుడికి చిత్రకళతోపాటు జానపద నృత్యాలంటే ఎంతో ఇష్టం.

కుర్దు సంగీతాన్ని వినిపిస్తూ ఎంతో ఉద్వేగంతో నాట్యం చేశాడు. తడిపిన రెండు చిన్న గుడ్డముక్కల్ని చేత్తో పట్టుకుని చళ్‌చళ్‌మనిపిస్తూ, గుర్రం మాదిరిగా పాదాలని కదిలిస్తూ గొప్పగా నాట్యం చేశాడు. అనీస్ గ్యాలరీ క్యూరేటర్‌ను కూడా కలిశాను. "మీ దేశపు సంప్రదాయ చిత్రకళ మీద మా గ్యాలరీలో ఒక షో ఏర్పాటు చేయండి'' అని కోరారు నన్ను. ఒక రోజు మహాన్ అనే ప్రదేశానికి వెళ్లాను. అదంతా కొండప్రాంతం. ఇది కెర్మాన్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో బహు సుందరంగా ఉంది. కొండల మీంచి దూకే జలపాతాల ద్వారానే అక్కడ పంటలు పండుతున్నాయి. గజార్ కాలం నాటి షాహజాదీ నవాబులు పెంచిన వందల ఎకరాల పూల తోటల్లో విహరించడానికి యాత్రికులు ఎక్కువగా వస్తారక్కడికి. ఆ జలపాతాలు మంచుదిబ్బలు కరగడం వల్ల ఏర్పడ్డవే.

మహాన్‌లో ఉన్న పెద్ద మసీదు పేరు 'నిమాతుల్లావలీ'. అక్కడ నాకు కొత్త మిత్రులు ఏర్పడ్డారు. రేజాసత్వానీ నన్ను తన మిత్రుడి ఇంటికి తీసుకెళ్లాడు. ఆ రాత్రికి అక్కడే ఉన్నాం. మంచి విందు ఏర్పాటు చేశాడు. తనకు ఇష్టమైన ఇరానీ గాయని మార్జాన్ ప్రేమ గీతాల్ని ప్లేయర్ మీద వినిపించి, అనువాదం చేస్తూ ఎంతో తన్మయత్వానికి లోనయ్యాడు. ఎండిపోతున్న ఎడారి బావుల వేదన మాదిరిగా ఉంది మార్జాన్ గీతం.

విరహవేదన అనుభవించే 'తోడి రాగిణి' అనే రాజస్తానీ పెయింటింగ్ నా కళ్లముందు మెదిలింది. కెర్మాన్ నగరానికి బయట ఉన్న ఘయీమ్ కొండల లోపల నుండి పెద్ద జలపాతం దూకుతోంది. గడ్డి పరక కూడా మొలవని ఆ కొండల మధ్యలో అంత పెద్ద జలపాతం ఎక్కడ నుండి వస్తుందో తెలియలేదు. ఆ విధంగా ఎడారిని సస్యశ్యామలం చేసిన అల్లాకు కృతజ్ఞతగా కాబోలు కొండ దిగువలో పెద్ద మసీదుకట్టి ప్రార్థనలు చేస్తున్నారు. వర్షం వస్తుందనే భయం లేదు కాబట్టి మట్టి కోటలే నిర్మించారు నవాబులు. ఆ కట్టడాలను దృఢతరం చేయడానికి నీటితో పాటు ఒంటెపాలని కూడా కలిపారట.

రాగిపాత్రల బజారు..

కెర్మాన్ బజార్లో యాత్రికులకు బాగా నచ్చేవి స్థానికంగా తయారైన అందమైన రాగి పాత్రలు. వాటి మీద ఆయుధాలు ధరించి ఉన్న 'పెర్సిపోలిస్' సిపాయిల బొమ్మలున్నాయి. నేను కెర్మాన్‌లో ఉన్న ఆఖరి రోజు సాయంత్రం పూట మిత్రుడు నన్ను తనకి కాబోయే అత్తగారింటికి తీసుకెళ్లాడు. ఆవిడ నాకు గిఫ్ట్‌గా కెర్మాన్ రాగి పాత్రను బహూకరించింది. తర్వాత ఇస్ఫాహాన్ నగరం వెళ్లాను. అక్కడ నాకు ఆహ్వానం పలికిన వ్యక్తి మెహిదీ అనే టూరిస్టు గైడ్.

అతడు రేజాసత్వానీకి మిత్రుడు. ఈ నగరం టెహరాన్‌కు దక్షిణంగా 340 కిలోమీటర్ల దూరంలో ఉంది. 17వ శతాబ్దంలో షా అబ్బాస్ ద గ్రేట్ (1587-1629) పరిపాలించేవాడు. ఆ కాలంలోనే ఇస్ఫాహాన్ కీర్తి దిగంతాలకు వ్యాపించింది. ఎందుకంటే అతని కాలంలో ఇస్ఫాహాన్‌లో 163 మసీదులు, 48 కళాశాలలు, 1800 దుకాణాలు, 263 హమామ్‌లు ఉండేవి. "ఇస్ఫాహాన్ నగరాన్ని చూస్తే, సగం ప్రపంచాన్ని చూసినట్లే'' అనే నానుడి కూడా ఏర్పడిందట ఆ రోజుల్లో. ఆ నగరానికి కేంద్రం కింగ్స్‌స్క్వేర్. పరిసరాల్లోనే అలీ ఖాపు ప్యాలెస్, చెహెల్ సో తేన్ ప్యాలెస్ ఉన్నాయి. అవన్నీ అద్భుతమైన భవనాలే.

క్రీ.శ.1556లో మొగలు చక్రవర్తి హుమయూన్ ఇండియా నుండి ఇరాన్ వచ్చి షా తాహ్‌మాస్ప్ ఆస్థానంలో తల దాచుకున్నాడు. ఆ చారిత్రక సంఘటనకి గుర్తుగా చెహెల్ సో తేన్ ప్యాలెస్ గోడల మీద పెద్ద మ్యూరల్ చిత్రాలు వేశారు. ఖాజోన్ నది మీద ఉన్న పురాతన రాతివంతెన ఇంకా ఉపయోగంలో ఉంది. ప్రకృతిలోకి, నవాబుల చరిత్రలోకి ఒకేసారి ప్రయాణించి ఆనందించడానికి ఈ వంతెన ఎంతో ఉపకరిస్తోంది. ఇస్ఫాహాన్‌లో పర్షియన్ సంస్కృతిని ప్రతిబింబించే నిర్మాణాలు, మ్యూజియంలు కోకొల్లలు. కింగ్‌స్క్వేర్‌కు నాలుగు పక్కలా ఉన్న షాపుల్ని చూసుకుంటూ తిరిగితే చాలు. పర్షియన్ సాంస్కృతిక చరిత్ర మొత్తం మనకి తెలిసిపోతుంది.

మహాకవుల జ్ఞాపకాలు..

నా తిరుగు ప్రయాణానికి ఇక వారం రోజులే మిగిలుంది. ఇప్పటికే మూడు వారాలు నిమిషాల్లా కరిగిపోయాయి. ఇస్ఫాహాన్ నుండి పసార్‌గాడ్ వెళ్లాను. పర్షియా సామ్రాజ్యాన్ని స్థాపించిన రెండవ సైరస్ సమాధి ఇక్కడే ఉంది. 35 అడుగుల ఎత్తులో ఉన్న ఈ నిర్మాణం ఇప్పటికీ చెదిరిపోలేదు. దగ్గరలో కింగ్ షూజా నిర్మించిన కారవాన్ సరాయి శిథిలాల మధ్యన ఎండలో కాసేపు నిలబడ్డాను. ఎదురుగా ఉన్న కొండ మీద ఆనాటి కోటల పునాదులు కనిపిస్తున్నాయి.

సాయంత్రానికి ప్రఖ్యాతిగాంచిన పెర్సిపోలిస్ చేరుకున్నాను. పెద్ద పర్వత పంక్తిని ఆనుకుని ఉన్న గొప్ప నిర్మాణం అది. పరిసరాల అందమే ఆ కట్టడాల నిర్మాణానికి కారణమై ఉంటుంది. ఇక్కడ డేరియస్ రాజు (క్రీ.పూ.522-456) నిర్మించిన తక్త్-ఏ-జంషేడ్ అనే నిర్మాణం అత్యంత విశాలమైనది. లక్షా పాతిక వేల చదరపు మీటర్ల వైశాల్యంలో ఉన్న ఈ శిథిలాలు ఎంతో సౌందర్యవంతంగా ఉన్నాయి. మౌర్యుల కాలం నాటి శిల్పాలకు మూలాలు ఈ శిల్పాలే. పెర్సీపోలిస్ శిథిలాల వద్ద గడిపిన ఆ సాయంత్రం ఎప్పటికీ మరపురానిది.

ఆ రాత్రికి షిరాజ్ చేరుకున్నాను. 'సిటీ ఆఫ్ పొయెట్స్ అండ్ ఫ్లవర్స్' అని షిరాజ్‌కి ముద్దుపేరు. 13వ శతాబ్దం నాటికే కళలకి పేరు మోసిన నగరం షిరాజ్. 18వ శతాబ్దంలో జాండ్ వంశస్తులు షిరాజ్‌ని రాజధానిగా చేసుకున్నారు. షిరాజ్ ఈ నాటికీ ఒక ప్రముఖమైన వ్యాపార కేంద్రంగా ఉంది. మహాకవులైన సాదీ, హఫెజ్‌ల అందమైన సమాధులు నగరానికి కొత్త వెలుగులు ఇచ్చాయి. సాదీ (క్రీ.శ.1210-1290) సమాధిని పెద్ద పూదోట మధ్యలో నిర్మించారు. ఆ పక్కనే ఒక నీటిబుగ్గ ప్రవహిస్తోంది. చిన్న పిల్లలు దాంట్లో దిగి చేపల్ని తరుముతున్నారు. సమాధి చుట్టూ తాపడం చేసిన పాలరాతిపైన గులిస్తాన్‌లోని పద్యాలు చెక్కారు.

నీతివాక్యాలతో నిండిన ఆయన రచనలు ముస్లిం సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. స్వర్గానికి ఎనిమిది ద్వారాలు ఉన్నట్లే సాదీ రాసిన గులిస్తాన్ పుస్తకంలో కూడా 8 అధ్యాయాలు ఉన్నాయి. సూఫీ తత్త్వాన్ని ప్రతిబింబించే తన 'గులిస్తాన్' గ్రంథాన్ని ఎన్నటికీ వాడని గులాబీ తోటగా ఆయనే వర్ణించాడు. కవికోకిల దువ్వూరి రామిరెడ్డి ఫార్సీ నుండి తెలుగులోకి అనువాదం చేసిన గ్రంథాల్లో ఇదొకటి. సాదీ ఆసియా ఖండంలో 30 ఏళ్లపాటు తిరిగి ఎంతో విజ్ఞానాన్ని సంపాదించాడు. ఢిల్లీ సుల్తాన్‌ల కాలంలో ఆయన భారతదేశాన్ని కూడా దర్శించారు. తన కవిత్వం ద్వారా దైవానికి దగ్గరగా చేరుకున్న సాత్వికుడు సాదీ. మహాకవి హఫెజ్ (క్రీ.శ.1335-1390)సమాధిని కూడా ఎంతో సుందరంగా నిర్మించారు. ఆయన మీద ప్రేమ, గౌరవం వల్ల అదొక తీర్థయాత్రా స్థలంగా మారింది.

డెమొక్రసీ అంటే ఇష్టం..

షిరాజ్‌లోని షాచరాగ్ మసీదు గొప్ప కట్టడం. సఫావిద్ కాలంలో నిర్మించిన ఈ మసీదు వద్దకి చేరుకొనేసరికి రాత్రి తొమ్మిదైంది. ఉమర్‌ఖయ్యాం సమాధినీ చూద్దామనుకొన్నాను. కాని సమయం లేదు. నేను బయలుదేరాలి. నా వీసా రేపటివరకే పనిచేస్తుంది. షిరాజ్ నుండి బస్ మీద ఇస్ఫాహాన్ రైల్వేస్టేషన్‌కి చేరేసరికి ఏడు గంటలైంది. రాత్రి తొమ్మిది గంటల రైల్లో టెహరాన్‌కి బయలుదేరాను. నా ఎదురు బెర్తుల్లో పరీక్షలకి వెళ్లే కుర్రాళ్లు ఉన్నారు.

"మా దేశం గురించి మీరు ఏమి రాయదలుచుకున్నారు?'' అని అడిగారు నన్ను. "ఇరాన్ చాలా అందమైన దేశమనీ, భారతీయులంటే మీకు ఎంతో ఇష్టమనీ, అమెరికాతో పోటీపడి మీ దేశాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారనీ, మరీ ముఖ్యంగా నాకు చాలా మంచి ఇరానీ స్నేహితులు ఏర్పడ్డారని రాస్తాను'' అన్నాను. "సార్, మాకు డెమోక్రసీ అంటే చాలా ఇష్టమని కూడా రాయండి..'' అని ముక్తకంఠంతో చెప్పారు ఆ విద్యార్థులు. తెల్లవారేసరికి టెహరాన్ చేరుకుని నేరుగా అక్బారీసాబ్ ఇంటికి వెళ్లాను. ఆ సమయానికి నా మిత్రుడు నమాజ్ చేసుకుంటున్నాడు. ఆయన 'అల్లాహో అక్బర్' (గాడ్ ఈజ్ గ్రేట్) అంటూ కళ్లు మూసుకుని మూడుసార్లు పలికే లోపుగానే నేను 'నాజర్ అక్బారీ అక్బర్ హో' అంటూ అతని పాదాలకు నమస్కరించి.. ఇండియా వచ్చేశాను.


- ఎం.ఆదినారాయణ, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్టణం
ఫోన్ : 9849883570, auscholargypsy@gmail.com

No comments:

Post a Comment