విహారాలు

India

Gamyam

Wednesday, November 2, 2011

కేరళ ప్రకృతికాంత..వాయనాడ్‌

‘గాడ్స్‌ ఓన్‌ కంట్రీ’ అందాలకు వ్యసనపడకపోతే అది సందర్శకుడి దృష్టిలోపమే... కేరళలో ఏ ప్రాంతానికి వెళ్లినా... ప్రకృతి ఒడిలో తేలియాడిన అనుభూతి కలుగుతుంది. కన్యాకుమారి, అలెప్పీ, కోవలం, వెంబనాడ్‌, కుమారకోం, అలప్పూజ... ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రాష్ట్రం మొత్తం విహార కేంద్రాలమయం. ఆ కోవకు చెందిన అద్భుత పర్యాటక ప్రదేశమే వాయనాడ్‌. ప్రకృతి అందాలన్నింటినీ తనలో ఇముడ్చుకున్న వాయనాడ్‌ విశేషాలు...
Attappadi
 
వాయనాడ్‌ ప్రకృతి సౌందర్యానికి మీరు మైమరచిపోయి ఉండకపోతే, మీ కళ్లలో గానీ, మనసులో గానీ, స్పందనలో గానీ ఏదో లోపం ఉందనుకోవాల్సిందే... కేరళ రాష్ట్రానికి 590 కిలోమీటర్ల పొడవైన విస్తార తీరప్రాంతం ఉంది. ఇక్కడి ఇసుక, గాలులు, తరంగాలు ఎన్నో దండయాత్రలు, సాహసయాత్రలు, వివిధ ఖండాలు, సంస్కృతులకు చెందినవారితో జరిగిన వాణిజ్యాలకు సాక్ష్యాలు. అరబ్బులు, పోర్చుగీసులు, చైనీయులు, పర్షియన్లు, డచ్చివారు, బ్రిటిష్‌వారు, ఫ్రెంచ్‌ వారు... ఇలా అందరూ తమ ఓడలను కేరళ తీరంలో లంగరు వేశారు.

పర్యాటకుల స్వర్గధామం...

Nalliyampathy
 
అద్భుతమైన వాయనాడ్‌ పర్యాటకుల పాలిట స్వర్గధామంగా విలసిల్లుతోంది. కేరళలోని పశ్చిమ కనుమల్లోగల హిల్‌స్టేషన్లలో అపారమైన వృక్ష సంపద, వన్యప్రాణులు ప్రతివారినీ ఆకట్టుకుంటుంటాయి. అట్టప్పడి, ఇడుక్కి, పక్షిపాతాళం, పీరుమేడు, సైలెంట్‌ వ్యాలీ, వాగమాన్‌ దేవీకులం, నెల్లియంపత్తి, పొన్ముడి ఇలా హిల్‌స్టేషన్ల పేర్లు చెప్పుకుంటూ పోతే ఆ జాబితా అనంతం. మంచి సుగంధ ద్రవ్యాల నుంచి వెలువడే పరిమళాలు, కళ్లను కట్టిపడేసే పచ్చదనపు సౌరభాలు, మెరుస్తూ ప్రవహించే నదులు, భౌగోళికంగా కనపడే ఎత్తుపల్లాలు, ‘యూ’ ఆకారంలోని మలుపుల గుండా డ్రైవింగ్‌ చేసుకుంటూ వెళ్తే ఆ అనుభూతులు ఇవన్నీ కలిపి మనసుకు ఎక్కడలేని ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలబోసి మరీ అందిస్తాయి.సముద్రమట్టానికి 700 నుంచి 2,100 మీటర్ల ఎత్తువరకు ఉన్న వాయనాడ్‌, దక్కన్‌ పీఠభూమి దక్షిణభాగం మీద సగర్వంగా నిలిచి ఉంటుంది. కల్పెట్టా, సుల్తాన్‌ బాతెరి, మనంతావడి, పట్టణాలు పర్యాటకులకు కావల్సిన వసతి, ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తాయి.

చరిత్రలో వాయనాడ్‌...
Hotels-in-Wayanad
 
ఈ ప్రాంతాన్ని ప్రముఖ రాజవంశీయుడు కేరళవర్మ పఝస్సి రాజా తదితరులు పాలించారు. 19వ శతాబ్దం తొలినాళ్ళలో బ్రిటిష్‌వారు ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. కురిచియా గిరిజనుల సాయంతో పఝస్సి రాజా బ్రిటిష్‌ వారిపై సాగించిన పోరాట చరిత్రను స్వాతంత్య్రోద్యమ చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించారు. కేరళ సింహంగా పేరొందిన పఝస్సి రాజా సమాధులు మనంతవాడి, వాయనాడ్‌లలో ఉన్నాయి.

విస్తారమైన కాఫీ తోటలు, తేయాకు తోటలు, యాలకులు, మిరియాలు, వెనీలా తోటలను చూస్తుంటే మైమరిచిపోతాం. 14 కిలోమీటర్ల పొడవున్న కొండదారిని తమరస్సెరీ చురమ్‌ అంటారు. ఇదే వాయనాడ్‌కు స్వాగతద్వారం. పొరుగునున్న కోజికోడ్‌ జిల్లాతో వాయనాడ్‌ను కలిపే మార్గం ఇదే. అన్నింటికంటే పైన ఉండేది లక్కిడి హిల్‌ స్టేషన్‌.చరిత్ర పూర్వ యుగం నాటి పటాల్లో ఎడక్కల్‌ గుహలు మనకు కనిపిస్తాయి. ఇక్కడి చరిత్ర పూర్వయుగం నాటి రాతి కట్టడాలు చాలా ప్రసిద్ధి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారులు, జీవశాస్తవ్రేత్తలు, పురాతత్వ శాస్తవ్రేత్తలు, వెల్లువలా ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి గుహల్లో ఉన్న పెట్రోగ్లిఫ్‌లు ఐదువేల సంవత్సరాల కంటే ముందు కాలం నాటివని చెబుతుంటారు.

చూడాల్సినవివే...
బ్రహ్మగిరి పర్వత పాదాల్లో ఉన్న తిరునెల్లి దేవాలయం, పులియర్మాలలోని అనంతానంత స్వామి దేవాలయం, శ్రీమహాగణపతి దేవాలయం, పల్లిక్కున్ను చర్చి వంటివి వాయనాడ్‌లో చూడాల్సిన ప్రదేశాలు. చెంపారా శిఖరం, బాణాసుర సాగర్‌ డ్యాం, కురువు ద్వీపం, సూచిపార, పంతపార మీన్ముట్టి జలపాతాలు ఇవన్నీ కలిసి మెప్పాడి అంబాలావయల్‌ ప్రాంతంలో పర్యటించేవారికి విభిన్న అనుభూతులను అందిస్తాయి. కాబానీ నది వాయనాడ్‌కు జీవనది లాంటిది. కాళింది, మనంతావడి, పనమారం అనేవి దాని ఉపనదులు.
http://www.indialine.com/travel/images/meenmutty-falls-wayanad.jpg
రాష్ట్రంలోని ఆదివాసీలలో 36 శాతం మంది ఇక్కడే ఉంటారు. వారిలో పానియాలు, ఆదియాలు, ఊరలీలు, కురుమలు, కట్టునాయక్కన్లు ఉన్నారు. కర్నాటక నుంచి 13వ శతాబ్దంలో జైనులు ఇక్కడికి వచ్చారు. హిందువుల్లో అగ్రవర్ణాలుగా పేరొందిన నాయర్లు 14వ శతాబ్దంలో వచ్చి, ఇక్కడ వారి భూస్వామ్య వ్యవస్థను నెలకొల్పారు. ఆ తర్వాత ముస్లింలు వచ్చారు. 1950లలో ఉత్తరాది జిల్లాల నుంచి వలస వచ్చిన క్రిస్టియన్లు వాయనాడ్‌ జిల్లాలో మొక్కల పెంపకం సంస్కృతికి ఆద్యులు.http://kunzum.com/wp-content/uploads/2011/05/kerala-wayanad-kuruva-280311-0036.jpg
కన్నూరు జిల్లాలోని ఓ చిన్న తీరప్రాంత గ్రామమైన ముఝప్పిలంగడ్‌ ఇప్పుడు కేరళకు వచ్చే పర్యాటకులకు స్వర్గధామంగా విలాసిల్లుతోంది. భారతదేశంలోనే రెండో అతి విస్తారమైన ఈ బీచ్‌ ఉత్తర కేరళలో కన్నూరుకు దక్షిణంగా 15 కిలోమీటర్ల దూరంలోనూ, తలస్సెరికి ఉత్తరంగా ఏడు కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఇక్కడున్న అడ్వెంచర్‌ టూరిజం అకాడమీ వారు సీ సర్ఫింగ్‌, పారాగ్లైడింగ్‌ వంటి జల క్రీడలను అందిస్తారు. యూరప్‌కు, తలస్సెరికి ఉన్న చారిత్రక బంధాల కారణంగా యూరోపియన్‌ పర్యాటకులు ఇక్కడికి ఎక్కువగా వస్తూ, ముఝప్పిలంగడ్‌ అందాలను ఆస్వాదిస్తారు. ఇటీవలికాలంలో ఇటు స్వదేశీ పర్యాటకులతో పాటు అటు విదేశీ పర్యాటకులను కూడా పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తున్న ఈ పట్టణం ఇప్పుడు ప్రముఖ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతోంది.
ముఝప్పిలంగడ్‌ తురుతు (ద్వీపం) అంజరకాండి నది మధ్యలో ఉంటుంది. ఇది బీచ్‌కు చాలా సమీపంలో ఉంది.

ముఝప్పిలంగడ్‌కు అత్యంత సమీపంగా ఉండే ధర్మదాం ద్వీపం మరో అదనపు ఆకర్షణ. కొబ్బరి చెట్లు, పొదలతో నిండి ఉండే ఈ ద్వీపం బీచ్‌ నుంచి చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది. పశ్చిమ ప్రాంతంలోని అరేబియన్‌ మహా సముద్ర జలాలతో మూడువైపులా ఇది చుట్టుముట్టి ఉంటుంది. ఈ అందాల ద్వీపం ప్రైవేటు ఆస్తి కావడం దీన్ని సందర్శించడానికి అనుమతి తీసుకోవాల్సివుంటుంది. చరిత్రకారుల కథనం ప్రకారం, ధర్మదాంను ఇంతకుముందు ధర్మపట్టణం అని పిలిచేవారు. దీనికి బౌద్ధమూలాలున్నాయి. త్వరలోనే బీచ్‌ నుంచి ధర్మదాం ద్వీపానికి రోప్‌వే రూపుదిద్దుకుంటోంది.

ఇది పూర్తయితే... ప్రపంచంలోకెల్ల ఇదే అతిపెద్ద రోప్‌వేగా పేరుగాంచనుంది. అంతేకాకుండా పర్యాటకులకు అది అదనపు ఆకర్షణ అవుతుంది. కన్నూరులో ఉన్న తలస్సెరీ, పయ్యాంబళం బీచ్‌లు కూడా తప్పనిసరిగా చూసి తీరాల్సిన ప్రాంతాలే. ఇంతకుముందు ఫ్రెంచి కాలనీగా ఉంటూ, ఇప్పుడు పుదుచ్చేరిలో భాగమైన మాహే కూడా ముఝప్పిలంగడ్‌కు సమీపంలో ఉన్న మరో ఆకర్షణీయమైన ప్రదేశం.

No comments:

Post a Comment